విద్యార్హతకు తగ్గ కొలువులో స్థిరపడి తల్లిదండ్రుల కోరిక తీర్చాలనుకున్నాడు. కానీ, ఆ యువకుడి నిర్ణయం విధికి సైతం నచ్చనట్టుంది.. అందుకే చివరికి ఆ యువ ఇంజినీర్ చిన్నప్పట్నుంచి ఇష్టపడ్డ రంగంలోనే స్థిరపడేలా చేసింది. నువ్వు చదివిన చదువేంటి?.. ఎంచుకున్న రంగమేంటి?.. అని ఎంతోమంది వెక్కిరించినా ‘ఫామ్’లోనే ఉన్నాడు. డెయిరీ ఫామ్ను పెట్టిన వాళ్లందరికీ నష్టాల పెంటే మిగిలిందన్న మాటలు డెయిలీ వినిపిస్తున్నా చెవికెక్కించుకోలేదు. నచ్చిన పనిని నమ్ముకొని ‘లక్ష’ణంగా సంపాదిస్తున్నాడీ నిన్నటి ఇంజినీర్, నేటి డెయిరీ ఫామ్వాలా! మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన జాడి సురేందర్ సక్సెస్ స్టోరీ ఇది…
Success Story | జాడి సురేందర్ది మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మొర్రిగూడెం గ్రామం. ఈ 33 ఏండ్ల యువకుడు నెలకు రూ.50 వేలు వచ్చే ఉద్యోగాన్ని కాదని డెయిరీ ఫామ్ ప్రారంభించాడు. ఇప్పుడు నెలకు రూ.2.50 లక్షల ఆదాయం పొందుతున్నాడు. తండ్రి పోచయ్య పంచాయతీరాజ్ శాఖలో రిటైర్డ్ సివిల్ ఇంజినీర్.. నాన్నలా సివిల్ ఇంజినీర్ అవుదామనుకున్నాడు. ఎంటెక్ చేస్తూనే ఓ ప్రముఖ సంస్థలో సైట్ ఇంజినీర్గా ఉద్యోగంలో చేరాడు. 2014 నుంచి ఏడాదిన్నర పాటు నెలకు రూ.50 వేల జీతానికి పనిచేశాడు. ఇంకా ట్యూషన్లు చెప్తే నెలకు అతికష్టంగా రూ.70 వేలు వచ్చేవి. అప్పుడే తండ్రికి పక్షవాతం వచ్చింది. ఒక్కడే కొడుకు కావడంతో దగ్గరుండి తండ్రిని చూసుకున్నాడు. కొన్ని రోజులు సొంతూరు నుంచి హైదరాబాద్కు అప్ అండ్ డౌన్ చేసినా ఫలితం లేకపోయింది.
తండ్రి ఆరోగ్యం మరింత క్షీణిస్తుండటం చూసి జాబ్ వదిలేశాడు. రోజూ తండ్రిని విధులకు తీసుకెళ్లడం, తీసుకురావడం, ఆయనకు పనిలో సాయం చేస్తూ వచ్చాడు. 2020లో తండ్రి రిటైర్ అవ్వగానే ఇంటిపట్టున అమ్మానాన్నలకు తోడుగా ఉంటూ సొంతూళ్లోనే ఏదైనా పని చేసుకోవాలనుకున్నాడు. పశుపోషణపై చిన్నప్పట్నుంచీ ఉన్న ఆసక్తితో డెయిరీ ఫామ్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. తన ఆలోచనను ఇంట్లో చెప్పాడు. ‘ఇంత చదివించింది డెయిరీ ఫామ్ పెట్టడానికా?.. ఇబ్బంది పడతావ్ వద్దు’ అన్నాడు తండ్రి. ‘నాన్నలా మంచి ఇంజినీర్ అని పేరు తెచ్చుకోవచ్చు జాబ్ చేసుకో’.. అని అమ్మ బతిమిలాడింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికే ఆరుగురు డెయిరీ ఫామ్స్ పెట్టి తీసేశారు.. చదువుకున్నోడివి నీకెందుకురా?.. అని ఊరివాళ్లు నిరుత్సాహపరిచారు. కానీ సురేందర్ తన మనసు మాట తప్ప మరొకరి మాట వినలేదు. ఆ మొండితనమే ఇప్పుడు అతణ్ని తిరుగులేని డెయిరీవాలాగా నిలబెట్టింది.
