నచ్చిన పనిలో ఆనందం ఉంటుంది. మనం చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడితే సంతృప్తి లభిస్తుంది. ఈ రెండూ ఆ యువకుడి జీవితంలో పుష్కలం. మహబూబాబాద్కు చెందిన భరత్.. గిరిజనుల జీవితాలపై అధ్యయనం చేశాడు. వాళ్లకంటూ ఉపాధి మార్గాలు చూపాడు. ఆ సామాజిక బాధ్యతకు, నాయకత్వ లక్షణాలకు గుర్తింపుగా యూకేలోని ససెక్స్ యూనివర్సిటీలో చదివేందుకు చెవెన్నింగ్ స్కాలర్షిప్ పొందాడు. అతికొద్ది మందికే లభించే అరుదైన అవకాశం ఇది. ఈ సందర్భంగా తన జీవితాన్ని మలుపు తిప్పిన అనేక సంఘటనలు వివరించాడు భరత్ ( Bharath ).
నాపేరు భరత్కుమార్ మెరుగు. మహబూబాబాద్ జిల్లా, నర్సింహులుపేట మండలం, ముంగిమడుగు గ్రామం. ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా ‘డెవలప్మెంట్ ఆల్టర్నేటివ్స్’ అనే అంతర్జాతీయ ఎన్జీఓలో అసిస్టెంట్ ప్రోగ్రాం డైరెక్టర్గా పనిచేస్తున్నా. గిరిజన ప్రాంతాల ఆర్థిక అభివృద్ధి నాకు ఇష్టమైన అంశం. ఆ అనుభవంతోనే ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్లో మాస్టర్స్ చేసే అవకాశం దక్కింది. యూకేలోని ససెక్స్ యూనివర్సిటీకి అనుబంధంగా పనిచేస్తుందీ సంస్థ. ఏడాది వ్యవధి కలిగిన ఈ కోర్సులో భాగంగా సామాజిక, ఆర్థిక అవసరాలపై ప్రపంచదేశాల్లో అమలులో ఉన్న అత్యుత్తమ విధానాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో నేను చేపట్టే ప్రాజెక్టులకు ఈ అనుభవం ఉపయోగపడుతుంది. నా విద్యాభ్యాసం చాలావరకు వరంగల్లో కొనసాగింది. తర్వాత హైదరాబాద్లోని భద్రుక కాలేజీ నుంచి ఎంబీయే పట్టా పొందాను.
కనుమరుగు అవుతున్న గిరిజన సమూహాలపై గత ఆరేండ్లుగా అధ్యయనం చేస్తున్నా. నిజానికి, ఇది నాకు చాలా ఇష్టమైన విషయం. అందుకే, చదువు పూర్తి కాగానే.. తమిళనాడులోని ముదుమలై అటవీ ప్రాంతానికి వెళ్లాను. కేరళ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల కూడలిలో ఉంటుందా చోటు. అక్కడ బెట్టకురుమ, ముల్ల కురుమ, కట్టు నాయకన్స్, పనియా అనే తెగలు ఎక్కువగా ఉన్నాయి. వారు చాలా అమాయకులు. సామాజికంగా, ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నారు. తేనె సేకరించి అమ్మడమే ప్రధాన వృత్తి. కానీ, వారికి గిట్టుబాటు ధర రావడం లేదు. దళారులదే రాజ్యం. ఆ దోపిడిని అరికట్టడానికి గిరిజనులతో సొసైటీ ఏర్పాటు చేయించాం. అటవీ ఉత్పత్తులకు మంచి ధర వచ్చేలా చేశాం. తేనె విషయమే తీసుకోండి. కిలో నూట ఇరవై రూపాయలు కూడా పలికేది కాదు. మా పోరాటంతో నాలుగు వందలా ఇరవై రూపాయలు లభించింది. గిరిజనులూ చాలా సంతోషించారు. ఆ ప్రయోగం విజయవంతం కావడంతో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ కూడా నెలకొల్పాం. ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ విషయంలో మంచి శిక్షణ ఇచ్చాం. అవసరమైన మెషినరీ సమకూర్చాం. దీంతో ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఎన్నో జీవితాలు బాగుపడ్డాయి. ఆర్థికంగా స్థిరపడటంతో పిల్లల్ని చదివిస్తున్నారు. మంచి తిండి తింటున్నారు. ఆరోగ్యంగానూ ఉంటున్నారు. ఈ ప్రయత్నంలో అటవీ శాఖను, శాస్త్ర సాంకేతిక శాఖను, గిరిజన సంక్షేమశాఖను భాగస్వాములను చేశాం. అందుకే ఇంత మెరుగైన ఫలితాలు లభించాయి.
పనితోనే పేదరికాన్ని దూరం చేయగలం. అందుకే, పట్టుబట్టి దట్టమైన అడవిలో పేపర్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయించాం. ముదుమలై టైగర్ రిజర్వ్ ప్రసిద్ధ పర్యాటక స్థలం. ఇక్కడికి వేలమంది టూరిస్టులు వస్తుంటారు. చాలా చెత్త పోగవుతుంది. ఆ చెత్తనే ముడిసరుకుగా మార్చి గిరిజనులకు ఉపాధినిస్తున్నాం. ముదుమలై అటవీ ప్రాంతంలోని 225 గ్రామాల్లో పనిచేశాను. హర్యానాలోనూ కొన్ని ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించాను. 2500 మంది మహిళలను ఆంత్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దే ప్రాజెక్టులో పనిచేశాను. ఈ అనుభవాలన్నీ ఎంతో సంతృప్తిని ఇచ్చాయి. విలువైన పాఠాలను నేర్పాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యూనివర్సిటీలో చదువుకునేందుకు మార్గం సుగమం చేశాయి. సోషల్ వర్క్లో నా నాయకత్వ లక్షణాలను, అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఈ స్కాలర్షిప్ ప్రకటించారు. నీతి ఆయోగ్ మాజీ చైర్మన్ అమితాబ్కాంత్ కూడా గతంలో ఈ స్కాలర్షిప్ అందుకోవడం నాకు గర్వకారణం. ఈసారి నాతోపాటు ఇండియా నుంచి 40 మంది వరకూ ఎంపికయ్యారు. ఇందులో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు ఉన్నారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి నిపుణులూ ఉన్నారు. ఈ కోర్సు ద్వారా ప్రపంచ దేశాల విధి విధానాలను అధ్యయనం చేసే అవకాశం లభిస్తుంది. వాటిని మనకు ఎలా అన్వయించుకోవాలో అర్థం అవుతుంది. నా ఆలోచనలను సువిశాలం చేసుకోవడానికి ఇదో మంచి అవకాశం.
మన ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలం. సామాన్యులు సైతం ఒక్క పైసా ఖర్చులేకుండా అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీల్లో చదివేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి. వివిధ స్కాలర్షిప్లు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా అందిపుచ్చుకోవచ్చు. అందుకు నేనే ఉదాహరణ. కలల్ని నిజం చేసుకునే విషయంలో యువత రాజీపడకూడదు.
✍ నాగోజు సత్యనారాయణ
“డబ్బు సంపాదించడం ఎలా.. మీ కోసమే ఈ సలహాలు”