KCR | లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసినా.. కాంగ్రెస్కు ఓటు వేసినా వ్యవసాయబావుల వద్ద మోటార్లకు కరెంటు మీటర్లు పెడతారని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతులను హెచ్చరించారు. మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని కేసీఆర్ రోడ్షో నిర్వహించారు. అనంతరం క్లాక్టవర్ వద్ద జరిగిన అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నరేంద్ర మోదీ ఒక మాట చెప్పిండు. కేసీఆర్ వ్యవసాయబావుల దగ్గర నువ్వు తప్పకుండా మీటర్లు పెట్టాలి. మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి రూ.5వేలకోట్ల గ్రాంట్ బంద్చేస్తా అన్నడు. నేను నరేంద్ర మోదీ నా ప్రాణంపోయినా.. తలకాయ తెగినా మీటర్లు పెట్టా అని చెప్పిన’ అన్నట్లుగా తెలిపారు.
‘ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే.. మీటర్లు పెడుతం అని చెప్పంగ కూడా రైతులు మాకే ఓట్లు వేశారు. ఖచ్చితంగా మీటర్లు పెడుతా అంటడు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఛోటే భాయ్.. నరేంద్ర బడే భాయ్. ఛోటే బాయ్కి ఓటు వేసినా.. నరేంద్ర మోదీకి ఓటు వేసిన ఒక్కటే. ఒక్క ఛోటే భాయ్కి ఓటు వేసినా.. పెద్దన్న పెట్టుమంటున్నడు పెడుతా అంటడు. బీజేపీకి ఓట్లు వేసినా గ్యారెంటీగా మీటర్లు పెడుతరు. మీటర్లు పెట్టించుకునేందుకు బీజేపీకి ఓటు వేయాలా? దయచేసి ఆలోచన చేయాలి. ఏడు మండలాలు మని గుంజి ఆంధ్రాకు ఇచ్చిండు. 400 మెగావాట్ల సీలేరు పవర్ప్లాంట్ను ఏపీకి ఇచ్చిండు. ఇటువంటి నరేంద్ర మోదీకి మనం ఓటు ఎందుకు వేయాలి’ అంటూ ప్రశ్నించారు.
‘తెలంగాణ ఉద్యమం మనం చేస్తుంటే.. ఆంధ్రావాళ్లు మన నీళ్లు ఎత్తుకుపోతుంటే.. ఇక్కడి నుంచి కాలువ పెట్టి.. ఆ నాడు రఘువీరారెడ్డి పాదయాత్ర చేయడానికి వస్తే ఇదే డీకే అరుణ పోయి మంగళహారతి ఇచ్చి అయ్యా మంచిగ తీసుకుపోతున్నవ్ మా తెలంగాణ నీళ్లు. తీసుకుపో అని మంగళహారతి పట్టింది. ఈమెకే ఓటు వేయాలా? డీకే ఆరుణకు ఓటు వేయడమేంటే ఏందీ? వీళ్లు అక్కరకురాని సుట్టాలు. బీజేపీ అక్కరాని సుట్టం. మొక్కినా వరమియ్యని వేల్పు. ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలి ? మన కన్ను మనమే పొడుసుకుందమా? మనకు విషం ఇస్తే మనమే తాగుదామా? దయచేసి ఆలోచన చేయాలి’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు కేసీఆర్.