KCR | కాంగ్రెస్ మెడలు వంచి ఆరు గ్యారంటీలు అమలు చేయించాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. మన నదులు కాపాడాలంటే బీఆర్ఎస్ గెలవాలని.. ఢిల్లీ నుంచి నిధులు రాబట్టాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలని అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగించారు. ఆనాటి నుంచి ఈనాటి దాకా బ్రహ్మాండంగా తెలంగాణ కోసం పేగులు తెగే దాకా కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ కార్యకర్తలు అని ఈ సందర్భంగా కేసీఆర్ స్పష్టం చేశారు.
జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల్లో బీడీ కార్మికులు చాలామంది ఉంటారని కేసీఆర్ అన్నారు. వారికి కాంగ్రెస్, బీజేపీ ఏ ప్రభుత్వమైనా ఏనాడైనా రూపాయి పింఛన్ ఇచ్చిందా? అని ప్రశ్నించారు. బీడీ కార్మికులను ఆదుకున్నది ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వమే అని.. బీడీ కార్మికుల బతుకులు నిలబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. ఈనాడు బీడీ కార్ఖానాలను మోదీ బంద్ చేయిస్తున్నడు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదానికి డబ్బా కొడుతున్నడని విమర్శించారు. మీ నోట్లో కూడా మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని బీడీ కార్మికులను ఉద్దేశించి అన్నారు. కాబట్టి బీడీ కార్మికులు విజ్ఞతతో ఆలోచించాలని.. టేకేదారులు అందరూ కూడా చైతన్యం తీసుకొచ్చి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ గెలుపులోనే తెలంగాణ గెలుపు ఉన్నదని తెలిపారు. బీఆర్ఎస్ విజయంలోనే తెలంగాణ విజయం ఉన్నదని. కాబట్టి మేధావులు, విద్యార్థులు, యువకులు, అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించండని పిలుపునిచ్చారు. కేసీఆర్ గుండె చీల్చితే తెలంగాణ ఉంటదని అన్నారు. కేసీఆర్ బతికి ఉన్నంతవరకు తెలంగాణ కోసమే అంకితమై పోరాడతాడు తప్ప వేరే లక్ష్యం లేదన్నారు.నిజామాబాద్ ఎంపీగా బాజిరెడ్డి గోవర్దన్ను, పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్ను, కరీంనగర్ ఎంపీగా బోయిన్పల్లి వినోద్ను గెలిపించాలని కోరారు.