Kasi Majili Kathalu Episode 76 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : గిరివ్రజమనే పట్టణపు యువరాణి ప్రఫుల్ల. ఆమె తాను పెంచుకుంటున్న అడవి చిలకకు మాటలు రావడం కోసం మువ్వలను కట్టింది. అంతే, అకస్మాత్తుగా ఆ చిలక పురుషుడిగా మారిపోయింది. తన పేరు కళాభిరాముడని ఆ పురుషుడు చెప్పాడు. తనకు మువ్వలమ్మిన కోయవనిత కోసం యువరాణి ప్రయత్నించింది. కానీ, మరునాడు ఆ కోయవనిత భర్త మాత్రమే కనిపించాడు.
“తెలియకపోవడం ఏమిటి? మాకు చిలక మంత్రాలకంటే గుర్రం మంత్రాలే బాగా తెలుసు” అన్నాడు కోయదొర నవ్వుతూ. “అయితే ఓసారి లోపలికి రా” అంటూ తీసుకు పోయాడు సుబ్బిశెట్టి. అతని పెరట్లో కట్టేసిన గుర్రం.. కోయదొరను చూడగానే ఉత్సాహంగా సకిలించింది. అతను దానిని గుర్తించాడు. అయినా తెలియనట్లుగా నటిస్తూ.. “శెట్టిగారూ! ఇంత మంచి గుర్రం ఎక్కడ దొరికింది మీకు?” అని ప్రశ్నించాడు. సుబ్బిశెట్టి తెలివితక్కువ వాడు కాదు.
“దీనిని మా అల్లుడు పారశీక దేశం నుంచి తెప్పించాడు. దీనిని హెచ్చువెలకు అమ్మాలంటే ఈ గుర్రాన్ని చిలకగా మార్చి మన దేశం దాటించాలి. గుర్రాలను చిలకలుగా, చిలకలను గుర్రాలుగా మార్చే మంత్రాలు నీకు తెలిసుంటే చెప్పు.. చక్కని వ్యాపారం సాగుతుంది. నీ వాటా నీకిచ్చేస్తాను” అన్నాడు రహస్యంగా సుబ్బిశెట్టి.
“ఇదిగో.. ఈ ఓషధిని చీకటి పడిన తరువాత గుర్రం మెడ వద్ద తగిలించండి. ఏం జరుగుతుందో చూడండి” అని చెప్పి, కోయదొర తన బహుమానాన్ని తీసుకుని అక్కణ్నుంచి వెళ్లిపోయాడు. ఆ వీధిలో సుబ్బిశెట్టితోపాటుగా మరో ముగ్గురు వర్తక ప్రముఖులు ఉన్నారు. వారందరి దగ్గరా గుర్రాలు ఉన్నాయి. ఒక్కొక్కరే విడివిడిగా కోయదొరను తమ ఇళ్లకు తీసుకుపోయి, గుర్రాలను చూపించి.. వాటిని చిలకలుగా మార్చమని కోరారు. వారందరికీ ఓషధీ లతలు దొరికాయి. ఆ తరువాత కోయదొర వేరొక వీధికి వెళ్లి పోయాడు. అక్కడ ఇద్దరు పురుషులు కోయదొరకు
ఎదురుగా వచ్చారు.
“అన్నయ్యా!” అని పిలుస్తూ అతణ్ని హత్తుకున్నారు. కోయ వేషాలలో కాకుండా రాజపుత్రుల్లా కనిపిస్తున్న వారిద్దరినీ చూసి కోయదొర అమితమైన ఆనందాన్ని కనబరిచాడు. కొద్దిసేపు వాళ్లు ముగ్గురూ తమలో తాము ఏవేవో సంగతులు కలబోసుకున్నారు. చివరిగా.. “తమ్ముళ్లూ! మన గుర్రాలు నాలుగూ ఈ ఊరిలోని వర్తకులకు దొరికాయి. వాళ్లకు నేను కొన్ని ఓషధులు ఇచ్చాను. ఆ ఓషధులు తాకగానే మన గుర్రాలు మళ్లీ చిలకలై ఎగిరిపోతాయి. కొద్దిసేపటిలో మన వద్దకు వచ్చేస్తాయి” అని చెప్పాడు కోయదొర. “అన్నయ్యా! ఇంతకీ ఈ మువ్వలేమిటి? ఓషధులేమిటి?! ఇవన్నీ నువ్వెక్కడ సంపాదించావు? అసలింతకీ మేమంతా చిలకలై పోవడానికి కారణం ఏమిటి?!” అని ప్రశ్నించారు రాజపుత్రులు. “అంతా చెబుతాను కదా.. పదండి” అంటూ దారి తీశాడు కోయదొర.
* * *
అప్పటికి సమయం సాయంత్రం కావస్తున్నది. యువరాణి ప్రఫుల్ల తన మందిరంలో స్నేహితురాళ్ల ఆగమనం కోసం ఎదురు చూస్తున్నది. తొందరలోనే వారు రానే వచ్చారు. “కాళిందీ! రుక్మవతీ! మీరిద్దరూ మీకు నేనిచ్చిన మువ్వలను మీ చిలకలకు కట్టారా? ఆ తరువాత ఏదైనా అద్భుతాన్ని చూశారా?” అని ప్రశ్నించింది ప్రఫుల్ల. “చూశాం యువరాణీ! ఆ చిలకలు చూస్తుండగానే సుందరమూర్తులైన పురుషులుగా మారిపోయారు. ఇదేదో ఇంద్రజాలంలా ఉంది” అని ముక్తకంఠంతో జవాబిచ్చారు వాళ్లిద్దరూ. “వాళ్లను మీరు పలకరించారా? ఇంతకూ ఎవరు వాళ్లు?” మళ్లీ అడిగింది యువరాణి. “చెప్పారు యువరాణీ! నా మందిరంలో ఉన్న
పురుషుడి పేరు సుధర్ముడట. కన్యాకుబ్జపు యువరాజునని చెప్పుకొన్నాడు” అన్నది కాళింది. “ఆశ్చర్యంగా ఉందే.. నా మందిరంలో ఉన్నవాడూ ఆ రాజ్యపు యువరాజే! అతని పేరు సులోచనుడట” అని చెప్పింది రుక్మవతి.
వారి మాటలు ఆలకిస్తూనే లోపలినుంచి కళాభిరాముడు బయటికి వచ్చాడు. అతణ్ని చూస్తూనే కాళింది, రుక్మవతి ఆశ్చర్యపోయారు.“నా మందిరంలో ఉన్న పురుషుడు అచ్చంగా ఇతని పోలికలోనే ఉన్నాడు” అన్నారు వారిద్దరూ ఒకేసారి.
“చెలులారా! మీ మందిరంలో రహస్యంగా ఉన్న వారిద్దరినీ వెంటనే ఇక్కడికి తీసుకురండి” అని చెప్పి పంపింది యువరాణి. కొద్దిసేపటికే తిరిగి వచ్చి.. “వాళ్లిద్దరూ మందిరాల్లో లేరు. ఏమైపోయారో!?” అని సమాచారం తెచ్చారు కాళింది, రుక్మవతి. “అయ్యో! ఇంతలోనే నా తమ్ముళ్లు ఏమైపోయారు” అని చింతాక్రాంతుడు అయ్యాడు కళాభిరాముడు. ఇంతలో మందిరం బయట కలకలం చెలరేగింది.
* * *
ఆ కలకలం వెనుక ఒక కారణం ఉంది.ఆ కోయదొర పట్టణంలో అనేక చోట్ల మువ్వలను అమ్మాడు. కానీ, అన్నిచోట్లా ఒకేలాంటి వింతలు కనిపించ లేదు. మూడుచోట్ల చిలకలు కాస్తా పురుషులయ్యాయి. నాలుగుచోట్ల గుర్రాలయ్యాయి. అలా ఉండగా ఒక వేశ్య తాను బంగారు పంజరంలో పెట్టి పెంచుకుంటున్న చిలకకు కూడా మువ్వలు కట్టింది. వెంటనే ఆ చిలక బ్రహ్మరాక్షసుడిగా మారిపోయింది. ఎదురుగా ఉన్న వేశ్యమాతను మింగేసింది. ఆ ఇంటిలోని మిగిలినవారిపై కూడా పడబోతుంటే ఎక్కడివాళ్లక్కడ పారిపోయారు. అటుపైన ఆ బ్రహ్మరాక్షసుడు గిరివ్రజంలో వీర విహారం చేస్తూ యువరాణి మందిరం వరకు చొచ్చుకు వచ్చాడు. అక్కడున్న దాసీజనం హాహాకారాలు చేయ సాగారు. ఓ పరిచారిక ఆ బ్రహ్మరాక్షసుని చేతికి చిక్కింది. వాడు ఆమెను తినబోతుండగా కళాభిరాముడు రౌద్రావేశాలతో కరవాలం దూసి ఆ రాక్షసునిపై దూకాడు. అప్పుడు ఆ రాక్షసుడు పరిచారికను విడిచిపెట్టి, కళాభిరాముణ్ని ఎత్తుకుని భుజంపై వేసుకున్నాడు.
మందిరంలోని స్త్రీలందరూ ఆక్రందనం చేస్తుండగా.. రాక్షసుడు ఆకాశంలోకి ఎగిరి, కోట దాటి ఆవలకు పోసాగాడు. ఆ సమయంలో కళాభిరాముడు తన కరవాలంతో బ్రహ్మరాక్షసుని కుడిచేతిని నరికేశాడు. పెద్ద మర్రిచెట్టులా ఆ చెయ్యి నేలకు కూలిపోయింది. రాక్షసుడు పెద్దగా బొబ్బలు పెడుతూ అలాగే ఆకాశంలో ఎగరసాగాడు. రాజవీధిలోకి వచ్చేసరికి గుర్రాలపై వచ్చిన ముగ్గురు అన్నదమ్ములు.. వాణ్ని చూశారు. కిందినుంచే బాణాలతో రాక్షసుణ్ని తీవ్రంగా బాధించసాగారు. పాదాల్లోనూ, పొట్టమీద, ముక్కులోనూ వరుసగా గుచ్చుకుంటున్న బాణాలతో రాక్షసుడు అల్లాడిపోయాడు. దాంతో తాను ఎత్తుకున్న కళాభిరాముణ్ని విడిచిపెట్టేశాడు.
పెద్దగుహలాగా ఉన్న నోరు తెరిచి, నాలుక బయటపెట్టి కోయదొరను మింగడానికి ముందుకు దూసుకు వచ్చాడు. ఆ మహావీరుడు కరవాలంతో ఆ నాలుకను రెండుగా చీల్చివేశాడు. రాక్షసుడు మొర్రోమంటూ అక్కణ్నుంచి పరిగెత్తాడు. కళాభిరాముడు తన అన్నలను గుర్తించాడు. వాళ్లు నలుగురూ వాణ్ని విడిచిపెట్టకుండా వేట కుక్కలు అడవి పందిని తరిమినట్టు తరమసాగారు. వీధులన్నీ తిప్పుతూ ఎక్కడా నిలవడానికి అవకాశం ఇవ్వకుండా కొట్టసాగారు. చివరికి ఊరి బయటికి తీసుకుపోయి వాడి అవయవాలన్నీ ఖండఖండాలుగా నరికివేశారు. మేఘం గర్జించినట్లుగా ఒక్కసారిగా పెద్దశబ్దం చేసి, ఆ బ్రహ్మరాక్షసుడు ప్రాణం విడిచిపెట్టాడు. గిరివ్రజం ప్రజలందరికీ ఆ దృశ్యం ఆనందాన్ని కలిగించింది. పెద్ద కష్టాన్ని తప్పించుకున్నామన్న ఆనందంలో ఒకరినొకరు కౌగిలించుకుని సంతోషం వ్యక్తపరుచుకోసాగారు.
