రెంజల్/ ఎడపల్లి, ఏప్రిల్ 24 : గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు మాయ మాటలు, అబద్ధపు హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రెంజల్మండలం సాటాపూర్, నవీపేట, ఎడపల్లి మండల కేంద్రాల్లో బుధవారం రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తిరగబడతారేమోనన్న భయంతో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి పోలీసులను వెంటేసుకొని గ్రామాల్లో తిరుగుతున్నాడని విమర్శించారు.
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలుచేస్తామని హామీలు గుప్పించి అధికారం చేజిక్కించుకున్న ఎమ్మెల్యేను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. పార్టీ మారాలంటూ సుదర్శన్రెడ్డి బెదిరింపులు తట్టుకోలేకే బోధన్ ఎంపీపీ భర్త బుద్దె రాజేశ్వర్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడని ఆరోపించారు. 420 కాంగ్రెస్ పార్టీ మాయలో పడకుండా జాగ్రత్తపడాలని సూచించారు. బీజేపీకి ఎన్నికలు వస్తేనే రాముడు, ధర్మం గుర్తుకు వస్తుందని విమర్శించారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకొని సీఎం పదవిలో ఉన్న రేవంత్రెడ్డి సిరిఫ్ ఏక్సాల్కా బాద్షా అని పేర్కొన్నారు. ప్రచారంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతీమా, స్థానిక నాయకులు పాల్గొన్నారు.