Ramaayanam |‘బడి ఎగ్గొట్టడానికి ఏం కారణం దొరుకుతుందా!?’ అని ఎదురు చూసే నాకు.. గొప్ప అవకాశం లభించింది. ఆ రోజు ఉదయాన్నే.. “ఇవాళ్ల మనింటికి శానమంది పట్వారీలు వొస్తరు. మరి ఇక్కడ్నే తింటరు గావొచ్చు!” అంటూ నాన్న.. అమ్మకు ఓ హింట్ ఇవ్వడం నా చెవిన పడింది. ఇక అంతే!
వాన వచ్చేముందు ఆకాశం మబ్బులు కమ్మి, ఎక్కడినుంచో చల్లగాలిని పంపి సంకేతం ఇచ్చినట్లుగా.. మనమూ సిగ్నల్ ఇవ్వాలిగా మరి! పొద్దున్నే నాన్న దగ్గరికి వెళ్లి.. “నాన్నా! నాకు కడుపు నొస్తుంది కొంచెం!” అన్నాను మొహం కాస్త బాధగా పెట్టి. “కొంచెం ఆగినాక అది ఎక్వ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు!”.. నవ్వుతూ అన్నది అటుగా వచ్చిన అమ్మ. నాన్న దానికి ఏ మాత్రం స్పందించకుండా, నా పొట్టను మృదువుగా నిమిరి (చిన్నపిల్లల్ని నాన్న అలాగే గారాబం చేసేవాడు).. “బుజ్జీస్! రాత్రి ఏం తిన్నవ్?” అని అడిగాడు. నాకేం గుర్తు లేదు. తిండికి కడుపు నొప్పికి సంబంధం ఉంటుందనే సత్యం, దాని ఆధారంగా నిజనిర్ధారణ చేస్తారనే లౌక్యం.. రెండూ తెలియని అయిదేళ్ల వయసు.
సరే, ఎలాగైతేనేం.. మొత్తానికి బడి ఎగ్గొట్టాను. పదకొండింటికల్లా ఒకరి వెనుక ఒకరు దాదాపుగా ఇరవైమంది దాకా వచ్చారు. వాళ్లంతా చుట్టుపక్కల ఊర్లనుంచి వచ్చారు. పైగా అప్పట్లో భోజన వసతి కల్పించే హోటళ్లు లేవు. కాబట్టి, వాళ్లు మా ఇంట్లోనే భోంచేస్తారని తెలిసి లోపల్లోపల సంతోషం వేసింది.
నాన్న.. వాళ్లు తెచ్చిన దఫ్తరాలు (ఫైల్స్ అనుకుంటా) చూస్తున్నాడు. అమ్మ లోపల వంట చేస్తున్నది. ఒకళ్లిద్దరు ఇంటిముందు వేపచెట్టు కిందా, ఇంటి పక్కన చింతచెట్టు కిందా మాట్లాడుకుంటున్నారు.
