Kasi Majili Kathalu Episode 78 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కన్యాకుబ్జ రాకుమారులు పశ్చిమ దిగ్విజయ యాత్ర చేస్తున్నారు. వారిలో పెద్దవాడైన శ్రీముఖుడు.. మహారాష్ట్ర రాకుమారిని పెళ్లాడాడు. మిగిలిన నలుగురూ వరుణద్వీపానికి వెళ్లే ప్రయత్నంలో సముద్రంలో ఓడలు మునిగి గల్లంతయ్యారు. విక్రముడు ప్రాణాలతో బయటపడి.. ఒక ద్వీపంలోని గాయత్రీ ఆలయానికి చేరుకున్నాడు. అక్కడ ఆకాశం నుంచి దిగివస్తున్న దేవకన్యలను చూశాడు.
అపూర్వమైన సుగంధ సౌరభం ఆ ప్రాంతమంతా వ్యాపించింది. గర్భాలయంలో అమ్మవారి వద్ద పరిచయమైన పరిమళమే అది. ‘అయితే దేవిని క్రమం తప్పకుండా పూజించేది వీళ్లేనన్నమాట’ అనుకున్నాడు విక్రముడు.
ఇంతలో నేలకు దిగిన నక్షత్రాల్లా.. ఆ నలుగురు దేవకాంతలూ తటాకం వద్దకు చేరుకున్నారు. తమ కట్టువస్ర్తాలను గట్టుపై విడిచి, కబుర్లు చెప్పుకొంటూ జలక్రీడలు సాగించారు.
‘ఆహా! వీరు దేవకాంతలే కావచ్చు. వీరి దర్శనం చేత నేను ధన్యుడినయ్యాను. నేను వీరితో మాట్లాడగలనా?! నాకంతటి భాగ్యం పడుతుందా?!’ అనుకున్నాడు విక్రముడు.
అంతలోనే మళ్లీ..
‘ఇది కలో నిజమో తెలియకుండా ఉంది. స్వప్నమే అయితే మన సంకల్పాలతో పనిలేదు కదా! చూద్దాం ఇదెంతవరకు పోతుందో’.. అనుకుంటూ గర్భాలయంలోకి పోయి, అమ్మవారి పాదపీఠం వెనుక దాక్కుని ఉన్నాడు.
జలక్రీడలు ముగించిన దేవకాంతలు ఆలయంలో ప్రవేశించారు. అమ్మవారిని అనేక స్తోత్ర పాఠాలతో కీర్తించారు. విగ్రహం ముందున్న నిర్మాల్యాన్ని గమనించి.. అంతకుముందు తాము చేసిన పూజ కాదని కొంతసేపు తమలో తాము తర్కించుకున్నారు. గాలికి చెదిరి ఉండవచ్చని సమాధానపడి, షోడశోపచారాలతో గాయత్రీ దేవిని పూజించారు.
పూజలో భాగంగా సంకల్పంలో వారు చెప్పుకొన్న పేర్లను విక్రముడు గుర్తుపెట్టుకున్నాడు. వారిలో మొదటి కన్య ఇంద్రుని కూతురు మధుమతి. తరువాతి వారు వరుసగా యముని కూతురైన గంధవతి, వరుణుని కూతురైన వారుణి, కుబేరుని కూతురైన చంద్రకళ.
పూజ పూర్తయిన తరువాత మధుమతి చేతులు జోడించి..
“వేదమాతా! దేవగురుని ఆజ్ఞప్రకారం ఆరు సంవత్సరాల నుంచి ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చి నిన్ను పూజించి, జాగరణ వ్రతం చేస్తున్నాం. రాబోయే శుక్రవారంతో మా వ్రతం పూర్తవబోతున్నది. ఇక మా అభీష్టాన్ని ఎలా నెరవేరుస్తావో.. ఏమో!! అన్నిటికీ నిన్నే నమ్ముకున్నాం” అని గాయత్రీదేవిని ప్రార్థించింది.
