Ramaayanam | మా ఇంటికి ఎడం పక్కన వరుసగా రెండిళ్లు పురోహితులవే. అందులో మరీ పక్కింట్లోనే ఓ అయ్యగారి కూతురు, అల్లుడు కాపురం ఉండేవారు. అప్పటికి ఆ యువ దంపతులకు ఇంకా పిల్లలు లేరు. వాళ్లింటి వీధి గుమ్మాన్ని ఆనుకుని ఉండే చిన్న గదిలో ఓ చిన్న కిరాణా షాపు ఉండేది. నేనూ, అక్కా అప్పుడు ఐదు, ఆరు తరగతుల్లో ఉండేవాళ్లం. ఎప్పుడైనా ఆ షాపుకెళ్లి బిస్కెట్లూ, పిప్పరమెంట్లూ, పల్లిపట్టీలూ కొనుక్కునేవాళ్లం. ఓసారి అయ్యగారి కూతురు మమ్మల్ని చూసి.. “మా ఇంటికి రాండి బుజ్జమ్మా!” అని పిలిచింది.
“మా అమ్మకు చెప్పినాక ఒస్తం” అని చెప్పి.. మేం తుర్రుమన్నాం. ఇంటికి పోయాక అమ్మకు చెబితే.. “పోకపోయిన్రా.. పాపం రోజంతా ఒక్కతే ఉంటది కద!” అన్నది.
మరీ ప్రతిరోజూ కాకపోయినా.. అప్పుడప్పుడూ బడి నుంచి వచ్చాక ఎక్కువ హోంవర్క్ లేని రోజునో, ఆదివారమో వాళ్లింటికి వెళ్లి, ఆడుకునేవాళ్లం. పులి జూదం, వామనగుంటల పీట, చింతగింజలూ, గచ్చకాయలూ పట్టుకెళ్లి ఆమెతో ఆడేవాళ్లం. ఆమెను మేము ‘ఒదినె’ అని పిలిచేవాళ్లం. ఆమె.. ‘చిన్న బుజ్జమ్మా! పెద్ద బుజ్జమ్మా!’ అంటూ మాతో ఎంతో ప్రేమగా ఉండేది.
అయ్యగారు ఇంటికి వస్తూ ఓ మూటలో ఎవరన్నా ఇచ్చినవి పట్టుకొచ్చేవాడు. ఆయన బయటికి వెళ్లినపుడు మా సమక్షంలో ఆమె ఆ మూట విప్పేది. ఊరివాళ్లు ఇచ్చిన బియ్యం, పప్పు, ఉప్పులతోపాటు బోలెడు చిల్లర పైసలు ఉండేవి. ఒకటి, రెండు, మూడు, ఐదు, పది పైసల నాణేలు ఎక్కువగా వచ్చేవి. అప్పుడప్పుడూ పావలా, ఆఠానా, రూపాయి బిళ్లలొస్తే ఎంతో సంతోషం వేసేది. అందులో సగం మట్టి గురిగిలో దాచిపెట్టేది. మిగతా సగం చిల్లర డబ్బులు ఆయనకిస్తే.. “నీ బొంద! నువ్వే ఉంచుకో! ఏవన్న ఇంట్లకు అక్కెరున్నవి కొను!” అనేవాడట. ఇంటి ముందరికి అమ్మొచ్చిన చీపుర్లు లాంటివి కొనేదామె. ఇక దాచుకున్న డబ్బుల్తో అప్పుడప్పుడూ చాక్లెట్లు కొని ముగ్గురం తినేవాళ్లం. లేదా మేము హైదరాబాద్కు వెళ్లేటప్పుడు జడ క్లిప్పులో, పక్క పిన్నులో కొనుక్కురమ్మని మాకు ఇచ్చేది.
ఆ అయ్యగారు రోజూ పొద్దున్నే పౌరోహిత్యానికి వెళ్లేవాడు. అప్పట్లో ఏ పూజలు చేయించే వాళ్లయినా, ఏమీ తినకుండా కేవలం టీ మాత్రం తాగి వెళ్లి పూజలూ, నోములూ, వ్రతాలూ చేయించి.. ఇంటికొచ్చి తినేవారనుకుంటా. మన దూర్వాసుల వారూ అంతే! వచ్చిన చిక్కేమిటంటే ఇవతల మన కాండిడేట్కి వంట సరిగా రాదు. ఒకరోజు అన్నం ముద్దగా అయ్యేది. మరోరోజు పలుకు పలుకుగా ఉండేది. ఇంకోరోజు మొత్తం మాడి చచ్చేది. బెండకాయ కూర బొగ్గులయ్యేది. బీరకాయ ముక్కలు గుర్తు పట్టరానంత గుజ్జయ్యేవి. టమాట కూర చేద్దామనుకుంటే.. పుల్లటి చారుగా మారేది.
ఆయన ఇంటికొచ్చి ఆవురావురుమంటూ భోజనానికి కూర్చునే సరికి.. ఈమె ఎంతో వినయంగానే వడ్డించేది. కానీ, ఆయనకు మాత్రం ఒక్క బుక్క నోట్లో పెట్టేసరికి కోపం నషాళానికంటేది. దబాదిబా బాదేవాడు ఆమెను. ఆమె ఏడుస్తూ పెరట్లోకి పరిగెత్తేది. మా ఇంటిదాకా ఆమె అరుపులు వినిపించేసరికి.. మా అమ్మ “ఏందమ్మా! ఏమైంది?!” అని మా ఇంట్లోనుంచే అడిగేది. అమ్మ గొంతు వినగానే ఆయన కొట్టడం ఆపేసేవాడు.
