ముంబై: ఒక వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి కారులో ప్రయాణించాడు. నీరు ఉప్పొంగి ప్రవహిస్తున్న వంతెనపై కారు నడిపేందుకు ప్రయత్నించాడు. అయితే వరద ప్రవాహానికి అది కొట్టుకుపోగా ఒక చెట్టుకుని పట్టుకుని అతడు ప్రాణాలు కాపాడుకున్నాడు. (Wife, 2 Daughters Swept Away) కారులో కొట్టుకుపోయిన భార్య, ఇద్దరు కుమార్తెల మృతదేహాలను అధికారులు వెలికితీశారు. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం అవినాష్ ఖండారే తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఎస్యూవీలో అహిల్యానగర్ జిల్లాలోని ఒక ప్రాంతానికి ప్రయాణమయ్యాడు.
కాగా, భారీ వర్షాలకు దర్వా ప్రాంతంలోని ఒక వంతెనపై నుంచి కుప్తి నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. అయితే నీటి ప్రవాహా వేగాన్ని అంచనా వేయడంలో అవినాష్ విఫలమయ్యాడు. ఆ వంతెన దాటేందుకు ప్రయత్నించగా ఆ కారు వరద నీటిలో కొట్టుకుపోసాగింది. అయితే ఒక చెట్టును పట్టుకోవడంతో అవినాష్ ప్రాణాలతో బయటపడ్డాడు. కారులో ఉన్న భార్య, ఇద్దరు కుమార్తెలు వరద నీటిలో కొట్టుకుపోవడాన్ని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గురువారం రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఆ ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు.