Kasi Majili Kathalu Episode 77 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కన్యాకుబ్జ రాకుమారులు ఐదుగురు దిగ్విజయ యాత్ర చేస్తూ సుడిగాలిలో చిక్కుకున్నారు. పెద్దవాడైన విద్యాసాగరుడు శ్రీనగర యువరాణిని పెళ్లి చేసుకున్నాడు. మిగిలిన నలుగురిలో ముగ్గురు రాకుమారులు.. చిలకలగుట్ట మీద నీళ్లు తాగి చిలకల్లా మారిపోయారు. ఆ ఉదంతాన్ని చూసిన హరివర్మ తన తమ్ముళ్లను తెలివిగా రక్షించుకున్నాడు. అంతకుముందు జరిగిన కథను అందరితో వివరంగా చెబుతున్నాడు.
ప్రశాంతమైన సరస్సులో ఉన్నట్లుండి సుడిగుండాలు చెలరేగసాగాయి. నీటి అడుగు నుంచి చేప, మొసలివంటి జలచరమేమీ కాని వింత ఆకారమొకటి నెమ్మదిగా పైకి లేవసాగింది. అది చూసి నేను గట్టుపైకి పరుగెత్తి, ఆయుధం ధరించి నిలబడ్డాను. ఆ ఆకారానికి మూరెడేసి గోళ్లున్నాయి. మోకాళ్లవరకూ వేలాడే పొడవాటి జటలున్నాయి. ఆ ఆకారం నా ఎదురుగా ఉన్న గట్టుమీదికి వెళ్లి కూర్చుంది. జాగ్రత్తగా గమనిస్తే అదొక మానవాకృతి అని తెలిసింది. ఆయన కొద్దిపాటి ధ్యానం అనంతరం, సూర్యునికి అర్ఘ్యమిచ్చాడు. ఒక చెట్టుకింద దోసిలిపట్టి నిలుచున్నాడు. ఆ చెట్టునుంచి కొన్ని పళ్లు ఆయన దోసిట్లో రాలిపడ్డాయి. వాటిని ఆయన భగవంతునికి నివేదించి, భుజించాడు.
నేను ఆ వింతను కళ్లారా చూస్తూ..
‘ఈ మహాముని ఎవ్వరో కానీ, జలస్తంభన చేసి.. ఈ తటాకంలో మునిగి జపం చేసుకుంటున్నట్లు ఉన్నాడు. ఇప్పుడెందుకో బాహ్యస్మృతి కలిగినందువల్ల బయటికి వచ్చాడు. నేను ఆయనను ఆశ్రయిస్తే, నా సమస్యకు పరిష్కారం దొరకవచ్చు’ అనుకుని, పరుగు పరుగున ఆయన వద్దకు వెళ్లి.. పాదాలపై పడ్డాను.
ఆ ముని ఎర్రని కళ్లతో.. “ఎవడవురా నువ్వు? ఈ నిర్జన ప్రదేశంలోకి ఎలా వచ్చావు? సరస్సులో నీటిని తాగలేదా?!” అని గద్దించాడు.
అప్పుడు నేను.. “మహాత్మా! నేడు నా జన్మ పండినది. మీ దృష్టి ప్రసారం నాపై పడటంతో నా పాపాలు పటాపంచలైనవి” అంటూ స్తోత్రపాఠాలు ప్రారంభించాను.
ఆయన నాకు ప్రసన్నుడై.. “ఈ స్తుతివచనాలకేమి? నీ మనసులోని కోరికేమిటో చెప్పుకో” అన్నాడు.
“స్వామీ! నేను మా సోదరులతో కలిసి, సుఖంగా ఇంటికి తిరిగి వెళ్లేలా ఆశీర్వదించండి” అని కోరాను.
అప్పుడు ఆ సిద్ధుడు క్షణంసేపు కళ్లు మూసుకుని, కూర్చున్న చోటునుంచి లేచాడు. సమీపంలోని ఒక మూలికను తెంపి తెచ్చి నా చేతిలో పెట్టాడు. దానిని ప్రయోగించే విధానం వివరంగా చెప్పి.. “ఇక వెళ్లు. నీ కోరిక త్వరలో నెరవేరుతుంది” అంటూ ఆయన మళ్లీ చెరువులోకి మునిగిపోయాడు.
