ACB | మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ఉప్పల్ భగాయత్ విలేజీలోని శాంతి నగర్లో వాణిజ్య భవనం నిర్మాణం కోసం ‘నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)’ కోసం రూ.5 లక్షల లంచం అడిగిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ యాతా పవన్ కుమార్ను ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బాధితుడు గోపగాని రమణమూర్తి నుంచి తీసుకున్న రూ.4 లక్షల నగదును జప్తు చేశారు.
బుద్ధ భవన్ లోని నార్త్ ట్యాంక్స్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ యాతా పవన్ కుమార్.. రామంతాపూర్కు చెందిన బిల్డర్ గోపగాని రమణమూర్తికి ఎన్వోసీ సర్టిఫికెట్ ఇవ్వాలంటే రూ.5 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ విషయమై గోపగాని రమణమూర్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
శుక్రవారం గోపగాని రమణమూర్తి ఇచ్చిన రూ.4 లక్షల నగదును తీసుకున్న యాతా పవన్ కుమార్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతడి కుడి చేతివేళ్లకు కెమికల్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ రిజల్ట్ రావడంతో యాతా పవన్ కుమార్ ను అరెస్ట్ చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడటంతోపాటు మోసపూరితంగా వ్యవహరించారన్న అభియోగంపై ఆయనపై కేసు నమోదు చేశారు. నాంపల్లిలోని ఎస్పీఈ, ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ముందు ఆయన్ను హాజరు పరిచారు.