Laskhar Bonalu | లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఆలయానికి వస్తున్న భక్తులతో పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తొలి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. కాగా, భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సాధారణ భక్తుల కోసం మూడు క్యూలైన్లు, బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తుల కోసం రెండు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. అలాగే వీఐపీలకు మరో క్యూలైన్ ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక సెంటర్లను ఏర్పాటుచేశారు. బందోబస్త్లో సుమారు 1500 మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా, లష్కర్ జాతర సందర్భంగా ఇవాళ అమ్మవారికి బోనాలు సమర్పించగా.. రేపు సోమవారం నాడు రంగం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఇదిలా ఉంటే.. లష్కర్ బోనాల దృష్ట్యా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో 4వ తేదీ వరకు ఆలయం చుట్టూ రెండుకిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు అమలు చేస్తున్నామని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. జాతర సందర్భంగా 1వ తేదీ అర్ధరాత్రి ఒంటిగంటల నుంచి 4వ తేదీ ఉదయం వరకు పొగాకుబజార్, హమాలీ విగ్రహం నుంచి మహంకాళి ఆలయానికి వెళ్లే రహదారులు, సుభాష్రోడ్ , హిల్ స్ట్రీట్, అడవియ్య క్రాస్రోడ్స్ నుంచి మహంకాళి ఆలయానికి వెళ్లే దారి, జనరల్బజార్ నుంచి మహంకాళి ఆలయానికి వెళ్లే దారిని మూసివేస్తామని చెప్పారు. ముఖ్యంగా కర్బాలాక్రాస్రోడ్స్ వద్ద చిల్డ్రన్పార్క్ నుంచి వచ్చే వాహనాలను రాణిగంజ్వైపు మళ్లిస్తారు. రాణిగంజ్క్రాస్రోడ్స్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వైపు కర్బాలా మైదాన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు,సాధారణ వాహనాలు రాణిగంజ్ క్రాస్రోడ్స్ వద్ద మినిస్టర్ రోడ్డు , గోపాలపురం లైన్ మీదుగా రైల్వేస్టేషన్కు వెళ్లాలి.