Kasi Majili Kathalu Episode 75 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కన్యాకుబ్జాన్ని పాలించే తాళధ్వజుడనే రాజుగారి కుమారుల్లోఐదుమంది ఉత్తర దిగ్విజయ యాత్రకు వెళ్లారు. సుడిగాలిలో చిక్కుకుని చాలాదూరంగా ఎగిరి పడ్డారు. వాళ్లలో పెద్దవాడైన విద్యాసాగరుడు ఒక పెద్ద కోటగోడ దాటి.. అక్కడ రహస్యంగా పెరుగుతున్న కాశ్మీర యువరాణిని పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నాడు. మిగిలిన నలుగురు రాకుమారుల కథ ఇది.
కాశ్మీరానికి ఉత్తరంగా గిరివ్రజమనే గొప్ప పట్టణం ఉంది. ఆ పట్టణానికి మూడువైపులా పెట్టని కోటలా దేవకూటమనే పర్వతం.. ఆకాశాన్ని తాకుతూ నిలబడి ఉంది. ఆ కొండశిఖరాన్ని ఎక్కినవారు పక్షులై ఎగిరిపోతారని చెప్పుకొంటారు. ఆ కారణంచేత ఆ దేశపౌరులెవరూ కనీసం కట్టెలకోసం కూడా ఆ కొండ ఎక్కరు. పొరపాటుగానైనా ఎవరూ ఎక్కకుండా ఉండేందుకుగానూ పట్టణాధికారులు ఆ కొండచుట్టూ పెద్ద ప్రహరీ కట్టించారు. అలా ఉండగా.. ఒకనాటి మిట్టమధ్యాహ్నవేళ ఆ కొండకు ఆవలినుంచి ఒక కోయ వనిత గిరివ్రజం పట్టణంలోకి ప్రవేశించింది. ఆమె ఒంటిపై రంగురంగుల పూసల హారాలున్నాయి. భుజంమీద ఒక చిలక ఉంది. మరో భుజానికి వేలాడుతున్న తట్టలో కొన్ని మువ్వల గుత్తులున్నాయి. వాటిలోని కొన్ని గుత్తులు తీసి.. “మువ్వలమ్మా మువ్వలు! చిలక మువ్వలు!” అని మాటిమాటికీ అరుస్తూ, రాజమార్గంలో తిరుగుతున్నది ఆ కోయ వనిత.
ఆమె కేకలు విని, కొంతమంది పౌరులు దగ్గరికి వచ్చారు. ఆమె సోయగానికి అచ్చెరువొందుతూ.. “పిల్లా! నీదే ఊరు? ఏ కులం?! ఈ మువ్వల వెల ఎంత? నీ మగడెవ్వడు?!” అని ప్రశ్నించసాగారు.
అందుకామె.. “బాబులారా! మేం కోయవారం. మా కులగోత్రాలతో మీకేమి పని? కావాలంటే మువ్వలు కొనుక్కోండి. వీటి వెల తక్కువే కానీ, గొప్ప మహిమ కలిగినవి” అని చెప్పింది.
“ఏమిటా మహిమ?” అని రెట్టించారు కొందరు.
“ఈ మువ్వలు కడితే మాటలు రాని చిలకలైనా మాట్లాడతాయి. మాటకారి చిలకలైపోతాయి” అన్నది.
ఆమె మాటలు విని.. “మా ఇంటికిరా.. నీ మువ్వలు కొంటాం” అని పిలిచారు కొందరు ఆకతాయిలు.
వారి మాటల్లోని విరుపును గ్రహించిన కోయపిల్ల.. “చిలక లేనివారికి ఈ మువ్వలు అమ్మడానికి వీల్లేదని మా యజమాని శాసించాడు” అని నిక్కచ్చిగా చెప్పింది.
