న్యూఢిల్లీ: పాకిస్థాన్ జర్నలిస్ట్కు టీమిండియా మాజీ పేస్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఆదివారం ఉదయం ప్రసాద్ తన ట్విటర్లో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. అది 1996 వరల్డ్కప్ క్వార్టర్ఫైనల్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్కు సంబంధించింది. ప్రసాద్ బౌలింగ్లో బౌండరీ కొట్టిన పాక్ ఓపెనర్ ఆమిర్ సోహైల్.. అతని వైపు చూస్తూ తర్వాతి బాల్ కూడా ఫోర్ కొడతా అన్నట్లు బౌండరీ వైపు బ్యాట్ చూపించాడు. అయితే ఆ తర్వాతి బంతికే సోహైల్ను ప్రసాద్ క్లీన్బౌల్డ్ చేశాడు.
ఆ ఫొటోలనే పోస్ట్ చేస్తూ ఇందిరానగర్ కా గూండాని నేను అని కామెంట్ చేశాడు. ఇదే డైలాగ్తో రాహుల్ ద్రవిడ్ ఫన్నీ వీడియో ఒకటి వైరల్ అయింది తెలుసు కదా. దానిని ఉద్దేశించి ప్రసాద్ ఈ ఫొటోకు ఆ కామెంట్ చేశాడు. అయితే దీనిపై ఓ పాకిస్థాన్ జర్నలిస్ట్ స్పందిస్తూ కెరీర్లో నువ్వు సాధించిన ఏకైక ఘనత ఇదే కదా అని అన్నాడు.
దీనికి ప్రసాద్ మరింత ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు. లేదు నజీబ్ భాయ్. ఆ తర్వాత వరల్డ్కప్లోనే మాంచెస్టర్లో ఇదే పాకిస్థాన్పై మరోసారి 5 వికెట్లు తీశాను. పాక్ టీమ్ కనీసం 228 పరుగులు కూడా చేజ్ చేయలేకపోయింది అని ప్రసాద్ రిప్లై ఇవ్వడం విశేషం. ఐపీఎల్ సందర్భంగా క్రెడ్ యాప్ రూపొందించిన యాడ్లో రాహుల్ ద్రవిడ్ డైలాగ్ ఇందిరానగర్ కా గుండా హు మై చాలా పాపులర్ అయిపోయింది. ఈ డైలాగ్నే హ్యాష్ట్యాగ్గా మార్చేసి చాలా మంది ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ కూడా తన చిన్నప్పటి ఫొటో షేర్ చేస్తూ ఇలాగే కామెంట్ చేయడం విశేషం.