ఖైరతాబాద్ : ఎన్డీయే కూటమి పదేండ్ల పాటు బీసీలను మోసగించిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ (Jajula Srinivas Goud) ఆరోపించారు. లక్డీకాపూల్లోని హోటల్ అశోకలో బీసీల రాజకీయ మేథోమధన సమావేశం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె. శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 2014 ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడుతామని హామీ ఇచ్చి విస్మరించిందన్నారు.
ప్రస్తుతం రిజర్వేషన్ల (Reservations) ను నీరుగార్చే పనిలో ఉందని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. సామాజిక వెనుకబాటు ఆదారంగా రిజర్వేషన్లు కల్పించాల్సి ఉండగా, ప్రధాని మోదీ (PM Modi) ప్రభుత్వం రాజ్యాంగంలోని మూల సిద్ధాంతాన్ని మార్చి ఆర్ధికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు ఇస్తామనడం అర్థరహితమన్నారు. రిజర్వేషన్లు అనేవి పేదరిక నిర్మూలన పథకం కాదన్నారు.
చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, కులగణన, మహిళా బిల్లులో వారికి సబ్ కోటా కల్పించకుండా కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందన్నారు.అగ్రవర్ణ పేదలని చెబుతూ పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టారన్నారు. తాజాగా బీజేపీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలోనూ 70కోట్ల మంది బీసీల ఊసేలేదని ఆరోపించారు.