WPL 2023 : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆరంభ వేడుకలు కన్నులపండువగా జరిగాయి. కామెంటేటర్ మందీరా బేడీ డబ్ల్యూపీఎల్ ప్రాధాన్యాన్ని, ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్న ఐదు ఫ్రాంఛైజీల గురించి వివరించింది. బాలీవుడ్ టాప్ హీరోయిన్లు కియరా అడ్వానీ, కృతిసనన్ చక్ దే ఇండియా, కోకకోలా, థుంకేశ్వరరీ వంటి పాటలకు డాన్స్తో ఆకట్టుకున్నారు. పంజాబ్, కెనడా ర్యాపర్ అమృత్ పాల్ సింగ్ ధిల్లాన్ తన పాటలతో స్టేడియాన్ని హోరెత్తించాడు.
అనంతరం ఐదు జట్ల కెప్టెన్లను బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని, సెక్రెటరీ జై షా, సభ్యులు రాజీవ్ శుక్లా, తదితరులు పరిచయం చేసుకున్నారు. స్మృతి మంధాన (ఆర్సీబీ), హర్మన్ప్రీత్ కౌర్ (ముంబై ఇండియన్స్), బేత్ మూనీ (గుజరాత్ జెయింట్స్), అలీసా హేలీ (యూపీ వారియర్స్), మేగ్ లానింగ్ (ఢిల్లీ క్యాపిటల్స్) మహిళల ప్రీమియర్ లీగ్ ట్రోఫీని ఆవిష్కరించారు.
ఎన్నో అంచనాలతో మొదలుకానున్న డబ్ల్యూపీఎల్ టోర్నమెంట్లో ఐదు జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఆరంభ పోరులో బేత్ మూనీ సారథ్యంలోని గుజరాత్ జెయింట్స్, హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. రాత్రి 7ః30 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది.
మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ వేలంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన జాక్పాట్ కొట్టేసింది. వేలంలో రికార్డు ధర పలికింది. రూ.3.44 కోట్లకు ఆర్సీబీ ఆమెను కొనుగోలు చేసింది. దీప్తి శర్మను రూ. 2.6 కోట్లకు యూపీ వారియర్స్ దక్కించుకుంది. జేమీమా రోడ్రిగ్స్ (రూ.2.2 కోట్లు), షఫాలీ వర్మ (రూ.2 కోట్లు)లను ఢిల్లీ భారీ ధరకు కొన్నది. భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ను రూ.1.8 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. డబ్ల్యూపీఎల్ టైటిల్ స్పాన్సర్ హక్కులను ఐదేళ్ల కాలానికి టాటా గ్రూప్, మీడియా హక్కులను వైకోమ్ 18 సంస్థ దక్కించుకున్న విషయం తెలిసిందే.
The moment we were all waiting for! 🤩
𝗣𝗿𝗲𝘀𝗲𝗻𝘁𝗶𝗻𝗴 𝘁𝗵𝗲 #𝗧𝗔𝗧𝗔𝗪𝗣𝗟 𝗧𝗿𝗼𝗽𝗵𝘆👌👌 pic.twitter.com/sqPBJjWw7A
— Women’s Premier League (WPL) (@wplt20) March 4, 2023