సురేందర్ ఇంట్లోవాళ్లను ఒప్పించి తన తండ్రి రిటైర్మెంట్ డబ్బులతో 2021 ఫిబ్రవరిలో డెయిరీ ఫామ్ స్టార్ట్ చేశాడు. ఉన్న మూడెకరాల భూమిని డెయిరీ ఫామ్కు వినియోగిస్తున్నాడు. అర ఎకరం విస్తీర్ణంలో రూ.2 లక్షలతో షెడ్డు వేసి, రూ.4 లక్షలతో నాలుగు గేదెలు తెచ్చాడు. ఇప్పుడు మొత్తం 40 పాడి పశువులున్నాయి. సీజన్లో సుమారు 140 లీటర్లు, అన్ సీజన్లోనైతే దాదాపు 80 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతాయి. విజయ డెయిరీ, టీస్టాళ్లు, హోటళ్లు, స్వీట్హౌజ్లు, డోర్ డెలివరీలకు సైప్లె చేస్తారు. అలా నెలకు రూ.2.10 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు ఆదాయం సముపార్జిస్తున్నాడు. ఇద్దరు పనివాళ్ల జీతాలు, ఇతర ఖర్చులు పోనూ నెలకు రూ.లక్షకుపైగా మిగులుతున్నది. బీహార్ నుంచి వచ్చి తనవద్ద పనిచేస్తున్న వారికి నెలకు రూ.36 వేలు జీతంగా ఇస్తున్నాడు. ‘నేను సైట్ ఇంజినీర్గా చేసినప్పుడు అర్ధరాత్రి సైతం పని జరిగే లొకేషన్లో ఉండాల్సి వచ్చేది. చిన్న పొరపాటు జరిగినా సీనియర్, మేనేజర్తో మాటలు పడాల్సి వచ్చేది. ఆ టెన్షన్స్ ఇప్పుడు లేవు. నా ఫ్రెండ్స్ ప్రభుత్వ ఉద్యోగులుగా, ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. కానీ ఫామ్కు వచ్చిన ప్రతి ఒక్కరూ మా కన్నా నువ్వే చాలా హ్యాపీగా బతుకుతున్నావ్రా.. అంటారు’ అని సంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు సురేందర్.
రెండెకరాల్లో పశువుల కోసం గడ్డి పెంచుతున్నాడు. రోజూ డెయిరీని శుభ్రం చేసిన నీటిని అరెకరంలో ఉన్న వరిపంటకు మళ్లిస్తాడు. పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పండించిన బియ్యాన్ని తాము తినడానికే వాడుకుంటామని సురేందర్ తెలిపాడు. డెయిరీ ఫామ్లో మరో పక్క వేసిన చిన్న షెడ్డులో మేకలు, గొర్రెలు, నాటుకోళ్లు పెంచుతున్నాడు. టర్కీ కోళ్లు, సీమకోళ్లు, బాతులు ఇలా అన్ని వెరైటీలు ప్రయత్నం చేస్తున్నట్టు చెప్తున్నాడు సురేందర్. పూర్తిగా డెయిరీ ఫామ్కే సమయం కేటాయిస్తే తప్పకుండా సక్సెస్ అవుతామని భరోసా ఇస్తున్నాడు.
– గుళ్లపెల్లి సిద్ధార్థ గౌడ్ మాదరబోయిన శ్రీనివాస్