జూలూరుపాడు, ఆగస్టు 11 : జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారుల ఆదేశాల మేరకు జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం అనంతారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉచిత క్షయ వ్యాధి నిర్ధారణ, అవగాహన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ కొర్సా రమేశ్ ముఖ్య అతిథిగా హాజరై, శిబిరాన్ని ప్రారంభించారు. పి.హెచ్.సి వైద్యులు డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, డాక్టర్ కె.రాధిక మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. టిబి అనేది భయపడాల్సిన వ్యాధి కాదు. ముందస్తు పరీక్షల ద్వారా వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించి, క్రమం తప్పకుండా మందులు వాడితే పూర్తిగా నయం చేయవచ్చు అన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో టిబి బాధితులకు ఉచితంగా నాణ్యమైన వైద్యం, మందులతో పాటు పౌష్టికాహారం కోసం ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారు. గ్రామస్తులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి అని ఆయన కోరారు. టిబి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం నమూనాలను సేకరించినట్లు తెలిపారు. రెండు వారాలకు పైగా దగ్గు, సాయంత్రం వేళల్లో జ్వరం, బరువు తగ్గడం, ఆకలి మందగించడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో హెల్త్ సూపర్వైజర్ ఇ.పుల్లమ్మ, ఎంపీహెచ్ఏ ఫస్ట్ ఏఎన్ఎం, అనంతారం పంచాయతీ కార్యదర్శి శైలజ, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది కిరణ్, శ్రీనివాస్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.