ఇంతలో నీళ్లకుండకు బట్టలు తొడిగినట్టున్న ఒకాయన నన్ను చూసి.. “పాపా! అమ్మను కొన్ని మంచినీళ్లు ఇయ్యమని చెప్తవా?!” అనడిగాడు. “ఓ!” అని లోపలికి తుర్రుమన్నాను. నానమ్మ స్నానం చేస్తున్నది. అమ్మ వంటపనిలో తలమునకలై ఉంది. నాకు జాలేసింది. అయినా ఈ పొగ గొట్టాలకు, నీళ్ల కుండలకు అమ్మ నీళ్లివ్వడం ఎందుకు? అనిపించింది. పైగా నేను బడి ఎగ్గొట్టి ఇంట్లో ఉన్నాను. కనుక నీళ్లయినా ఇవ్వడం నా గురుతర బాధ్యత అనుకున్నాను. “అమ్మా! వాండ్లకు మంచినీళ్లట!” అన్నాను. ఎవరూ లేకపోవడం చూసి.. “అయ్యో! నేను మడిగట్టుకొని ఉన్ననే! సరే.. అక్కడ నీళ్లకుండ ఉన్నది. అక్కడ్నే చెంబు ఉన్నది. సగం సగం ముంచి.. గ్లాసులల్ల పోసిస్తవా బిడ్డా!” అన్నది అమ్మ. అమ్మ మాట నెరవేర్చే పనిలో నీళ్లు ముంచి మోసుకెళ్లి ఇచ్చాను. “రెండు జాంబులు తీస్కరాపో!” అన్నాడొకాయన. వెళ్లి రెండు స్టీల్ గ్లాసులు తెచ్చాను. అది మొదలు.. నేను చెంబుల కొద్దీ నీళ్లు ముంచి అక్కడిదాకా వెళ్లడం, వాళ్లు గుటకాయ స్వాహా చేసి ఇవ్వడం. మళ్లీ వెళ్లడం! ఇవ్వడం! ‘అయ్యో! బడికి పోయినా బాగుండె’ అని మొదటిసారి అనుకున్నాను. చివరికి నీళ్లు మోసీ మోసీ నా కాళ్లు నొప్పి పుట్టినాయి. దాహం వేస్తుంది. నాన్నేమో నా వైపు చూట్టం లేదు. ఆఖరికి ఇక దప్పికి ఆగలేక ఓ గుంజకు చేరగిలబడి.. గ్లాసు తెచ్చుకునే ఓపిక కూడా లేక ఆ చెంబునే నోట్లో కుచ్చుకుని నీళ్లు గటగటా తాగాను. ఒకాయన చూడనే చూశాడు. “అయ్యో! చెంబు ఎంగిలి జేసినావే పిల్లా!” అని ఘోర అపరాధం జరిగినట్టు ఫీల్ అయ్యాడు.
మల్లెపువ్వులాగా తెల్లని బట్టలేసుకున్న ఇంకొకాయన.. “శభాష్ బేటీ! మంచి పని జేసినవ్! అయినా అయిదేండ్ల చిన్నపిల్లతోటి మంచినీళ్లు తెప్పిచ్చుడు మనదే తప్పు!” అన్నాడు. నాకాయన బాగా నచ్చాడు. ఇంతలో నాన్న చూసి.. నా దగ్గర ఉన్న చెంబు తీసుకుని పక్కన పెట్టి, వేరే చెంబుతో వాళ్లకు నీళ్లు అందించాడు. ఇంతకీ అప్పుడు అందరూ మంచినీళ్లను గ్లాసు పైకిఎత్తి తాగేవారు తప్ప.. నోట్లోకి కుచ్చుకుని తాగేవారు కాదు. అది పెద్ద తప్పు అన్నమాట.
మా ఇంటికి అప్పుడప్పుడూ గిర్దావర్లు వచ్చేవారు. వాళ్లకు కూడా తెగ మర్యాద చేసేవాడు నాన్న. అందులో ఒకాయన రహమాన్ సాబ్. ఈయనకు నిలువ పచ్చళ్లూ, రోటి పచ్చళ్లూ, పులిహోరా, పప్పుచారు లాంటివి చాలా ఇష్టం. ఎప్పుడు వచ్చినా మా ఇంట్లో ఇష్టంగా భోజనం చేసేవాడు. మా నాన్న దగ్గరుండి ఆయనకు వడ్డన చేస్తుంటే.. “ఎందుకు గా తురకాయనకు నువ్వు ఒడ్డిచ్చుడు?! అన్ని అక్కడ పెడ్తె ఆయనే తింటడు గదా!?” అనేది నానమ్మ. నాన్నమాత్రం.. “గట్లుంటదా?! ఇంటికి ఒచ్చిన అతిథికి మర్యాద చేయొద్దా?!” అనేవాడు.
