KCR | రేవంత్రెడ్డి నేతృత్వంలోని సర్కారుపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లాకేంద్రంలో రోడ్షో నిర్వహించారు. అనంతరం కార్నర్ మీటింగ్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రోజు పార్లమెంట్ ఎన్నికలు జరుతున్నయ్. మూడు పార్టీలు రంగంలో ఉన్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. నేను మీ అందరినీ ఒకటే కోరుతున్నా. జగిత్యాల జిల్లా ఎన్నో ఏళ్ల నుంచి కలగని.. మనం జిల్లా తెచ్చుకున్నాం. జగిత్యాలలో మెడికల్ కాలేజీ వస్తదని ఏనాడూ ఊహించలేదు. కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల జిల్లాను తీసేస్తా అంటున్నది. జగిత్యాల ఉండాల్నా.. పోవాల్నా? మరి ఈ ప్రభుత్వం తీసేస్తా అంటున్నది’ అని ప్రశ్నించగా.. జగిత్యాల జిల్లా ఉండాల్సిందేనని జనం నినదించారు.
‘జగిత్యాల జిల్లా ఉండాలంటే నిజామాబాద్ ఎంపీగా బాజిరెడ్డి గోవర్దన్ గెలవాలి. పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్ గెలవాలి. కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ గెలవాలి. ఇప్పుడున్న ప్రభుత్వానికి నా తోక తెల్వది.. తొండం తెల్వది. ఏ పని సక్కగా చేయస్తలేదు. మీ అందరికీ తెలుసు. ఉద్యమ సమయంలో ఈ ప్రాంతమంతా తిరిగాను. జగిత్యాలకు చాలాసార్లు వచ్చాను. వరద కాలువ బాధ చూసి.. వరద కాలువను మన హయాంలో రిజర్వాయర్గా చేసుకున్నాం. అందులో మత్స్యకారులు, రైతులు బతికారు. చెరువులను నింపేందుకు అవసరమైన ఓటీలను పెట్టి.. అప్పుడున్న ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, చొప్పదండి, బాల్కొండ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వరద కాలువ వెంట ఎన్నికావాలంటే అన్ని తూములు పెట్టి చెరువులను నింపుకున్నాం. ఆ చెరువుల కింద వ్యవసాయం చేసి రైతులు బ్రహ్మాండంగా బతికారు. ఇవాళ వరద కాలువను ఎందుకు ఎండబెట్టారని అడుగుతున్నా? పంటలు ఎండబెట్టారు. దానికి ఎవరు బాధ్యతలు ఆలోచన చేయాలి’ అని సూచించారు.
‘ఐదునెలల్లోనే ఆగమాగం చేస్తున్నరు. బీడీ కార్మికుల గురించి పట్టింపు లేదు. చేనేత కార్మికుల గురించి పట్టింపులేదు. గీత కార్మికులకు పట్టింపులేదు. విద్యార్థుల గురించి పట్టింపులేదు. ఫీజు రీయింబర్స్మెంట్ వస్తలేదు. ఓవర్సిస్ స్కాలర్షిప్ వస్తలేదు. దీనికి కారణాలు ఏంటీ? ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వ స్కీమ్లు. వారు చెప్పిన ఆరు గ్యారంటీల్లో ఏదైనా అమలైందా? మహిళలకు రూ.2500 వచ్చినయా? జగిత్యాలలో వచ్చినయటకదా? ఇవాళ రాహుల్ గాంధీ నిర్మల్ మీటింగ్లో చెప్పిండు. మహిళలకు రూ.2500 అకౌంట్లలో వేస్తున్నమని రాహుల్ చెప్పిండు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పిండు. కేసీఆర్ రూ.లక్ష మాఫీ చేసిండు.. మీరంతా పరుగెత్తండి.. రూ.2లక్షల రుణం తెచ్చుకోండి.. డిసెంబర్ 9న మాఫీ చేస్తా అన్నడు. రూ.2లక్షల రుణమాఫీ అయ్యిందా? కాలేదా? అని ప్రశ్నించగా కాలేదని జనం నినదించారు.
‘తెలంగాణలో ఎక్కడా అడిగినా ఇదే మాట చెబుతున్నరు. కానీ, ముఖ్యమంత్రి ఏం చెబుతున్నడు. ఇవాళ ఏ ఊరికిపోతే ఆ ఊరి దేవుడిపై ఒట్టుపెట్టుకొని.. బాసర అమ్మవారి మీద ఒట్టు.. యాదగిరి నర్సన్నపై ఒట్టు.. ఎక్కడికిపోతే అక్కడ ఒట్టు పొడుతున్నడు. నమ్మవచ్చునా ఈ ముఖ్యమంత్రిని ? నమ్మే పరిస్థితి ఉందా? అరచేతిలో వైకుంఠం చూపెట్టి.. అడ్డగోలు హామీలు ఇచ్చి.. ఇష్టంవచ్చిన పద్ధతిలో నోటికి వచ్చిన వాగ్ధానాలు చేసి కాంగ్రెస్ ఈ రోజు ప్రజలను మోసం చేసింది. మీ అందరికీ తెలుసు. ఎవరి సంక్షేమం చూడడం లేదు’ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.