FIFA World Cup : ప్రపంచవ్యాప్తంగా ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ ఫీవర్ నడుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత అర్జెంటీనా, స్పెయిన్ మధ్య ఈ ఫుట్బాల్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దేశంలోని యువత, విద్యార్థులు, అన్ని వయసుల క్రీడాభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ నేపథ్యంలో సోమవారం రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది.
విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన డిమాండ్కు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రాత్రి ఆలస్యంగా జరిగే మ్యాచ్ చూడటం వల్ల సోమవారం విద్యార్థులు స్కూల్స్కు రావడం కష్టమవుతుందని, అందువల్ల సోమవారం సెలవు కావాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరారు. దీనిపై కేరళ విద్యాశాఖ మంత్రి ఎన్.శంషుద్దీన్ స్పందించారు. వారి డిమాండ్కు అనుగుణంగా సోమవారం, జూలై 20న సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. పిల్లలూ ఇప్పుడు సంతోషమేనా అంటూ శంషుద్దీన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రాష్ట్రంలోని పాఠశాలలకు, అన్ని ఉన్నత విద్యా సంస్థలకు ఈ సెలవు వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై కేరళ సీఎం వీడీ సతీషన్ కూడా స్పందించారు.
రాత్రి మ్యాచ్ చూస్తే ఉదయం నిద్ర సమస్య వస్తుందని, దానివల్ల ఇబ్బంది పడతామంటూ విద్యార్థుల స్పందనకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నామని సీఎం వీడీ సతీషన్ చెప్పారు. అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నామన్నారు. పిల్లల కోరిక నెరవేరిందన్నారు. రాత్రి పూట మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా చూస్తామని విద్యుత్ శాఖ మంత్రి సన్నీ జోసెఫ్ చెప్పారు. ఫుట్బాల్ ఫైనల్ నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం కూడా సోమవారం అక్కడి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. రాష్ట్రంలోని పాఠశాలలు, ఇతర అన్ని విద్యాసంస్తలతోపాటు సీబీఎస్ఈ స్కూల్స్ కూడా జూలై 20న మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.