Ameen Khwaja | అవకాశాలు రావు సృష్టించుకోవాలి. అదృష్టం తలుపు తట్టదు. మనమే తట్టి లేపాలి. డిగ్రీలు మాత్రమే అర్హత కాదు. పట్టుదలను మించిన పట్టా లేదు. ఇందూరు బిడ్డ అమీన్ ఖ్వాజా గెలుపు కథలో కీలక వాక్యాలు ఇవన్నీ. బస్టాండు పరిసరాల్లో చిన్నపాటి చెప్పుల దుకాణం నడిపే ఓ సామాన్యుడి ఇంట పుట్టిన ఖ్వాజా.. ఇప్పుడు దేశీయ ఎలక్ట్రానిక్ ఉపకరణాల మార్కెట్లో సింహ భాగం సొంతం చేసుకున్నాడు. హోటల్ రిసెప్షనిస్ట్ ఉద్యోగం నుంచి పీట్రాన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ వ్యవస్థాపక సీఈఓ హోదా వరకు ఖ్వాజా డిజిటల్ జర్నీ అతని మాటల్లోనే..
మాది నిజామాబాద్. మా నాన్న బస్టాండ్ దగ్గర చెప్పుల షాపు నడిపేవారు. స్కూలు రోజుల్లో ఇంజినీర్ కావాలని కలలు కనేవాణ్ని. పదో తరగతి తర్వాత ఇంజినీరింగ్ డిప్లొమా చేశాను. తర్వాత పుణె యూనివర్సిటీలోని ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగంలో సీటొచ్చింది. అప్పుడే నాకు ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. బెరుకుబెరుకుగా అంతర్జాల ప్రపంచంలో అడుగుపెట్టాను. వెబ్ దునియా దున్నేద్దామన్నంత ఆవేశం ఉండేది. ఆన్లైన్లో యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్లో ప్రొఫెసర్గా పని చేస్తున్న స్టీఫెన్ డాడ్స్ పరిచయం అయ్యారు. ఆయన యూకేలోని ఓ స్పేస్ స్టేషన్కు సలహాదారుగా కూడా ఉండేవారు. ఇంటర్నెట్ ద్వారా ఆయన్ని సంప్రదించేవాణ్ని. కొత్త కొత్త విషయాలు తెలుసుకునేవాణ్ని. మధ్యతరగతి జీవితంలోని పరిమితులు నాకు తెలుసు. అయినా సరే, విదేశాల్లో చదవాలని ఉండేది నాకు. నాలుగేండ్ల ఇంజినీరింగ్ కోర్సులో కనీసం రెండేండ్లు పూర్తి చేస్తే విదేశీ విశ్వవిద్యాలయాల్లో మిగతా కోర్సు కొనసాగించే వెసులుబాటు ఉండేది అప్పట్లో. ఆ మాట కూడా స్టీఫెన్ చెప్పిందే. అలా చేయమని నాకు సలహా ఇచ్చారు. దీంతో నా వంతు ప్రయత్నాలు మొదలుపెట్టాను.
ఇంట్లో పరిస్థితి ఇబ్బందికరంగా ఉండేది. రోడ్డు విస్తరణ వల్ల మా షాపు పోయింది. బిజినెస్ మూతపడటంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ‘సమస్యలు ఎప్పుడూ ఉండేవే. విదేశాలకు వెళ్లి చదువుకో బిడ్డా’ అని అమ్మ ప్రోత్సహించింది . దీంతో యూకే బయల్దేరాను. యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్లో చేరాను. నా దగ్గర ఉన్నదే కాసిన్ని డబ్బులు. అవి కూడా నిండుకునే పరిస్థితి వచ్చింది. పార్ట్టైమ్ ఉద్యోగాల వేట మొదలుపెట్టాను. మెక్ డొనాల్డ్స్లో పని దొరికింది. కాకపోతే చాకిరీ ఎక్కువ. సంపాదన తక్కువ. రోజూ చాలాదూరం ప్రయాణించాల్సి వచ్చేది. చదువు మూలన పడింది. కొన్నాళ్ల తర్వాత ఆ ఉద్యోగం మానేశాను. బ్రిటిష్వాళ్లు మొదట్లో మనకు ఉచితంగా చాయ్ పోశారు. మనం ఆ రుచికి అలవాటుపడ్డాక అమ్మడం మొదలుపెట్టారు. ఆ బ్రిటిష్ తెలివినే అక్కడా వాడాను. ఒక హోటల్లో రిసెప్షనిస్ట్ ఉద్యోగంలో చేరాను. రాత్రి డ్యూటీలు ఉండేవి. దీంతో పగలు చదువు కోవడానికి సమయం దొరికింది. వెబ్ డిజైనింగ్, జావా స్క్రిప్ట్ సొంతంగా నేర్చుకున్నాను. ఫ్లాష్, యానిమేషన్ మీదా పట్టు సాధించాను. హోటల్లో పని చేయడం వల్ల ఆ పరిశ్రమ అవసరాలు తెలిశాయి. లండన్లోని ఒక హోటల్కు ఫ్రీగా వెబ్ డిజైనింగ్ చేసి ఇచ్చాను. ఆ తర్వాత దాదాపు యాభై హోటల్స్కు ఉచితంగానే వెబ్సైట్ రూపొందించి ఇచ్చాను. కొన్ని నెలల తర్వాత ఆయా హోటళ్ల యజమానులు అంతా బాగుందనీ, ఇంకొంత ఆధునికంగా మార్చమనీ అడిగారు. అందుకు ఫీజు తీసుకున్నాను. ఇలా నా చదువుకు కావాల్సిన డబ్బు నేనే సంపాదించుకున్నాను. మొత్తానికి కోర్సు పూర్తి చేసుకుని ఇండియా వచ్చాను.