ఓసారి ఆయన మా ఇంటికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. నాన్న ఎందుకో లోపలికి వెళ్లాడు. అటుగా వెళ్లిన నన్ను ఆయన దగ్గరికి రమ్మని పిలిచాడు. నేను అనుకోకుండా వెంటనే.. “వెవ్వెవ్వె!” అంటూ వెక్కిరించి, లోపలికి పరిగెత్తాను. నాన్న బయటికి వెళ్లాక ఆయన చెబుతాడేమోనని చాటుగా నిలబడి చూశాను. ఆయన నాన్నతో ఏమీ చెప్పలేదు. నాన్న లోపలికి వెళ్లగానే ఆయన మళ్లీ నా వైపు నవ్వుతూ చూశాడు. నేను మళ్లీ.. “వెవ్వెవ్వె!” అన్నాను. ఇలా ఎందుకో గానీ, ఆయన ఎప్పుడు ఇంటికి వచ్చినా.. నాకు కనిపిస్తే అలాగే వెక్కిరించేదాన్ని. ఒకసారి నాన్న చూసి నన్ను గట్టిగా మందలించాడు. “మాఫ్ కీజియే సాబ్! ఛోటీ బచ్చీ హైనా! కుచ్ నై జాన్తీ! గలత్ హో గయా!” అన్నాడు ఆయనతో. “ఫర్వానై! ఇస్మే గలత్ క్యాహై? బచ్చీ హై” అన్నాడు రహమాన్ సాబ్ నవ్వుతూ. అమ్మ లోపలికి పిలిచి నాకు క్లాసు పీకింది. ఆ తరువాత ఆయనెప్పుడు వచ్చినా.. నాకు కొన్ని చాక్లెట్లు ఇచ్చి, నాతో కబుర్లు చెప్పించుకునేవాడు.
చాలా ఏళ్ల తరువాత నేను బ్యాంక్లో సీఆర్ఓగా పనిచేస్తున్నప్పుడు.. ఏదో అకౌంట్స్ పని మీద వరంగల్ కలెక్టర్ ఆఫీస్కు వెళ్లాను. కలెక్టర్ గారిని కలిశాక, డీఆర్వో ఛాంబర్కు వెళ్లాను. ఆయనతో మాట్లాడుతుంటే, అక్కడే ఓ కుర్చీలో కూర్చున్నాయన నా వైపు తిరిగి.. “ఇప్పుడు కూడా అందర్నీ వెక్కిరిస్తున్నావా బేటీ!” అన్నాడు. ‘ఈయనెవరు ఇలా అంటున్నాడు?’ అనుకుని చూస్తే.. ఆయన రహమాన్ సాబ్!! “నువ్వు బ్యాంక్ ఆఫీసర్ అయినావంటే శానా సంతోషంగ ఉన్నది. పట్వారి సాబ్ ఎట్లున్నరు?!” అని అడిగారు. ఏమీ అర్థం కాకచూస్తున్న డీఆర్వో గారికి చెప్పారు.. “ఈమె చిన్నప్పుడు నన్ను బాగా వెక్కిరించేది. అఫ్కోర్స్ తనకప్పుడు ఐదారేళ్లు ఉంటాయి అంతే!” అని.
రహమాన్గారు డీఆర్వోగా చేసి రిటైర్ అయ్యారనీ, ఏదో పెన్షన్ పనిమీద వచ్చారనీ తెల్సింది. డీఆర్వో గారు మా ఇద్దరికీ కాఫీ తెప్పించారు. ఇంటికొచ్చాక నాన్నకు చెబితే.. ఎంత సంతోషించాడో! నిజంగా ఈ ప్రపంచం ఎంత పెద్దదో.. అంత చిన్నది కదా!
నెల్లుట్ల రమాదేవి ( Nellutla Ramadevi ), రచయిత్రి
Ramaayanam | తొలి యాత్రా స్పెషల్!
Ramaayanam | బళ్లు తెరిచారంటే..
Ramaayanam | ఎండకాలం.. ప్రేమలు పండే కాలం!