లక్నో: కొత్తగా పెళ్తైన దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో భర్త విషం సేవించాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంట్లో ఉన్న భార్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే అదనపు కట్నం కోసం వేధిస్తున్న అత్తింటి కుటుంబం ఆమెను హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. (woman found hanging) ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బాబినా ప్రాంతంలో నివసిస్తున్న సాగర్ సాహు, రాధ భార్యాభర్తలు. పరిచయం ఉన్న వారిద్దరూ ఇరు కుటుంబాల అంగీకారంతో 2025 నవంబర్ 25న ప్రేమ వివాహం చేసుకున్నారు.
కాగా, ఏడు నెలల కిందట పెళ్లైన సాగర్, రాధ ఇటీవల మధ్యప్రదేశ్లోని అశోక్నగర్ నుంచి తిరిగి వచ్చారు. ఆగస్ట్ 3న రాత్రి వేళ ఇంట్లో వారిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఆ గొడవ తర్వాత సాగర్ విషపదార్థం సేవించాడు. కుటుంబ సభ్యులు అతడ్ని బబినాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తీసుకువెళ్లారు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స తర్వాత ఝాన్సీ మెడికల్ కాలేజీకి రిఫర్ చేశారు. అయితే కుటుంబ సభ్యులు ఝాన్సీలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నాడు.
మరోవైపు కుటుంబ సభ్యుల్లో చాలా మంది సాగర్ను ఆసుపత్రికి తీసుకెళ్లగా, భార్య రాధ ఇంట్లో ఉన్నది.
కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి రాగా, అదే రోజు రాత్రి సీలింగ్కు ఉరివేసుకుని మరణించిన స్థితిలో రాధా కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడకు చేరుకున్నారు. రాధా మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. వివాహం జరిగి ఏడు సంవత్సరాలు పూర్తి కాకపోవడంతో మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు.
అయితే అత్తింటి వారు రాధను పది లక్షల కట్నం డిమాండ్ చేయడంతో పాటు దాని కోసం వేధిస్తున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. కట్నం కోసం అత్తమామలే ఆమెను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. అత్తింటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాధ కుటుంబం ఆరోపణలు, పోస్ట్మార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, మెజిస్టీరియల్ విచారణ పూర్తయిన తర్వాతే ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు స్పష్టమవుతాయని పోలీస్ అధికారి తెలిపారు. ఆ మేరకు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.