Sunil Gavaskar : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టుకు వేదికైన ఇండోర్ పిచ్ అధ్వాన్నంగా ఉందని పేర్కొన్న ఐసీసీ మూడు డీమెరిట్ పాయింట్లు విధించిన విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఈ విషయంపై స్పందించాడు. ఇండోర్ పిచ్కు మూడు డీమెరిట్ పాయింట్లు ఇవ్వడాన్ని అతను తీవ్రంగా తప్పుపట్టాడు. అది చాలా తీవ్రమైన నిర్ణయమని ఆయన అన్నాడు. ‘ఇండోర్కు మూడు పాయింట్లు సరే.. మరి గబ్బా పిచ్కు ఎన్ని డీమెరిట్ పాయిట్లు ఇస్తారో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నా. ఆ సమయంలో మ్యాచ్ రిఫరీ ఎవరు ?’ అని ఈ మాజీ క్రికెటర్ ఐసీసీని ప్రశ్నించాడు.
పోయిన ఏడాది నవంబర్లో గబ్బాలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మొదటి టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. ఆ మ్యాచ్లో ఆతిథ్య ఆసీస్ విజయం సాధించింది.ఆ తర్వాతి టెస్టుల్లోనూ గెలుపొందిన ఆసీస్ సిరీస్ క్లీన్స్వీప్ చేసింది.
ఇండోర్ పిచ్ మొదటి రోజే రేజింగ్ టర్నర్లో 4.8 టర్న్ అయింది. ఇండోర్ పిచ్ గురించి మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ ఐసీసీకి పూర్తి స్థాయి నివేదిక సమర్పించాడు.. ‘పిచ్ చాలా పొడిగా ఉంది, ఆరంభం నుంచే స్పిన్నర్లకు అనుకూలించింది ఇన్నింగ్స్ ఐదో బంతి పిచ్ను దెబ్బతీసింది. ఆ తర్వాత మరిన్ని బంతులు కూడా పిచ్ స్వరూపాన్నిదెబ్బతీశాయి. దాంతో, బంతి స్వింగ్ కాలేదు. అంతేకాదూ మ్యాచ్ ఆసాంతం బంతి అనూహ్యంగా బౌన్స్ అయింది’ అని బ్రాడ్ తన నివేదికలో వెల్లడించాడు. క్రిస్ బ్రాడ్ రిపోర్టును ఐసీసీ బీసీసీఐకి పంపించింది. ఐసీసీ మూడు డీమెరిట్ పాయింట్లు విధించడంపై అప్పీల్ చేసుకునేందుకు బీసీసీఐకి 14 రోజుల సమయం ఉంది.
మూడో టెస్టులో టీమిండియా అనూహ్యంగా ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా చేతిలో 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 2012 నవంబర్ తర్వాత సొంత గడ్డపై భారత్కు ఇది టెస్టుల్లో తొలి ఓటమి కావడం విశేషం. 76 పరుగుల లక్ష్యంతో మూడో రోజు బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రీలియా తొలి సెషన్లోనే విజయం సాధించింది. మార్నస్ లబుషేన్ (28), ఓపెనర్ ట్రావిస్ హెడ్ (49) ధనాధన్ ఆడి మ్యాచ్ ముగించారు. 11 వికెట్లు తీసిన నాథన్ లియాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఈ విజయంతో, నాలుగు టెస్టుల సిరీస్లో ఆసీస్ బోణీ కొట్టింది. భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. అహ్మదాబాద్ స్టేడియంలో మార్చి 9న నాలుగో టెస్టు జరగనుంది.