ఆమెను వింతగా చూస్తూ, కొంతమంది వెంబడించసాగారు. అలా సాయంత్రం వరకూ ఆమె కొన్ని మువ్వలమ్మింది. చీకటి పడేవేళకు ఒక సత్రాన్ని ఆశ్రయించింది. ఆ తరువాత మరో రెండురోజులపాటు ఆ పట్టణమంతా తిరుగుతూ మువ్వలమ్ముతూనే ఉంది. ఆమె సోయగాన్ని గురించి, మాటలు – చేష్టల గురించి పౌరులంతా అబ్బురంగా చెప్పుకోసాగారు.
ఒకనాడు ఆమె పట్టణంలో మువ్వలమ్ముతుండగా భద్రిక అనే పేరుగల పరిచారిక దగ్గరికి వచ్చింది.
“నిన్ను మా యువరాణి తీసుకురమ్మంది” అని ఆమెను కోటలోకి తీసుకుపోయింది.
గిరివ్రజం రాకుమారి పేరు ప్రఫుల్ల. ఆమె తన అంతఃపురంలో కూర్చుని ఉన్నది. కోయ వనిత రావడం గమనించగానే.. ఆమె తన ఆసనం మీదనుంచి లేచి నడిచివచ్చింది.
ఆమె సౌందర్యాన్ని ఆపాదమస్తకం తేరిపార చూసి అబ్బురపడుతూ.. “ఓ కోయెతా! నీ పేరేమి?” అని అడిగింది.
“నా పేరు కామాచ్చి” అని చెప్పింది ఆ కోయపిల్ల.
“మీదే ఊరు? పెళ్లయిందా?”.
“అన్ని ఊళ్లూ నావే. నాకు పెళ్లయింది” అని తన భుజంపై వాలి ఉన్న చిలకను చూపిస్తూ.. “ఇదిగో.. ఈ చిలకే నా మగడు. ఈ చిలక మూలాన్నే ఈ ఏసం కట్టాను. ఈ చిలకే నా జీవనం.. నా దైవం!”.
“పిల్లా! నీ మాటలు నాకర్థం కావడం లేదు. చిలక వల్ల జీవనం గడుస్తున్నదంటే సరే కానీ, చిలక మగడు ఎలా కాగలదు?”.
“అమ్మా! మా కొండమాటలు మీకర్థం కావు. మగడంటే ఎవరు? మనకోసం ఎవడైతే ప్రాణం ఇస్తాడో వాడే! నేనొక చిలకను. నాకీ చిలక!”.
ఆమె మాటలు విని, రాకుమారి నిట్టూర్పు విడిచింది.
“ఏమిటో నాకేమీ బోధపడటం లేదు. అది సరేకానీ, కొద్దిరోజుల కిందట మేం ఒక కొండచిలకను కొన్నాం. అది పళ్లు తినదు. మాట్లాడదు. బెంగపెట్టుకున్నది కాబోలు. దానికి మాటలు నేర్పు. నీకు మంచి పారితోషికం ఇప్పిస్తాను” అన్నది.
“మా మువ్వలు కొని, మీ చిలకకు కట్టడమే మాకు పారితోషికం. అమ్మా! పొద్దుపోయింది. ఇవిగో మువ్వలు.. రేపు మళ్లీ వస్తాను. ఈ రాత్రికి మువ్వలు చిలకకు కట్టి, ఎలా పలుకుతోందో చెప్పాలి” అంటూ అక్కణ్నుంచి కదలబోయింది కామాక్షి.
“కోయసానీ! ఎందుకింత తొందర? చీకటిపడితే ఎవరినైనా తోడిచ్చి పంపిస్తాలే! అది సరేకానీ నీకెంతమంది పిల్లలు?” అని ప్రశ్నించింది రాకుమారి.
“నేనే ఒక పిల్లను. నాకు పిల్లలేంటి?!” అని గమ్మత్తుగా నవ్వేసింది కామాక్షి.
“నీ ఆయన నువ్వంటే ప్రేమగా ఉంటాడా?!” అని అడిగింది రాకుమారి.
“ప్రేమ లేకేమి?! ఇదిగో.. నా మగడెప్పుడూ నన్ను విడిచిపెట్టకుండా నా నెత్తిమీదే ఉంటాడు” అన్నది తనవద్ద ఉన్న చిలకను చూపిస్తూ.
“కామాక్షీ! నువ్వు నిజం చెప్పకుండా దాస్తున్నావు. సరే.. నీ మువ్వలన్నీ నువ్వు చెప్పిన ధర ఇచ్చి కొంటాను. ఏవీ.. నీ బుట్టలో ఎన్ని గుత్తులున్నాయో చూపించు” అన్నది చొరవగా ప్రఫుల్ల.
“అమ్మా! మీ దగ్గర ఒక్క చిలకే కదా ఉందన్నారు. ఇన్ని మువ్వలు మీరేం చేసుకుంటారు?” అని ప్రశ్నించింది కామాక్షి.
“మా ఇంట్లో చాలా చిలకలున్నాయి. ఇవే కాకుండా మా మంత్రికూతురు, పినతల్లి కూతురు కూడా చిలకల్ని పెంచుతున్నారు. కాబట్టి ఇవన్నీ ఇచ్చేయాల్సిందే!” అంటూ ఆమె దగ్గరున్న మువ్వలన్నీ తీసుకుంది రాకుమారి.
“సరేనమ్మా.. సెలవిప్పించండి” అంటూ కదిలింది కామాక్షి.
“వీటికి వెల ఎంత ఇవ్వాలో చెప్పావు కావేం” అని మళ్లీ నిలువరించింది రాకుమారి.
“ఈ రాత్రికి మీరు వీటిని కట్టి.. మీ చిలక ఎలా పలికిందో రేపొద్దున్న చెప్పండి. మీరెంత ఇచ్చినా పుచ్చుకుంటాను” అంటూ వెళ్లిపోయింది కామాక్షి.
కోటనుంచి బయటికి వచ్చేసరికే చీకటి పడటంతో నేరుగా తన సత్రానికి వెళ్లిపోయింది కామాక్షి. తన గదిలోకి ప్రవేశించి.. భుజంపై ఉన్న చిలకకు ఏదో ఒక ఓషధీలతను తగిలించింది. వెంటనే ఆ చిలక చక్కని పురుషుడిగా మారిపోయింది. ఆ రాత్రి వాళ్లిద్దరూ ముద్దు ముచ్చట్లతో చక్కగా కాలక్షేపం చేశారు.
* * *
కామాక్షి వెళ్లిన కొద్దిసేపటికి.. ఆమె ఇచ్చిపోయినవి నిజమైన బంగారు మువ్వలనే సంగతిని గుర్తించింది రాకుమారి పరిచారిక భద్రిక.
“అమ్మా! వీటికి తక్కువ వెల కట్టలేం!” అన్నది కళ్లు టపటపలాడిస్తూ.
“సరే లేవే.. నువ్వు వీటిని మన కాళిందికి, రుక్మవతికి ఇచ్చిరా. వాళ్లు పెంచిన చిలకలకు కట్టుకోమను” అన్నది ప్రఫుల్ల.
ఆమె అటు వెళ్లగానే మువ్వగుత్తులు చేతిలోకి తీసుకుని.. తాను కొత్తగా కొన్న కొండచిలక ఉన్న పంజరం వద్దకు వెళ్లింది రాకుమారి. దానిని ఇవతలికి తీసి ముద్దాడుతూ.. “కీరరాజమా! ఈవేళ నీకు కొత్త నగలు కొన్నాను. చూడు.. నీ ముద్దు పలుకులు వినాలని వేడుకగా ఉంది. ఏదీ ఒకసారి రామా అను. ఒక పాట పాడు” అంటూ మువ్వలు దాని కాలికి, మెడకు కడుతుండగా.. ఆ చిలక గభాలున ఒక పురుషుడై ఎదుట నిలబడింది.
ఆ హఠాత్ పరిణామానికి రాజపుత్రిక జడుసుకుంది.
‘అమ్మయ్యో!’ అంటూ మూర్ఛపోయింది. ఆ పురుషుడు కలవరపడ్డాడు.
‘అయ్యయ్యో! ఈ చిన్నదెవరు? నన్ను చూసి ఇలా మూర్ఛ పోయిందేమిటి? అయినా నేనిక్కడికి ఎలా వచ్చాను? ఈ భవనం శుద్ధాంతంలా ఉంది. మా సోదరులేమయ్యారో తెలియడం లేదు. ఈమె మేలుకుంటే అడగవచ్చు’ అనుకోసాగాడు.
అంతలో ప్రఫుల్లకు మెలకువ వచ్చింది. అభినవ మదనుడిలా కనిపిస్తున్న ఆ పురుషుని వంక ఆరాధనగా చూసి, మోహపరవశయై కొంతసేపు ఏమీ మాట్లాడలేకపోయింది. చివరికి హృదయాన్ని దృఢపరుచుకుని అతనికి నమస్కరిస్తూ.. “ఆర్యా! మీ ఆకారం చూస్తే ఉత్తమ వంశ సంజాతుల్లా ఉన్నారు. మీ కన్నులు చూడగా అనిమిషులు కాదని అర్థం అవుతున్నది. మీరీ చిలక రూపం ధరించడానికి కారణం ఏమిటి? దయచేసి మీ వృత్తాంతం తెలియచేసి శ్రవణానందం కలగచేయండి” అని కోరింది.
అందుకతడు.. “పడతీ! ముందుగా నీ గురించి తెలుసుకోవాలి” అన్నాడు.
“సౌమ్యా! ఈ పట్టణానికి గిరివ్రజమని పేరు. మా తండ్రి సోమదత్తుడు దీనికి అధికారి. నాపేరు ప్రఫుల్ల. రెండునెలల కిందట నేను, నా సఖురాళ్లయిన కాళింది, రుక్మవతి కలిసి మూడు కొండచిలకలను కొన్నాం. ఈవేళ ఒక కోయవనిత ఈ పైడిమువ్వలు తెచ్చి, వీటిని కడితే చిలకలు మాట్లాడతాయని చెప్పడంతో కట్టాను. ఇంతలో తమ దర్శనమైంది” అని చెప్పింది రాకుమారి.
ఆ పురుషుడు ప్రఫుల్ల చెప్పిన మాటలన్నీ విన్నాడు.
“నాతీ! నేను కన్యాకుబ్జ దేశపు రాకుమారుణ్ని. నా పేరు కళాభిరాముడు. మేము ఐదుగురు సోదరులం కలిసి.. ఉత్తర దిగ్విజయం చేస్తూ అనేక రాజ్యాలను గెలుచుకున్నాం. ఒకనాడు ఒక అడవిలో పెద్దకొండగాలి విసిరి కొట్టడంతో.. మేమంతా గుర్రాలతో సహా చాలాదూరం ఎగిరిపడ్డాం. ఒక కొండ ఎక్కి అక్కడున్న తటాకంలోకి స్నానం కోసం దిగాం. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు. అంతా కలలాగా ఉంది. మా సోదరులు ఏమయ్యారో తెలియదు. నేను కొండవాని చేతికి ఎలా చిక్కానో తెలియదు. ఆ కోయెత ఇచ్చిన మువ్వలు కట్టగానే నిజస్వరూపం రావడం చిత్రంగానే ఉంది. నువ్వు అనుమతిస్తే వెళ్లి, ఆ పుణ్యాత్మురాలెవరో తెలుసుకుంటాను” అన్నాడు.
“సౌమ్యా! మీరు ఆమెను వెతుక్కుంటూ వెళ్లనక్కరలేదు. రేపొద్దున్న ఆమే ఇక్కడికి రాగలదు. అంతవరకు మీరిక్కడే భద్రంగా ఉండండి” అని బతిమాలింది ప్రఫుల్ల.