ఆ యోగి మూలంగా నా కర్మసూత్రం సడలిపోయిందని సంతోషిస్తూ.. ఆయన ఇచ్చిన మూలికను పదిలంగా మూటకట్టుకున్నాను. అడవి చిలకలను వెతుక్కుంటూ వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించసాగాను. కానీ, నన్ను చూడగానే చిలకలు ఎగిరిపోతున్నాయి.
అప్పుడు నేను బాగా ఆలోచించి, సిద్ధుడిచ్చిన మూలికను మట్టిముద్దలో కలిపి.. ఆ ఉండలను చిలకలకు తగిలేలా విసురుతూ పోసాగాను. అలా చాలాకాలం నా ప్రయత్నం కొనసాగింది. ఒకనాడు ఒక చెట్టుకొమ్మపై కూర్చుని ఉన్న చిలకవైపు మట్టి ఉండ విసిరేసరికి అది కాస్తా.. అందమైన యువతిగా మారింది.
..అని చెబుతూ, హరివర్మ తన భుజంమీది చిలకను చేతిలోకి తీసుకున్నాడు.
“ఆమె ఈమెయే!..” అంటూ ఓషధీ లతను ఆమెకు తగిలించాడు.
వెంటనే ఆ చిలక మనోహరమైన యువతిగా ఆకారాన్ని ధరించింది. ఆ తరువాత ఆమె తన కథను స్వయంగా ఇలా చెప్పింది..
“నేను అవంతీ రాకుమారిని. నా పేరు చారుమతి అంటారు. నేను మా తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురిని. నేను నా స్వయంవర సభాభవనంలో వరమాల చేతిలో పట్టుకుని నడుస్తూ ఉండగా.. ఎక్కణ్నుంచో ఒక బ్రహ్మరాక్షసుడు వచ్చిపడ్డాడు. చూస్తున్నవారంతా హాహాకారాలు చేస్తుండగా.. నన్నెత్తుకుని, గరుడపక్షిలా ఆకాశంలోకి ఎగిరాడు. నేను అతని పట్టునుంచి విడిపించుకోలేక గిలగిల్లాడాను. వాడు నన్ను ఒక కొండమీదికి తీసుకుపోయి కిందికి దింపాడు.
“సుందరీ! నేను మధువనే రాక్షస చక్రవర్తిని. నాతో సమవుజ్జీ అయినవాడు ముల్లోకాలలోనూ లేడు.
గగనవీధిలో పోతూ కిందనున్న నీ సౌందర్యం చూసి మోహాన్ని ఆపుకోలేకపోయాను. అందుకే నిన్ను ఎత్తుకొని వచ్చాను. నన్ను వరించు” అని పలికాడు.
నాకు విపరీతమైన కోపం వచ్చి నోటికి వచ్చినట్లు తిట్టసాగాను. కొంతసేపటికి నాలుక ఎండిపోయి మాటరాక ఎక్కిళ్లు వచ్చాయి. దాంతో వాడు కంగారుపడ్డాడు.
“అయ్యయ్యో ప్రేయసీ! ఏమైనది.. మంచినీళ్లు కావాలా?! చిటికెలో తెస్తానుండు!” అంటూ తటాకం కేసి వెళ్లినవాడు ఎంతకూ రాలేదు. నేను వాడి గురించి ఆలోచించడం మాని.. ఆ తటాకానికి వెళ్లాను. ఆ నీళ్లు తాగగానే చిలకగా మారిపోయాను”.. ..అంతవరకూ చారుమతి చెప్పిన కథను, ఆ తరువాత హరివర్మ కొనసాగించాడు.
మేమిద్దరం ఒకరి కథలు మరొకరికి చెప్పుకొన్నాం. తన ప్రాణదాతనైన నన్ను చారుమతి వరించింది. గాంధర్వ పద్ధతిలో మా వివాహం జరిగింది. నా తమ్ముళ్లను కాపాడే ప్రయత్నంలో నాకు సహకరిస్తానని మాటిచ్చింది. మేమిద్దరం కలిసి ఒక వెదురుగొట్టంలో తటాకపు నీళ్లు పట్టుకున్నాం.
