KCR | మాకు ఓటువేస్తే క్షణాలమని అన్నీ చెస్తామని కాంగ్రెస్ చెప్పింది. మరి రైతుబంధు అందరికీ వచ్చిందా..? రూ.15వేలు ఇస్తామన్నడు ఇచ్చారా..? రూ.2లక్షల రుణమాఫీ అయ్యిందా? లేకపోతే గోవిందనేనా..? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని ప్రశ్నించగా.. గోవిందనే అంటూ జనం నినదించారు. బస్యాత్రలో భాగంగా కేసీఆర్ మూడోరోజు మహబూబ్నగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా క్లాక్టవర్ వద్ద జరిగిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇవాళ వీళ్లు, వాళ్లూ అందరూ మనకూ ఎవరూ ఏం చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఐదునెలలాయే. ఆనాడు ఏం చెప్పారు ? మాకు ఓటు వేస్తే మొత్తం క్షణాలమీద చేస్తమని చెప్పారు.
రైతుబంధు అందరికీ వచ్చిందా?’ అని కేసీఆర్ ప్రశ్నించారు. రాలేదని జనం నినదించారు. కేసీఆర్ రూ.5వేలు ఇస్తున్నడు. కేసీఆర్ రూ.10వేలు ఇస్తున్నడు. ‘నేను రూ.15వేలు ఇస్తా అన్నడు. మరి రూ.15వేలు వచ్చినయా?’ అని అనగా రాలేదని గళమెత్తారు. ‘రూ.2లక్షల రుణమాఫీ అయ్యిందా? గోవిందనేనా?’ అని నినదించగా.. గ్యారంటీగా గోవిందనే అంటూ జనం కేసీఆర్తో గొంతుకలిపారు. ‘వడ్లకు బోనస్ ఇస్తున్నరా? ఆడపిల్లలకు స్కూటర్లు కొని ఇస్తం అన్నరు కొని ఇచ్చారా? స్కూటీలు వచ్చాయా? స్కూటీలు రాలేదు కానీ లూటీలు వస్తున్నయ్. కల్యాణలక్ష్మి రూ.లక్షల ఇస్తున్నడు.. నేనైతే తులం బంగారం కలిపి ఇస్తా అన్నడు. తులం బంగారం వచ్చిందా? మహిళలకు రూ.2500 వచ్చినయా? ఆసరా పెన్షన్ రూ.4వేలు అయ్యిందా? అంటూ ప్రశ్నించగా.. ఎవరికీ రాలేదని నినదించారు.
‘రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించాం. కాంగ్రెస్ పాలనలో నలుగురు విద్యార్థులు చనిపోయారు. అక్కడ
విషాహారంపెడుతున్నరు. వాటిని చూసే దిక్కులేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ ఇస్తలేరు. ఐదునెలల నుంచి రూపాయి లేదు. అప్పుడు మనం రూ.20లక్షల అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టినం. ఐదునెలల నుంచి బంద్ పెట్టారు. ఈ విధంగా ప్రతి విషయంలో మోసం. ప్రతీ స్కీమ్లో ధగా.. అన్ని రకాలుగా నాశనం చేస్తున్నరు. చేనేత కార్మికులకు రూపాయి ఇవ్వడం లేదు. త్రిఫ్ట్ స్కీమ్ బంద్ చేశారు. అన్నిరకాలుగా భయంకరమైన బాధలు పెడుతున్నరు. నా ప్రాణం ఉన్నంత వరకు నా కండ్ల ముందటనే.. తెలంగాణను ఇలా నాశనం చేస్తామంటే కేసీఆర్ యుద్ధం చేస్తడు తప్పడు నిద్రపోడు. ఆనాడు అంత కష్టపడి.. ప్రాణాలకు తెగించి.. చచ్చిపోయినా ఫర్వాలేదని ఆమరణ నిరాహార దీక్ష చేసి మీ అందరి తోడు తెలంగాణ తెచ్చిన. తెలంగాణ నా కండ్ల ముందటే నాశనమైపోతే చూస్తూ ఊరుకోవాల్నా? యుద్ధం చేద్దామా? కోట్లాడుదామా? ఎలాంటి పోరాటికైనా అందరూ తయారుగా ఉండాలి’ అని కోరారు.