అతడు అంగీకరించాడు.
మరునాడు తెల్లవారుతూనే భద్రిక వచ్చింది.
“రాకుమారీ! నిన్నరాత్రి నీ దర్శనం కాలేదు. లోపల గదిలో ఒక్కదానివే ఏం చేస్తున్నావు?” అని ప్రశ్నించింది.
“తరువాత చెబుతాను కానీ, ముందు నువ్వు వెళ్లి ఆ కోయసానిని తీసుకురా. తనతో చాలా మాట్లాడాల్సి ఉంది” అని తొందరపెట్టింది రాకుమారి.
భద్రిక విస్తుపోతూ రాజవీధుల వెంట కామాక్షి కోసం వేచి చూడసాగింది. ఇంతలో.. “చిలక మువ్వలమ్మా!” అంటూ ఒక కోయదొర ఒక చిలకను భుజంపై ఉంచుకుని, వీధులవెంట తిరగడం కనిపించింది.
భద్రిక అతని దగ్గరికి వెళ్లి..“ఓ కోయదొరా! నిన్న ఎవరో ఒక కోయసాని ఇలాంటి మువ్వలే అమ్మకానికి తెచ్చింది. ఆమె నీకు తెలుసా?” అని ప్రశ్నించింది.
“ఆమె నా పెండ్లామే! ఈవేళ కొద్దిగా పని ఉండి బసలో నిలిచిపోయింది. దానిదగ్గర పైడిమువ్వలేమైనా కొన్నారా!?” అని తిరిగి ప్రశ్నించాడు అతను.
“అయ్యో!! ఆమె రాలేదా?! మేమంతా ఆమెకోసం ఎదురు చూస్తున్నాం. మా రాకుమారి అవసరంగా మాట్లాడాలంటున్నది. నువ్వెళ్లి ఓసారి తీసుకురాకూడదా?” అని బతిమాలింది భద్రిక.
“అమ్మా! ఈవేళ రావడానికి కుదరదు. రేపొద్దున్న తప్పకుండా పంపిస్తాను” అంటూ ఆ కోయదొర అవతలకు వెళ్లిపోయాడు.
భద్రిక ఆ వార్తను రాకుమారికి యథాతథంగా తెలియచేసింది.
“రేపు ఆ కోయెత రాకపోతే నేనే వెళ్లి తీసుకొస్తాను” అని ఆమెను ఒప్పించి.. తన పనిమీద వెళ్లిపోయింది భద్రిక.
భద్రికను కలిసిన తరువాత, ఆ కోయదొర రాజవీధులు దాటి.. కోమటి వీధికి వెళ్లాడు. ఆ వీధిలో ఉన్న నలుగురు పెద్ద వర్తకుల్లో ఒకడైన సుబ్బిశెట్టి కోయదొర కేకలు విని, దుకాణం నుంచి బయటికి వచ్చాడు.
“కోయదొరా! నీ మువ్వలకు నేను హెచ్చు వెలనిస్తాను. నాతో రా” అంటూ చేయిపట్టుకుని చాటుకు తీసుకుపోయాడు.
చుట్టూ ఓసారి పరికించి ఎవరూ లేరని నిర్ధారించుకున్న తరువాత.. “దొరా! నీకు చిలక మంత్రమేనా.. గుర్రం మంత్రాలేమైనా తెలుసా?” అని ప్రశ్నించాడు.
(వచ్చేవారం.. రాకాసి చిలక)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | పాతాళాన్ని గెలిచిన మానవుడు
Kasi Majili Kathalu | సుధన్వుడి రససిద్ధి
Kasi Majili Kathalu | పాతాళ గుహ
Kasi Majili Kathalu | అపరాధ విచారణ
Kasi Majili Kathalu | రత్నాంగి తెచ్చిన తగాదా
Kasi Majili Kathalu | విడిపోయిన జంట