ఆ నీళ్లసాయంతో నేను కోరినప్పుడల్లా నా భార్యను చిలకగా మార్చేవాణ్ని. తిరిగి మూలికసాయంతో మానవరూపానికి తెచ్చేవాణ్ని. మేమిద్దరం కోయవేషాలు ధరించాం. బంగారం కరిగించి, దానిలో ఓషధిని కలిపి మువ్వలు తయారుచేయించాం.
ఈ పట్టణంలో తిరిగి.. చిలకలు ఉన్నవారందరికీ ఆ మువ్వలను అమ్మాం. మా ప్రయత్నం చివరికి ఫలించింది. నా తమ్ముళ్లు ముగ్గురికీ మామూలు రూపాలు వచ్చాయి. అన్నట్లు ఆనాడు చారుమతిని ఎత్తుకొచ్చిన బ్రహ్మరాక్షసుడే నిన్న మా చేతిలో చచ్చినవాడు.
..అని హరివర్మ చెప్పిన కథను విని రాజైన సోమదత్తునితోపాటు సభాసదులందరూ ఆశ్చర్యపోయారు.
“మహావీరా! మీ తమ్ముళ్లు ముగ్గురూ శుకరూపాలు ధరించి మా అంతఃపురంలోకి ప్రవేశించారు. అక్కడే స్వరూపాలను పొందారు. ప్రఫుల్ల నా పుత్రిక. ఈమె కళాభిరాముణ్ని వరించింది. నా మంత్రి పుత్రిక కాళింది.. మీ సుధర్ముణ్ని కోరుకుంటున్నది. ఇక ఈ రుక్మవతి.. సామంతరాజు పుత్రిక. సులోచనునికి ఇల్లాలు కాదగినది. త్వరలో ఈ మూడు వివాహాలూ జరిపిస్తాను. అప్పటివరకూ మీరంతా మా అతిథులుగా ఉండండి” అని కోరాడు.
అన్నట్లుగానే వారి వివాహాలను వైభవంగా జరిపించాడు. కొంతకాలమైన తరువాత రాజపుత్రులు తిరిగి స్వదేశానికి వెళ్లడానికి తొందరపడసాగారు. కానీ, సోమదత్తుడు బలవంతం చేయడంతో కొన్నినెలలు గిరివ్రజంలోనే ఉండిపోక తప్పలేదు.
చివరికి ఒక సుముహూర్తంలో వారి ప్రయాణం నిశ్చయమైంది. వెయ్యిమంది దాసదాసీ జనాలను, కోట్లాది ధనాన్ని అరణంగా ఇచ్చాడు సోమదత్తుడు. ఏనుగులు, గుర్రాలు, లొట్టిపిట్టలమీద సారె వస్తువులు ఎక్కించాడు. పుత్రికలను అందలాలెక్కించాడు. చతురంగ బలాలను తోడిచ్చి, అంపకాలు పెట్టాడు. హరివర్మతోపాటు నలుగురు రాజకుమారులూ తమ గుర్రాలనెక్కి ప్రయాణం ప్రారంభించారు.
గిరివ్రజం నుంచి కశ్మీరానికి వెళ్లే మార్గం చాలా సంకటంగా ఉంటుంది. మంచి దారులు లేవు. కొండలు దాటాలి. అడవుల మధ్యనుంచి ప్రయాణించాలి. మార్గమధ్యంలో అనేక మజిలీలు చేస్తూ.. మృగాలను వేటాడుతూ.. నదీసైకతాలలో విహరిస్తూ.. వారి ప్రయాణం ముందుకు కొనసాగుతున్నది.
అలా సాగుతుండగా వారికి ఒక మహారణ్య మధ్యలో సుందరమైన ప్రదేశం ఒకటి కనిపించింది. రాజపుత్రులు నలుగురూ తమ భార్యల కోరిక మేరకు ఆ ప్రాంతంలోనే నాలుగు రోజులపాటు విడిది చేశారు.