ఆ తరువాత మబ్బుల చాటునుంచి బయటపడ్డ మెరుపుతీగల్లా ఆ నలుగురూ గర్భాలయం నుంచి బయటికొచ్చి ముఖమంటపంలో ఉన్న స్ఫటికశిలా వేదికపై కూర్చుని మాట్లాడుకోసాగారు.
“గంధవతీ! మరొక్కవారంలో మన వ్రతం పూర్తవబోతున్నది. అప్పటికి అమ్మవారు మన అభీష్టాన్ని నెరవేర్చాల్సిందే! మన కోరికల్లా తగిన భర్తలను పొందడమే కదా.. ముందుగానే మనకు ఎలాంటి భర్తలు కావాలో అమ్మవారికి చెప్పుకొందాం. పై శుక్రవారం నాటికి అమ్మవారు మన కాబోయే భర్తలను సిద్ధంగా ఉంచుతుంది” అన్నది మధుమతి.
దానికి గంధవతి నవ్వుతూ..
“సఖీ! అమ్మవారు మనకు ప్రత్యక్షమైనప్పుడు కదా.. వరాలు కోరవలసింది. ఇప్పుడే తొందరేల?!” అన్నది.
“అయ్యో! మాత ప్రభావం నువ్వు ఎరుగవు కాబోలు. మహర్షులకు సైతం ఆమె దర్శనభాగ్యం లభించదు. ఆరాధించినవారి కోరికలు మాత్రం నెరవేరుస్తూ ఉంటుంది. కోరికలు నెరవేరడమే ఆమె అనుగ్రహించింది అనడానికి సంకేతం. ఈ విషయాన్ని దేవగురువు మనకు ముందే చెప్పారు కదా!? మరిచావా!” అని గుర్తుచేసింది వారుణి.
అప్పుడు చివరిదైన చంద్రకళ కల్పించుకుని..
“సఖీ మధుమతీ! ముందుగా నువ్వే నీకు ఎటువంటి భర్త కావాలో కోరుకో. ఆ తరువాత మావంతు” అని నవ్వింది.
మధుమతి తన మనసులోని మాట బయటికి చెప్పటానికి కొద్దిగా సిగ్గుపడింది. “నన్ను అత్యాశపరురాలని అనుకోవద్దు. నాకు కాబోయే వరుడు గొప్ప వంశంలో జన్మించాలి. లోకాతీత సౌందర్యశాలి కావాలి. కావాల్సిన వస్తువులను సాధించుకోగలిగే నేర్పు ఉండాలి. ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. సకల ఐశ్వర్యవంతుడు, శాసకుడు అయిన వాణ్నే కానీ నేను వరించలేను. అటువంటి భర్తనే నాకు ఇవ్వమని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను” అని పలికింది.
మిగిలిన ముగ్గురూ సంతోష సూచకంగా నవ్వారు.
తదుపరి గంధవతి మాట్లాడుతూ.. “చెలీ! నువ్వు ధీరోదాత్తుణ్ని కోరుకున్నావు. నేను మాత్రం సామాన్యుణ్ని కోరుకోగలనా?! నువ్వు కోరిన గుణాలన్నీ ఉండి.. కీర్తిప్రతాపాలు కలిగి, పురుషార్థాలయందు ఇష్టం కలిగినవాణ్ని నాకు భర్తగా చేయమని అమ్మను కోరుకుంటాను” అన్నది.
“సరి సరి! నువ్వు ధీరోదాత్తుణ్ని కోరుకున్నావు. ఇక.. నా మాట కూడా అమ్మవారికి వినిపిస్తాను. వీరిద్దరూ కోరుకున్న గుణాలు కలిగిన ధీరలలితుణ్ని నాకు పతిగా చేయి తల్లీ!” అని వారుణి చేతులు జోడించింది.
ఆమె మాటలకు మధుమతి హాయిగా నవ్వింది.