* * *
గిరివ్రజాన్ని ఏలే రాజు సోమదత్తుడు. ఇదంతా జరుగుతున్నప్పుడు ఆయన వేటకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి, ఎవరో ఒక బ్రహ్మరాక్షసుడు పట్టణంలో చొరబడ్డాడని.. వాణ్ని నలుగురు వీరులు సంహరించారని తెలియవచ్చింది. జరిగిన దానిపై విచారణ చేపట్టిన సోమదత్తునికి.. ఒక వేశ్య పెంచుకుంటున్న చిలక అకస్మాత్తుగా రాక్షసునిగా మారిపోయిందని తెలిసింది. వరుసగా ఒక్కొక్కరినీ పిలిచి విచారిస్తుంటే చిలకలు గుర్రాలుగా మారిన వైనం కూడా తెలియవచ్చింది. ఎవరో కోయదొర అమ్మిన మువ్వల వల్లే ఇదంతా జరిగిందని.. బ్రహ్మరాక్షసుణ్ని సంహరించిన వీరులలో ఆ దొర కూడా ఉన్నాడని సాక్షులు తెలియచేశారు.
“ఇంతటి ఆపదనుంచి రాజ్యపౌరులను రక్షించిన మహావీరులను తప్పకుండా సన్మానించాల్సిందే! కానీ వారెవరో.. ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పండి” అన్నాడు సోమదత్తుడు.
“వారు ప్రస్తుతం మీ కోటలోనే అతిథులుగా ఉన్నారు మహాప్రభూ!” అని అధికారులు నివేదించారు. దాంతో నలుగురు అన్నదమ్ములనూ దర్బారుకు పిలిపించారు. వారిని సోమదత్తుడు యధోచితంగా సన్మానించాడు.
“ఆర్యులారా! మీరెవరు? ఏ దేశానికి చెందినవారు? తల్లిదండ్రులెవరు? మీకీ చిలక రూపాలు ఎందుకు వచ్చాయి?! దయచేసి మీ వృత్తాంతాన్ని వివరంగా తెలియచేయండి” అని కోరాడు. ఆ నలుగురు అన్నదమ్ములలోనూ అప్పటివరకూ కోయదొరగా చలామణి అయినవాడు.. ఆ వేషాన్ని విడిచిపెట్టి రాజోచితమైన దుస్తులు ధరించాడు. కానీ, భుజంమీద చిలకను మాత్రం అలాగే ఉంచుకున్నాడు. అతను తమ కథను ఇలా చెప్పసాగాడు.
“రాజా! మేం కన్యాకుబ్జాన్ని ఏలే తాళధ్వజుని కుమారులం. నా పేరు హరివర్మ. వీళ్లు నలుగురూ నా తమ్ముళ్లు. మేము మా అన్నగారైన విద్యాసాగరుని నేతృత్వంలో ఉత్తర దిగ్విజయ యాత్రకు బయల్దేరాం. అనేకమంది రాజులను పాదాక్రాంతులను చేసుకున్నాం. అంతటితో తృప్తి చెందకుండా యవ్వనమదంతో దిగంతం వరకూ చూడాలని మహా ఉత్సాహంతో సేనలతోసహా వెళ్లసాగాం. జనపదాలను దాటి, చాలాదూరం మహారణ్యాలలో సంచారం చేశాం. ఒకచోట మేము గుర్రాలెక్కి పోతుండగా ఒక జంఝామారుతం ప్రళయ ప్రభంజనంలాగా వీచి వీచి.. మమ్మల్ని చొప్పాకులలా ఎగరగొట్టింది. ఆ గాలి తాకిడికి.. మా అన్న అయిన విద్యాసాగరుడు ఒక దిక్కుకు, మేం నలుగురమూ వేరొక దిక్కుకూ కొట్టుకుపోయాం.
గుర్రాలతోసహా మేం దూదిపింజల్లా ఎగురుతూ చాలాదూరం పోయిపోయి.. ఒక మహాపర్వతం సమీపానికి చేరుకున్నాం. ఇంతలో గాలి చల్లారింది. అప్పుడు మేం అశ్వాలు దిగి కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాం. ఆ కొండ చుట్టుపక్కల ఏవైనా గ్రామాలు ఉన్నాయో తెలుసుకోవడం కోసం గుర్రాలతోసహా పైకి ఎక్కసాగాం. కొండ శిఖరంపై నిలిచి దక్షిణదిక్కంతా చూస్తే మహారణ్యం కనిపించింది. పెద్దపెద్ద నదులు వెండితీగల్లా కనిపించాయి. దాంతో ఉత్తరదిక్కుగా ప్రయాణం మొదలుపెట్టాం.