అక్కడ ఉండగా ఒకనాడు హరివర్మ.. తన గుర్రమెక్కి తూర్పుదిక్కుగా కొంతదూరం స్వారీ చేస్తూ వెళ్లాడు. కానీ, తిరిగి వచ్చేటప్పుడు దారి తప్పాడు. మధ్యాహ్నం వరకు తోచిన దారివెంట వెళ్లాడు. ఎంతకీ అంతూదరీ చిక్కలేదు.
అంతలో అతనికి దూరంగా ఏవో మంగళవాయిద్యాలు వినిపించాయి. అక్కడేదో గ్రామం ఉండి ఉండవచ్చనుకుంటూ ఆ దిశగా మళ్లాడు. అక్కడ అతనికి విశాలమైన కోట ముఖద్వారం దర్శనమిచ్చింది. దానికి రాజభటులు విచ్చుకత్తులతో పహరా కాస్తున్నారు.
కోటలో ఏదో శుభకార్యం జరుగుతున్నది కాబోలనుకున్నాడు హరివర్మ. అక్కడే ఉన్న ద్వారపాలకులను.. “ఓయీ! ఈ కోట ఎవరిది? లోపల జరుగుతున్న ఉత్సవం ఏమిటి?” అని ప్రశ్నించాడు.
కానీ వాళ్లెవరూ అతని మాటలను ఆలకించలేదు. దాంతో కోపగించిన హరివర్మ.. “ఓయీ! ద్వారపాలకులకు ఇంతటి అవివేకం తగదు. బాటసారితో ఒకసారి మాట్లాడితేనే మీ అధికారానికి కొరత కలుగుతుందా?! ఇది మర్యాదేనా?” అని హుంకరించాడు.
కానీ ఆ భటులు అతణ్ని ఏ మాత్రం లెక్కచేయకుండా.. “పోవయ్యా! గుర్రమెక్కిన ప్రతివాడూ రౌతు కాగలడా? ముందు మర్యాదగా గుర్రం దిగి మాట్లాడు. నిన్ను పరీక్షించి కానీ, లోపలికి వదిలేది లేదు” అని తలతిక్కగా సమాధానం ఇచ్చారు.
దాంతో మాటామాటా పెరిగింది. హరివర్మ కత్తిదూసి, భటుల మీదికి గుర్రాన్ని దూకించాడు. కొందరి జుట్టుకోసి భయపెట్టాడు. కొందరికి ముక్కులు, కొందరికి చెవులు చెక్కేశాడు. వాళ్లంతా.. ‘అయ్యో బాబో’ అని గగ్గోలు పెడుతూ లోనికి వెళ్లి, తమ ఏలికతో జరిగిన సంగతినంతా విన్నవించుకున్నారు.
ఉత్సవంలో ఉన్న మహారాజు తన దండనాథుణ్ని పంపాడు. యాభైమంది సైనికులతో కలిసి వెళ్లిన దండనాథుడు కూడా హరివర్మ చేతిలో చావుదెబ్బలు తిని వెనక్కి వచ్చాడు.
దండనాథుని అవస్థ చూసిన మహారాజు శ్రీవర్ధనుడు విస్మయపడ్డాడు. మనుమడి బారసాల మహోత్సవాన్ని జరిపిస్తుంటే పానకంలో పుడకలాగా ఈ తగాదా ఏమిటని విసుక్కుంటూ.. కొంతమంది సైన్యాన్ని తీసుకుని, తానే స్వయంగా బయల్దేరాడు.
శ్రీవర్ధనుడు వెళ్లేలోగానే.. బారసాల పూర్తయి మామగారి కాళ్లకు నమస్కరించాలని చూసిన విద్యాసాగరునికి ఆయన కనిపించక పోవడంతో.. ఏం జరిగిందని ఆరా తీశాడు. విషయం తెలుసుకుని, తానూ ఆ వెనుకే బయల్దేరాడు. ద్వారం వద్దకు చేరుకున్న శ్రీవర్ధనుడు.. హరివర్మను చూశాడు. అతను తన అల్లుడి పోలికలోనే ఉండటంతో కత్తి దూయకుండా నిదానించాడు. ఇంతలో విద్యాసాగరుడు రానేవచ్చాడు.
