Tippani sudhakar | వృత్తిరీత్యా ఆయనో వైద్యుడు. రోగులకు చికిత్స అందిస్తాడు. ప్రవృత్తి రీత్యా మాత్రం వ్యవసాయదారుడు. సేంద్రియ సాగు చేస్తూ ఆరోగ్యదాయకమైన పంటలు పండిస్తాడు. ‘సేద్యంలో విచ్చలవిడిగా వాడే రసాయన మందులే కొత్తకొత్త రోగాలకు కారణం. ఈ సమస్యను నివారించేందుకు సేంద్రియ సాగే పరిష్కారం’ అని చెబుతున్నారు డాక్టర్ తిప్పని సుధాకర్. ఆయన పండించిన బియ్యాన్నే తెలంగాణ గవర్నర్ నివాసంలోనూ వినియోగిస్తారు.
“వ్యాధులకు చికిత్స చేయడం కన్నా.. అసలు వ్యాధులే రాకుండా నివారించడమే గొప్ప విషయం” అంటారు డాక్టర్ తిప్పని సుధాకర్. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరు గ్రామంలో 20 ఏండ్లుగా సేవలు అందిస్తున్నారీ వైద్యుడు. సుధాకర్ స్వస్థలం సిద్దిపేట జిల్లా అకినెపల్లి. ఎంబీబీఎస్ తర్వాత, ములుకనూరులో నర్సింగ్ హోమ్ ప్రారంభించారు. తన వద్దకు వచ్చే రోగులకు వైద్యం అందించడంతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తుంటారు. కష్టసుఖాలను తెలుసుకొంటూ, ప్రజల నోట్లో నాలుకగా మెలుగుతున్నారు. అయితే, ఇటీవలి కాలంలో చాలామంది అనారోగ్యంపాలు కావడం చూసి ఆయన కలత చెందారు. వ్యవసాయంలో మోతాదుకు మించి రసాయన మందులు వాడటమే కారణమని గ్రహించారు. ఈ సమస్యను ‘సేంద్రియ వ్యవసాయం’తోనే నివారించగలమని నమ్మారు. తానే స్వయంగా రైతు అవతారం ఎత్తారు.
ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్లో పదెకరాల భూమిని కొనుగోలు చేసి, సేంద్రియ సాగును ప్రారంభించారు సుధాకర్. వరి, కూరగాయలతోపాటు పండ్లతోటల పెంపకాన్నీ చేపట్టారు. మామిడి, సీతాఫలం, రేగు, పొప్పడి, జామ, దానిమ్మ, నిమ్మ మొక్కలను పెంచుతున్నారు. టమాట, బెండ, గోరుచిక్కుడు, మిర్చి, పెసర, కంది, వేరుశెనగ తదితర పంటలను రసాయన మందులు లేకుండా పండిస్తున్నారు. సుభాష్ పాలేకర్ విధానాలను, సీవీఆర్ పద్ధతిని పాటిస్తున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలోనే సేంద్రియ ఎరువులను తయారు చేసుకొంటున్నారు. ఇందుకోసం మూడు ఆవులు, రెండు బర్రెలను పెంచుతున్నారు. వడ్లను ఇక్కడే బియ్యంగా మార్చి, మార్కెట్కు తరలిస్తున్నారు. ఇవే బియ్యాన్ని రాష్ట్ర గవర్నర్ తమిళిసై నివాసానికీ సరఫరా చేస్తున్నారు. తన ఫామ్లోనే వేరుశెనగ నుంచి నూనె తీసే యంత్రాన్నీ ఏర్పాటు చేశారు. ఇలా తన ఉత్పత్తులను తానే ప్రాసెసింగ్ చేస్తూ, మార్కెటింగ్ చేస్తున్నారు.
‘మనం ఆరోగ్యంగా బతికేందుకు ప్రకృతి అన్నీ ఇచ్చింది. మనమే ప్రకృతికి విరుద్ధంగా వెళ్తూ కష్టాలను కొని తెచ్చుకుంటున్నాం. ముందు తరాలవారి జీవన విధానానికి, ఇప్పటికీ చాలా వ్యత్యాసం కనిపిస్తున్నది. ఆధునిక వ్యవసాయం పేరుతో విచ్చలవిడిగా రసాయన మందులు వాడటం వల్లే రోగాలు వస్తున్నాయి. సేంద్రియ ఉత్పత్తులు తింటే వ్యాధుల తాకిడి తక్కువ. ప్రకృతికి వ్యతిరేక దిశలో వెళ్తున్న మన జీవన విధానం మారాలి. అదే సమయంలో ప్రతి రైతూ బాగుపడాలి. ప్రభుత్వ సాయం, సబ్సిడీలతోపాటు స్వతహాగా అందరూ కష్టపడాలి. ఇష్టంగా చేస్తే వ్యవసాయంలో మెరుగైన ఫలితం కనిపిస్తుంది’ అంటున్నారు డాక్టర్ సుధాకర్. ఈ వైద్యుడి ప్రిస్క్రిప్షన్ సమాజ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం.
– కిశోర్ గుడికందుల
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అబ్రహం లింకన్ గడ్డం పెంచడం వెనుక ఉన్న కథేంటో తెలుసా !
ఆ 2 ద్వీపాల మధ్య దూరం 4 కిలోమీటర్లే.. కానీ ఎలా వెళ్లినా ఒకరోజు పడుతుంది.. ఎందుకలా
myrtle corbin | నాలుగు కాళ్లు.. రెండు జననేంద్రియాలు.. ఆమె పుట్టుక ఇప్పటికీ మిస్టరీనే
ప్రేమ కోసం రాజరికాన్ని, రాజభోగాలను వదిలేసిన యువరాజులు, యువరాణులు వీళ్లే..
సిద్దిపేట