“ఏమే వారుణీ! ధీరలలితుడైతే ఎప్పుడూ నిశ్చింతగా ఉంటాడు. భోగాలమీద ఆసక్తి కలిగి.. నిన్నెప్పుడూ ఒళ్లో కూర్చోబెట్టుకుని వినోదిస్తాడు. అంతేనా!?” అన్నది క్రీగంట చూస్తూ.
వారుణి సిగ్గుపడి నవ్వింది. అంతలోనే.. “చంద్రకళా! నీ మనోరథం కూడా వెల్లడించు. చతుర్విధ నాయక లక్షణాలలో ధీరశాంతుడే మిగిలి పోయాడు పాపం!” అన్నది.
చంద్రకళ చేతులు జోడించుకుని..
“వేదమాతా! నాకు నాయక లక్షణాలు తెలియదు. వీరు ముగ్గురూ కోరుకున్న గుణాలన్నీ ఉన్న పురుషుణ్నే నా మనోహరుడిగా చేయి” అని మొక్కుకున్నది.
“అమ్మకచెల్ల! చెలీ.. ఎంత గడుసుదానివి! మా భర్తలకంటే నీ భర్తే ఉత్తముడు కాగలడు. కానివ్వు.. సంతోషమే! ఇంతకూ చెలులారా! మన నాయకులు ఏ లోకాలకు చెందినవారో తేల్చుకోవాలి కదా! దేవతలా, మనుష్యులా.. పన్నగులా?!” అని ప్రశ్నించింది మధుమతి.
మాటకు నివ్వెరపోయిన చంద్రకళ.. “అక్కా! మనం దేవతలమై ఉండగా మన భర్తలు మనుషులు, నాగులు ఎలా కాగలరు? అటువంటి ప్రశ్నకు అవకాశమే లేదు కదా!” అన్నది.
“మనుషుల సామర్థ్యం నీకు సరిగా తెలియదు. దేవతల కన్నా ఎక్కువ ప్రతిష్ఠ కలిగినవారు మనుషులలో అనేకమంది ఉన్నారు. మన ఊర్వశి దేవతలందర్నీ విడిచి పురూరవుని వరించిన కథ నీకు తెలియదా?!” అని పలికింది మధుమతి.
“కావచ్చు.. కానీ, మానవులు అల్పాయువులు కదా!” అని సందేహించింది చంద్రకళ.
“దేవసంపర్కం కలిగినప్పుడు మానవులు కూడా దీర్ఘాయువులే అవుతున్నారు” అన్నది మధుమతి.
“నిజమేననుకో అక్కా! మానవులైతే ఒక పోలికగా ఉంటారు. కానీ, పాములకు చక్కదనం ఏముంటుంది?!” అని మరో సందేహాన్ని ముందుంచింది వారుణి.
“ఇదా నీ సందేహం!? దీనికి నేనొక చక్కని కథ చెబుతాను. సావకాశంగా ఆలకించండి” అంటూ మధుమతి ఇలా చెప్పసాగింది.
* * *
మా తండ్రి మహేంద్రుని సారథి పేరు మాతలి. ఆయనకు లేకలేక గుణకేశిని అనే కూతురు పుట్టింది. ఆ బాలికామణి సౌందర్యాన్ని వర్ణించడానికి ఆదిశేషునికైనా శక్యం కాదట. అటువంటి కూతురికి సరైన వరుణ్ని ఎంపిక చేయడం కోసం మాతలి దేవలోకాలన్నీ గాలించాడు. రూప యవ్వన విద్యామద గర్వితులైన దేవతా ప్రముఖులెవరూ ఆయనకు నచ్చలేదు. భార్య సలహాపై భూలోకంలో కూడా మూడుసార్లు పర్యటించి వచ్చాడు. కానీ, ఎక్కడా నచ్చిన వరుడు దొరక్కపోవడంతో విసిగివేసారి ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పుడతని భార్య.. “మనోహరా! రత్నంలాంటి పిల్లను చూస్తూ చూస్తూ సామాన్యుడికి కట్టబెట్టలేం. కష్టపడి రెండులోకాలు తిరిగారు కదా.. భోగిస్థానమైన పాతాళానికి కూడా వెళ్లిరండి చూద్దాం” అన్నది.