హరివర్మను గుర్తించి.. “తమ్ముడా! నేడెంత సుదినం” అంటూ కౌగిలించుకున్నాడు.
“అన్నా! నీ మీద ఆశలు వదులుకున్నాం. నేనూ తమ్ముళ్లు ఇంటిదారి పట్టాం. నేను ఇంతకుముందే దారి తప్పాను” అని హరివర్మ చెప్పుకొన్నాడు.
వెంటనే శ్రీవర్ధనుడు వారిని వెతకడం కోసం సైన్యాన్ని పంపించాడు. కొన్ని గంటల వ్యవధిలోనే మిగిలిన వారంతా పరివారంతో సహా కోటకు చేరుకున్నారు.
విద్యాసాగరుడు తన తమ్ముళ్లను చూసి చాలా సంతోషించాడు. విందు భోజనాలైన తరువాత.. “తమ్ములారా! ఒక్కొక్కసారి కీడు కూడా మేలుకోసమే వస్తుంది. ఆ మాట నా విషయంలో నిజమైంది. ఆనాడు ఆ సుడిగాలిలో తెగిన గాలిపటంలా ఎగిరిపోయిన నేను.. ఈ కోటగోడ అవతలకు చేరుకున్నాను. నా గుర్రం చేసిన సహాయం వల్ల ఈ ప్రమద్వరను కలుసుకోగలిగాను. ఈ అడవిలో తల్లిదండ్రుల అండలేకుండా ఒంటరిగా ఉన్న ఈమె నేనొక ఆడదాన్ననుకుని, తన అంతఃపురంలో చోటిచ్చింది”.. అని చెప్పి, కొద్దిగా ఆగాడు విద్యాసాగరుడు.
ఆ మాటతో సుధర్మునికి సందేహం వచ్చింది.
“అన్నా! వదిన నిన్ను స్త్రీగా పొరబడటం ఏమిటి?” అని ప్రశ్నించాడు.
విద్యాసాగరుడు నవ్వి.. “ఈ సృష్టిలో మగవాడు అనేవాడు ఒకడుంటాడని తెలియకుండా పెంచడం కోసం ఈమెను ఇక్కడ రహస్యంగా ఉంచారు. ఇక్కడ ఏ పురుషుడు అడుగు పెట్టినా, ప్రమద్వర కళ్లకు ఆడదానిలాగే కనిపించేలా ఒక సిద్ధుడు వరమిచ్చాడట” అన్నాడు.
“అయితే ఇప్పటికీ అంతేనా?!” అని నవ్వాడు సుధర్ముడు.
“లేదు. ఆ సిద్ధుడిచ్చిన వరం మా పెళ్లితో పూర్తయింది” అని చెప్పిన తరువాత.. “మామగారు తమతోపాటు నగరానికి వచ్చేయమని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు నేను. మీ వదిన కోరిక మేరకు ఇక్కడే ఉండిపోయాం. అదే మంచిదైంది. ఇదిగో నా కొడుకు పుట్టిన వేళావిశేషం.. విడిపోయిన తమ్ముళ్లందరినీ ఒక్కసారే కలుసుకోగలిగాను”
అని సంతోషం వ్యక్తం చేశాడు విద్యాసాగరుడు.
తొందరలోనే రాజపుత్రులందరూ తమ భార్యలతో, పరివారజనంతో.. మహావైభవంతో ఇంటిదారి పట్టారు. దారిమధ్యలో మజిలీలు చేస్తూ ద్వారవతీ నగరాన్ని చేరుకున్నారు.
(వచ్చేవారం.. వరుణ ద్వీపంలో దేవకన్యలు)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | పాతాళాన్ని గెలిచిన మానవుడు
Kasi Majili Kathalu | సుధన్వుడి రససిద్ధి
Kasi Majili Kathalu | పాతాళ గుహ
Kasi Majili Kathalu | అపరాధ విచారణ
Kasi Majili Kathalu | రత్నాంగి తెచ్చిన తగాదా
Kasi Majili Kathalu | విడిపోయిన జంట