WTC 2023-25 : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC 2023-25)లో భారత జట్టు(Team India) మళ్లీ అగ్రస్థానం కైవసం చేసుకుంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ (Newzealand) చిత్తుగా ఓడడం టీమిండియాకు కలిసొచ్చింది. దాంతో, మూడో స్థానంలో ఉన్న రోహిత్ సేన విజయాల శాతం 64.58తో టాప్లోకి వెళ్లగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్ 50 శాతం విజయాలతో నాలుగో స్థానం దక్కించుకోగా.. పాకిస్థాన్ జట్టు 36.66 శాతంతో ఐదో స్టానంలో నిలిచింది.
వరుసగా రెండు సార్లు డబ్య్లూటీసీ ఫైనల్ ఆడిన భారత్.. మూడోసారి కూడా టైటిల్ పోరుకు మరింత చేరువైంది. నిరుడు వెస్టిండీస్ పర్యటన(West Indies Tour)లో సిరీస్ సమం చేసిన రోహిత్ సేన ఆ తర్వాత దక్షిణాఫ్రికాలోనూ సిరీస్ పంచుకుంది. స్వదేశంలో బలమైన ఇంగ్లండ్ను చిత్తు చేసి మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. దాంతో, డబ్య్లూటీసీ పట్టికలో మూడో స్థానానికి దూసుకొచ్చింది.
అయితే.. టాప్లో ఉన్న న్యూజిలాండ్ అనూహ్యంగా ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. దాంతో, రోహిత్ సేన మళ్లీ టాప్ ర్యాంక్ సాధించింది. గతంలో రెండు పర్యాయాలు ఆఖరి మెట్టుపై తడబడింది. 2021లో న్యూజిలాండ్, 2023లో ఆస్ట్రేలియాలు భారత్ను ఓడించి టెస్టు గదను తన్నుకుపోయాయి. దాంతో, ఈసారి ఎలాగైనా గదను కొల్లగొట్టాలనే కసితో టీమిండియా ఉంది.
వెల్లింగ్టన్లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా అదరగొట్టింది. స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ 10 వికెట్లతో విజృంభించడంతో పై 172 పరుగుల తేడాతో కివీస్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో 10 వికెట్లు తీసిన లియాన్ ఈ ఫీట్ సాధించిన పదో స్పిన్నర్గా రికార్డుకెక్కాడు.