ఆ తరువాత ఈ టెక్నిక్ తెలుసుకుని పెరటి ద్వారం గొళ్లెం పెట్టి మరీ కొట్టేవాడని ఆమె చెప్పింది. ఎప్పుడైనా మేము వాళ్లింటికి వెళ్లినప్పుడు ఆమె ఒక్కతే సినిమాలో ఊర్వశి శారదలా ఏడుస్తూ కనిపించేది. మాకు మనసులో ఏదో కార్నర్లో చెప్పరానంత బాధ కలిగేది. “ఏమైంది ఒదినా?!” అనడిగితే.. “మీ అన్న కొట్టిండు బుజ్జమ్మా !” అని చెప్పేది. పప్పు మాడినా, కూరలో ఉప్పు ఎక్కువైనా ఆయన కొడతాడని ముందుగానే ఏడ్చేదామె. ఏమీ చేయలేక.. “అమ్మా! పక్కింటి ఒదినె ఏడుస్తున్నది” అంటూ పరిగెత్తి వెళ్లి అమ్మకు చెప్పేవాళ్లం. అమ్మ కారణం కనుక్కుని.. “సరే పాపం! ఈ పప్పు ఇచ్చి రాపోండి” అని మా ఇంట్లో వండిన పప్పు ఇచ్చేది. నేను ఆంజనేయుడు సంజీవని పర్వతం మోసుకెళ్లినట్టు వెళ్లి.. ఆనందంగా ఇచ్చివచ్చేదాన్ని. ఏదో ఓ పప్పు.. బావుంటే తినాలి గానీ ఆయన ఆ పప్పు రుచి చూసి.. “నిజంగ చెప్పు! గీ పప్పు నువ్వే ఒండినవా? దొర్సాని వాళ్లింట్ల అడిగి తెచ్చినవా?!” అని మొత్తం తిని మళ్లీ కొట్టేవాడట.
తిట్టడం, కొట్టడం మాట అటుంచి మా నాన్న ఏరోజూ అమ్మను ‘రావే! పోవే!’ అన్నది కూడా మేము వినలేదు. మరి ఈ అయ్యగారేమో స్టంట్ మాస్టర్.
“ఆయన్నుంచి ఈ ఒదినను కాపాడ్డం ఎలా?” అని నేనూ, అక్కా చర్చించుకునేవాళ్లం. చివరికి ఒక ఎక్స్ట్రా రఫ్ నోట్బుక్లో అమ్మనడిగి రోజువారీ వంటలన్నీ స్టెప్ బై స్టెప్ రాసి, గెంతుకుంటూ వాళ్లింటికెళ్లాం. ‘ఇవన్నీ చదివి రోజూ వండిపెడితే ఇక అయ్యగారి మొహం చూడాలి.. ఏమనలేక గుటుకూగుటుకూ మింగుతాడు’ అనుకుంటూ సంతోషంగా ఆమె చేతిలో పెట్టాం.
“గీ పుస్తకం నేనేం జేసుకుంట బుజ్జమ్మా!” అన్నది ఒదినె. “ఎందుకు? ” అనడిగాం. ఆమె చెప్పిన సమాధానం విన్నాక.. మేం గాలి తీసిన బెలూన్లలాగా అయిపోయాం. ఆమెకు అసలు చదువే రాదు. ఎప్పుడో చిన్నప్పుడు అక్షరాలూ, గుణింతాలూ పలక మీద దిద్దిందట గానీ, ఏవీ గుర్తులేవట. ఇంకేం చేస్తాం? వాటిని మేమే చదివి వినిపించేవాళ్లం. ఒదినెకు కథలంటే ఇష్టం. ‘చందమామ, బాలమిత్ర’ పుస్తకాలు రాగానే మేము పట్టుకెళ్లి ఆమెకు చదివి వినిపించేవాళ్లం. అవి వింటున్నప్పుడు ఆమె కళ్లలో ఎంత సంతోషం కదలాడేదో చెప్పలేను.
కొన్నాళ్లకు ఆయనకు ఏదో గుడిలో పర్మనెంట్గా పని దొరికిందని.. వాళ్లు వరంగల్ వెళ్లిపోయారు. చాలా సంవత్సరాల తరువాత నేను ఒకసారి లోన్ రికవరీకి ఆ ఏరియాకు వెళ్లినప్పుడు తెలుసుకుని వాళ్లింటికి వెళ్లాను.
“బుజ్జమ్మా! నువ్వు బ్యాంక్ ఆఫీసర్ అయినవా?” అని ఎంత సంతోషపడిందో! పెద్ద ఇల్లూ, కొడుకులూ, కోడళ్లూ, మనవలతో చాలా బావుంది. ఆయన కూడా.. “నువ్వు శాన పెద్ద నౌకరీ చేస్తవని నాకు అప్పుడే అనిపించేది” అన్నాడు.
ఆమె తనే చేసిన లడ్డూలు, కారప్పూస పెట్టింది. ఆయన.. “కాఫీ తాగుతరా? చాయ్ తాగుతరా?” అని పదిసార్లు అడిగి మర్యాద చేశాడు.
నా వెంట ఉన్న మా బ్యాంకు వాళ్లు.. “ఇదేంది మేడమ్! మీరు ఎక్కడికి పోతె అక్కడ ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమిటి ?!” అని ఆశ్చర్యపోయారు.
నెల్లుట్ల రమాదేవి ( Nellutla Ramadevi ), రచయిత్రి
“Ramaayanam | మామయ్య పెండ్లి..”
Ramaayanam | పరీక్షలొస్తున్నయ్..