డాలర్ల దేశం అమెరికా వెళ్లాలన్నది నా కల. కాకపోతే, వీసా కోసం మూడు నెలలు హైదరాబాద్లోనే వేచి ఉండాల్సి వచ్చింది. కొంతకాలం ఇన్సూరెన్స్ కన్సల్టెంట్గా పనిచేశాను. అది కూడా ఎందుకో సంతృప్తిని ఇవ్వలేదు. నేను వెళ్లాల్సిన దారి అది కాదేమో అనిపించింది. ఆ సమయంలో.. వెబ్ డిజైనింగ్ ప్రాజెక్ట్స్తో బిజీ అయిపోయాను. ఆర్డర్ల మీద ఆర్డర్లు వచ్చాయి. దీంతో నానక్రామ్గూడలో ఒక సింగిల్ బెడ్ రూమ్ అద్దెకు తీసుకుని ‘ప్రీమియం వెబ్ సర్వీసెస్’ ప్రారంభించాను. చేతినిండా పని. డబ్బుకు లోటు లేదు. అమెరికా వెళ్లి ఉద్యోగం వెతుక్కోవడం కంటే ఇండియాలోనే ఉంటూ వెబ్ సర్వీస్ నడపడమే లాభదాయకమని అర్థమైంది. ఉద్యోగుల సంఖ్య పెంచుకుని డిజిటల్ మార్కెటింగ్లో అడుగుపెట్టాను. రెండేళ్లలో సిబ్బంది సంఖ్య రెండు నుంచి అరవైకి చేరింది. ఆ సమయంలో ఆంత్రప్రెన్యూర్ పాలెం శ్రీకాంత్ రెడ్డి పరిచయం అయ్యారు. ఆయనతో కలిసి ప్రయాణం చేసే అవకాశం వచ్చింది. ఇ-కామర్స్ కంపెనీ ‘లేటెస్ట్ వన్ డాట్ కామ్’కు మార్కెటింగ్ కన్సల్టెంట్గా పని చేశాను. ఈ సంస్థ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, కంప్యూటర్ విడిభాగాలను అమ్ముతుంది. మొదట్లో చాలా బాగా నడిచేది. నలుగురు ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు. కొన్నాళ్ల తర్వాత ఇ-కామర్స్ రంగంలోకి బడా కంపెనీలు అడుగుపెట్టాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్ డీల్ లాంటి దిగ్గజాలతో పోటీపడటం కష్టమైపోయింది. వాటికి దీటుగా రాణించాలంటే కనీసం రూ. మూడువేల కోట్ల రూపాయల పెట్టుబడి అవసరమని అర్థమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో లేటెస్ట్ వన్ డాట్ కామ్ని మూసేశాం. ఆ అనుభవం మాత్రం చాలా పనికొచ్చింది. కొన్ని ఇ-కామర్స్ సంస్థలతో కలిసి ‘పీట్రాన్’ ప్రారంభించాను. లోగో అనేది ఏ కంపెనీకి అయినా ఆత్మ లాంటిది. మన సంస్థ ఫిలాసఫీని ప్రతిబింబించాలి. చూడగానే.. గుర్తుండిపోవాలి. మళ్లీ మళ్లీ గుర్తుకురావాలి.
పీట్రాన్ లోగో ఆవిష్కరణ విషయంలోనూ మేం ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నాం. ఇతర కంపెనీల విషయానికి వస్తే.. అమెజాన్ లోగో నాకు చాలా నచ్చింది. ఆ కంపెనీ సేవల్లోని వైవిధ్యమంతా ఆ వంపులోనే కనబడుతుంది. ప్రతి సంస్థకూ కొన్ని విలువలు అంటూ ఉంటాయి. ఇవే.. ఆ పరివారాన్ని ముందుకు నడిపిస్తాయి. సంక్షోభ సమయంలో దిశానిర్దేశం చేస్తాయి.
అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఇ-దుకాణాల్లో విక్రయించే చవకైన వస్తువుల్లో నాణ్యత లేకపోవడాన్ని మేం గుర్తించాం. ఇలాంటి చౌకబారు సరుకు వల్ల ఇ-కామర్స్ కంపెనీల మీద నమ్మకం పోతుంది. ఆ సమయంలో మేం అందుబాటు ధరలోనే నాణ్యమైన ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అమ్మడం మొదలుపెట్టాం. దిగుమతులకే పరిమితం కాకుండా.. నాణ్యతా ప్రమాణాలను పరిశీలించడం, వారంటీ ఇవ్వడం, సర్వీస్ సెంటర్లు నిర్వహించడం.. ఇలా విక్రయానంతర సేవలతో పీట్రాన్ విశ్వసనీయత పెంచాం. మొబైల్స్, కంప్యూటర్, సౌండ్ సిస్టమ్స్కు సంబంధించి తక్కువ ధర ఉపకరణాల విక్రయాలతో పీట్రాన్ 40 శాతం మార్కెట్ వాటాను సాధించింది. ఏటేటా అమ్మకాలు పెరుగుతూ ఉన్నాయి. దిగుమతులతో మొదలైన వ్యాపారం తయారీ వైపుగా కూడా విస్తరించింది. అత్యాధునిక సాంకేతికతతో హైదరాబాద్లో ఓ యూనిట్ స్థాపించాం. పీట్రాన్ బ్రాండ్ పేరుతో ఇప్పుడు మార్కెట్లో 100 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇయర్ బడ్స్, నెక్ బ్యాండ్స్, స్మార్ట్ వాచెస్, సౌండ్ బార్స్, పార్టీ స్పీకర్స్, చార్జర్స్, డాటా కేబుల్స్.. ఇలా అనేకం. దేశీయంగా మొబైల్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో 7.5 శాతం వాటా దక్కించుకున్నాం. ఇదంతా నా ఒక్కడి విజయమని అనుకోను. ప్రమోటర్ సుప్రియా రెడ్డి, సీఎఫ్ఓ హరీష్ నాయుడు, 400 మంది పీట్రాన్ ఉద్యోగుల కష్టఫలమిది. మా పరివారంలో పనిచేసే ప్రతి ఉద్యోగీ నాకు ఆత్మీయులే. సంస్థ ఎదుగుదల పట్ల, ఉత్పత్తి నాణ్యత పట్ల వాళ్లు చూపే శ్రద్ధ అమూల్య మైంది. మేకిన్ ఇండియా నినాదమే మా విధానం. ‘యువతకు నా సలహా ఒకటే. ఓటమికి కుంగిపోవద్దు. విజయానికి పొంగిపోవద్దు. లక్ష్యం వైపుగా మీ ప్రయాణం సాగిస్తూనే ఉండండి. ఏ దశలోనూ నేర్చుకోవడం ఆపేయవద్దు. జిజ్ఞాస చంపుకోవద్దు. తాత్కాలిక ప్రయోజనాల కోసం దారి మార్చుకోవద్దు.
“ఫాస్టెస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్.. మార్కెట్ను ఏలుతున్నాయి. కొత్త ఆలోచనలకు, కొత్త టెక్నాలజీకి ఆధారం అవుతున్నాయి. కొవిడ్ తర్వాత లైఫ్ స్టయిల్ డిజిటల్ యాక్సెసరీస్ ప్రాధాన్యం పెరిగిపోయింది. తక్కువ ధరలో నాణ్యమైన ఉత్పత్తులను అందించడం ద్వారా వినియోగదారుల అవసరాలు తీరుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గత మూడేండ్లలో మేం యాభై లక్షల ఇయర్ బడ్స్, నెక్బ్యాండ్స్ విక్రయించామంటేనే.. మార్కెట్ పరుగును అర్థం చేసుకోవచ్చు. రోజూ ఆన్లైన్లో మాకు ఐదువేల ఆర్డర్స్ అందుతాయి. తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో పుట్టడం వల్ల కావచ్చు.. క్రమశిక్షణ, విలువలు, కష్టపడే తత్వం బాల్యం నుంచీ అలవడ్డాయి. తెల్లవారుజామునే ఐదు గంటలకు నిద్రలేవడం నా అలవాటు. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. పేదల కోసం, సమాజం కోసం పనిచేయడం నాకిష్టం. మా స్వచ్ఛంద సంస్థ ద్వారా వివిధ కార్యక్రమాలు చేపడతాం. అంతర్జాతీయ మార్కెట్లో వచ్చే కొత్తకొత్త ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉపయోగించడం నాకు ఇష్టం”
✍️ నాగవర్ధన్ రాయల