సరేనంటూ బయల్దేరిన మాతలికి మార్గమధ్యంలో నారదమహర్షి కనిపించాడు. స్తోత్రపాఠాలు అందుకుని, మహర్షి కొన్ని కుశల ప్రశ్నలు వేశాడు. తరువాత.. ‘ఎందాకా ప్రయాణం’ అని అడిగాడు.
అప్పుడు మాతలి.. “స్వామీ! మాతృ సంప్రదాయాన్ని బట్టి నాకొక ఆడపిల్ల పుట్టింది. ఆమెకు తగిన వరుని కోసం ఎంతవెతికినా స్వర్గ మర్త్య లోకాలలో లభించలేదు. పాతాళమొక్కటి చూడాల్సి ఉంది. నేనెప్పుడూ ఆ లోకాన్ని చూడలేదు. మీరు శ్రమ అనుకోకపోతే నాతో పాటు రాగలరా?! మీకెల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను” అని ప్రార్థించాడు.
నారదుడు నవ్వి.. “అయ్యో పిచ్చివాడా! ఇంతచిన్న విషయానికి నన్నింతగా స్తుతించాలా? నేనిప్పుడు వరుణలోకానికే పోతున్నాను. నాతో రా” అని నేరుగా వరుణదేవుని వద్దకు తీసుకుపోయాడు.
వరుణుని కుమారులను చూపించాడు.
“ఇదిగో.. ఇతడు పుష్కరుడు. వరుణుడి పెద్దకొడుకు. ఇతడి భార్య జ్యోత్స్నాకళకు రెండో మహాలక్ష్మి అని పేరు. ఆమె క్షేముని పుత్రిక. అదిగో వారందరూ ఇతని తమ్ముళ్లు. విద్యారూప సంపన్నులు. వీరిలో ఎవరైనా నీకు నచ్చితే చెప్పు” అని అడిగాడు.
మాతలి అనిష్టంగా తలూపాడు. అంతటితో వరుణదేవుని అనుమతి తీసుకుని వారిద్దరూ ఆ లోకంలో విహరించసాగారు. ఆ లోక విశేషాలన్నిటినీ నారదుడు మాతలికి పరిచయం చేయసాగాడు.
“మాతలీ! ఇది భోగవతీ నగరం. రసాతలంలో ఉన్న ఏడోలోకం. కామధేనువు ఇక్కడే పుట్టింది. అదిగో ఆ చెరువు చూశావా!? దానినే వారుణహ్రదం అంటారు. అందులో సర్వదా అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. గాండీవానికి పుట్టినిల్లిదే. అదిగో.. ఆ గొడుగే వరుణచ్ఛత్రము. దీనిపై పడిన వర్షబిందువులు చంద్రకిరణాల్లా ఆహ్లాదాన్ని కలగచేస్తాయి. ఈ ప్రదేశాలలో రాజ్యాలు పోగొట్టుకున్న రాక్షసులు నివసిస్తుంటారు. వేయిపడగల ఆదిశేషుడు ఇక్కడే నిలిచి భూమిని మోస్తున్నాడు. ఇది నాగులకు స్థావరం. స్వభావం చేత రౌద్రులైనా వీరంతా మహాప్రభావవంతులు” ..అని నారదుడు చెబుతున్నంతలో, నాగప్రముఖులందరూ నారద మహర్షి వద్దకు గుంపులు గుంపులుగా వచ్చారు. ఆయనకు నమస్కరించి.. “మహాత్మా! ఈమధ్య మీ దర్శనమే మాకు లభించడం లేదు. అందువల్ల ఇతర లోక విశేషాలేమీ తెలియరావడం లేదు. కొత్త విశేషాలేవైనా చెప్పగలరా?!” అని ప్రశ్నించారు.
