FCRA Bill : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఎఫ్సీఆర్ఏ బిల్లుపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం కూడా లోక్సభలో ఈ బిల్లుపై చర్చ జరగగా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపాలని కేంద్రం నిర్ణయించింది. ఫారెన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) అమెండ్మెంట్ బిల్, 2026 (ఎఫ్సీఆర్ఏ) పేరుతో ఈ సవరణ బిల్లును కేంద్రం గత మార్చి 25న లోక్సభలో ప్రవేశపెట్టింది. తాజాగా దీనిపై చర్చ జరిగింది.
అయితే, ఈ బిల్లును ప్రతిపక్షాలతోపాటు పలు క్రిస్టియన్ సంస్థలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇండియాలోని కంపెనీలకు, స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి అందుతున్న నిధులపై నియంత్రణకు, పారదర్శకత కోసం కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తోంది. ఈ బిల్లు ప్రకారం విదేశాల నుంచి అందుతున్న నిధుల కోసం ఒక ప్రత్యేక పర్యవేక్షణా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. విదేశీ సంస్థలకు చెందిన నిధులు, ఆస్తులు, విరాళాల్ని ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది. మతపరమైన సంస్తకు చెందిన ఆస్తుల విషయంలో కూడా ఆయా నిర్వహణా సంస్థలు వాటి ఔన్నత్యాన్ని, విశ్వాసాన్ని కాపాడాలి. ఈ విషయంలో ఏదైనా సంస్థ నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఈ బిల్లును తమిళనాడుతోపాటు మిజోరం వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది.
ఎఫ్సీఆర్ఏ పోర్టల్ ప్రకారం 2019 నుంచి 2022 మధ్య 13,520 సంస్థలకు విదేశాల నుంచి రూ.55,741 కోట్లు విరాళాలుగా వచ్చాయి. విరాళాలు అందుకుంటున్న సంస్తలకు సంబంధించి 2026, జూలై 15 నాటికి 14,449 సంస్థలకు సర్టిఫికెట్లు ఉన్నాయి. 22,498 సర్టిఫికెట్లు రద్దయ్యాయి. 15,212 సంస్థలకు చెందిన సర్టిఫికెట్ల గడువు ముగిసింది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లును జేపీసీకి కేంద్రం పంపనుంది. అక్కడ ఈ కమిటీ బిల్లులోని అంశాల్ని పరిశీలిస్తుంది. తగిన సూచనలు చేస్తుంది. అనంతరం మార్పులు, చేర్పులకు అవకాశం ఉంది. తర్వాత ఈ బిల్లు మళ్లీ పార్లమెంట్ ముంగిటకు వస్తుంది.