ఆ మార్గంలో చాలాదూరం వెళ్లిన తరువాత మనోహరమైన ప్రాంతం ఒకటి కనిపించింది. అక్కడ ఒక సరస్సు కనిపించగానే మాకందరికీ బడలిక తీరేలా అందులో స్నానం చేయాలని తోచింది. నేను గుర్రాలను కట్టివేస్తూ గట్టుపై ఉండగా నా సోదరులు ముగ్గురూ అందులో దిగారు. దోసిళ్లతో నీరుపట్టి మూడుగుక్కలు తాగేసరికి.. వాళ్లు ముగ్గురూ చిలకలై, ఉత్తరదిక్కుగా ఎగిరిపోసాగారు. నేను పేర్లు పెట్టి పిలిచినా వాళ్లకు అందలేదు. జరుగుతున్న అనర్థాన్ని ఎలా ఆపాలో నాకు తెలియలేదు. పక్షులతో పాటు నేను ఎగరలేను కదా! కొద్దిదూరం వాటిని అనుసరిస్తూ పరుగెత్తేసరికి నా కంటికి కనిపించనంత దూరం ఎగిరిపోయాయి.
‘అయ్యో.. అన్నగారేమయ్యారో తెలియదు. తమ్ముళ్లు చూడబోతే ఇలా అయ్యారు. ఇక నేనొక్కణ్నీ బతికుండి ప్రయోజనం ఏముంది? నేను కూడా ఆ చెరువులో దిగి.. చిలకనైపోతాను’ అనుకున్నాను. కానీ, అతి ప్రయత్నం మీద దుఃఖాన్ని తగ్గించుకుని, నా తమ్ముళ్ల రూపం మార్చడానికి ప్రయత్నిస్తే.. అందరం సుఖంగా బతకవచ్చు కదా అనుకున్నాను. ఆ చెరువుకు మూడు ప్రదక్షిణలు చేసి.. ‘ఓ కాసార రాజమా! నీ ప్రభావం మహానదులకు కూడా లేదు. నీకు ఇటువంటి సామర్థ్యం ఎలా వచ్చిందో దయచేసి తెలియచేయి’ అని ప్రార్థించ సాగాను. అంతలో దప్పికతో ఉన్న మా గుర్రాలు నాలుగూ చెరువులో దిగాయి. చూస్తుండగానే అవి కూడా చిలకలై ఉత్తరదిక్కుకు ఎగిరిపోయాయి. ఆ తరువాత చాలారోజులపాటు నేను అక్కడే గడిపాను. ఎన్నోరకాలుగా ఆ చిలకల గుట్ట మర్మాన్ని ఛేదించడానికి ప్రయత్నించాను. కానీ, సఫలం కాలేకపోయాను. ఒంటరిగా ఇంటికి పోవడానికి మనసు అంగీకరించలేదు. దాంతో గుండె రాయి చేసుకున్నాను. నేను కూడా ఒక చిలకనై నా తమ్ముళ్లను వెతకడం ఒక్కటే మార్గమని నిశ్చయించుకున్నాను. చెరువులో దిగి.. ‘భగవంతుడా! నా ప్రయత్నం సఫలం కాకపోతే.. ముందుజన్మలో అయినా ఇటువంటి కష్టాలు లేకుండా చేయి’ అని చివరిసారిగా కళ్లు మూసుకుని ప్రార్థించి, నీటిని దోసిలికి తీసుకున్నాను. అంతలో ఆ తటాకంలో పెద్దగా చప్పుడయ్యింది. అదిరిపడి కళ్లు తెరిచాను.
(వచ్చేవారం.. చిలకలగుట్ట మర్మం)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | చిలక పురుషుడు
Kasi Majili Kathalu | పాతాళాన్ని గెలిచిన మానవుడు
Kasi Majili Kathalu | సుధన్వుడి రససిద్ధి
Kasi Majili Kathalu | పాతాళ గుహ
Kasi Majili Kathalu | అపరాధ విచారణ
Kasi Majili Kathalu | రత్నాంగి తెచ్చిన తగాదా