దాంతో నారదుడు వారితో కొంతసేపు ఇష్టాగోష్ఠి జరిపాడు. ఆ తరువాత.. “మహాత్మా! మేం మీ వీణాగానం విని చాలాకాలమైంది. ఒక్కసారి గాయత్రీసామం పాడి మాకు ఆనందం కలగచేయండి” అని వేడుకున్నారు వాళ్లంతా.
నారదుడు మాతలి వైపునకు తిరిగి.. “నీకోసమే నేనీ కచేరీ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చేవారిలో నీకు నచ్చేవారెవరో చూసుకో” అంటూ వీణాగానం ప్రారంభించాడు.
ఆ గానాన్ని వింటూ ఒకచోట నిలువలేక నారదుడి చుట్టూ తిరుగుతూ, శిరస్సులు ఊపుతూ నాగులందరూ పరవశిస్తున్నారు. వారినందరినీ జాగ్రత్తగా పరిశీలించిన మాతలి.. సుముఖుడు అనే నాగకుమారుణ్ని ఎంపిక చేసుకున్నాడు. కచేరీ తరువాత నారదుడు, మాతలి కలిసి ఆర్యకుని ఇంటికి వెళ్లారు.
“ఆర్యకా! ఇతని పేరు నువ్వు వినే ఉంటావు. మాతలి అంటారు. మహేంద్రులవారికి సారథి.. మిత్రుడు, మంత్రి, ప్రాణంలో ప్రాణం అని చెప్పవచ్చు. ఇటువంటి తేజస్వి ఎక్కడా లభించడు. యుద్ధయాత్రలలో వేయిగుర్రాలు పూన్చిన ఇంద్రుని రథాన్ని ఇతడు కేవలం మనస్సుతో నడుపుతుంటాడు. ఇతడు గుర్రాలచేత జయించిన శత్రువులనే మహేంద్రుడు తన చేతులతో నిర్జిస్తాడు. స్వర్గ వైభవమంతా ఇతనిదే అని చెప్పవచ్చు. ఇతనికి అతిలోకసుందరి అయిన గుణకేశిని అనే కుమార్తె ఉంది. ఆమెకు వరుణ్ని అన్వేషిస్తూ ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. మీ కుటుంబంతో వియ్యమందాలని కోరిక” అన్నాడు నారదమహర్షి.
అందుకు ఆర్యకుడు.. “మునీంద్రా! త్రిలోకాధిపతి అయిన మహేంద్రుని మంత్రియే వచ్చి పిల్లనిస్తామంటే కాదనే మూర్ఖుడు ఉంటాడా?! కానీ నాకా అదృష్టం లేదు. కొడుకును పోగొట్టుకుని నెలరోజులు కూడా కాలేదు. మరొక్క పదిరోజుల్లో మనుమణ్ని కూడా పోగొట్టుకోబోతున్నాను.
ఈ కడుపుకోతను భరించడం నావల్ల కావడం లేదు. ఇలాంటి సమయంలో మీరు పెళ్లిసంబంధం అంటూ వస్తే నేనేం చెప్పగలను” అంటూ గోలుగోలున ఏడవసాగాడు. అతణ్ని ఊరడించలేక నారదుడు, మాతలి తబ్బిబ్బయ్యారు.
* * *
..మధుమతి చెబుతున్న కథను మిగిలిన ముగ్గురూ ఆసక్తిగా వింటున్నారు. కొద్దిదూరంలో ఒక స్తంభం మాటునుంచి విక్రముడు.. ఆ తరువాత ఏం జరగబోతున్నదో అని చెవులు రిక్కించి మరీ వింటున్నాడు.
(వచ్చేవారం.. వరించిన అదృష్టం)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | వరుణద్వీపంలో దేవకన్యలు
Kasi Majili Kathalu | పాతాళాన్ని గెలిచిన మానవుడు
Kasi Majili Kathalu | సుధన్వుడి రససిద్ధి
Kasi Majili Kathalu | పాతాళ గుహ
Kasi Majili Kathalu | అపరాధ విచారణ
Kasi Majili Kathalu | రత్నాంగి తెచ్చిన తగాదా
Kasi Majili Kathalu | విడిపోయిన జంట