Veelunama | వీలునామా.. సంపన్నుల వ్యవహారంగానే భావిస్తాం. నిజానికి, కుబేరులతో పోలిస్తే మధ్యతరగతి కుటుంబాల్లోనే వారసత్వ గొడవలు ఎక్కువ. స్పష్టమైన వీలునామా లేకపోతే ఆ సమస్యలు మరింత సంక్లిష్టం అవుతాయి. కోర్టు మెట్లు ఎక్కాల్సిన అగత్యమూ రావచ్చు. అలా అని వృద్ధులే రాయాలని లేదు. చిన్న వయసులోనూ రాసిపెట్టుకోవచ్చు. మన పరోక్షంలోనూ.. మన స్వార్జితం సద్వినియోగం కావాలన్న ఆరాటమే వీలునామాకు మూలకారణం.
ఎవరికీ ఎలాంటి సందేహాలూ తలెత్తనంత సరళంగా వీలునామా రాయాలి. భాషాపరమైన గందరగోళం ఉండనే కూడదు. సవరణలకు అవకాశం లేకుండా మొదట్లోనే స్పష్టంగా రాసుకోవాలి. మన తర్వాత, మనవైన వ్యవహారాలు చూసుకోవడానికి నమ్మకమైన వారిని బాధ్యులుగా ఎంచుకోవాలి. ఇక వీలునామా శిలా శాసనం ఏమీకాదు. వీలునామా రాసే వ్యక్తి భవిష్యత్తులో మారే ఆలోచనలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. అందులో చిట్టచివరి వీలునామా కు మాత్రమే విలువ.
1. మీ వ్యక్తిగత వివరాలు రాయాలి. మానసికంగా బలంగా ఉన్నట్టు ప్రకటించాలి.
2. ఆస్తులు, అప్పులు… స్థిర చరాస్తులు సహా మొత్తం జాబితా ఇవ్వాలి. నగదు, ఆభరణాలు, వారసత్వంగా వచ్చిన ఆస్తులు, పెట్టుబడులు, బ్యాంకు ఖాతాలు, రుణాలు వగైరా ఇందులో చేర్చాలి. ఏవైనా వస్తువుల మీద మమకారం ఉంటే వాటినీ కలుపుకోవచ్చు.
3. ఎవరెవరికి ఎంతెంత వాటా ఇవ్వాలనుకున్నారో కూడా సందిగ్ధతకు తావులేకుండా స్పష్టంగా పేర్కొనాలి.
4. మన పరోక్షంలో, ఆ వీలునామా కచ్చితంగా అమలు అయ్యేలా చూడటానికి నమ్మకమైన వ్యక్తిని బాధ్యుడిగా ఎంచుకోవాలి. ఆ వివరాలు కూడా ఇందులో పొందుపర్చాలి.
5. వీలునామా చెల్లుబాటు కావడానికి ఇద్దరు సాక్షుల ముందు సంతకం చేయాలి. ఆ ఇద్దరూ ఆస్తిపాస్తులకు వారసులై ఉండకూడదు.
6. సాక్షుల పేర్లు, చిరునామాలు, వీలునామా రాసిన తేదీ, ప్రదేశాన్ని కూడా పేర్కొనాలి.
7. తమ సమక్షంలోనే వీలునామా రాసి, సంతకం చేసినట్లుగా ధ్రువీకరిస్తూ సాక్షులు కూడా సంతకం చేయాలి.