Sheikh Hasina : తాను త్వరలోనే బంగ్లాదేశ్కు తప్పకుండా తిరిగి వెళ్తానని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా వెల్లడించారు. అక్కడికి వెళ్లిన తర్వాత తనను అరెస్టు చేస్తారని, లేదా చంపొచ్చని.. అయినా తాను వెనుకడుగు వేయబోనని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ నుంచి బహిష్కరణకు గురైన షేక్ హసీనా రెండేళ్లుగా ఇండియాలో ఆశ్రయం పొందుతున్నారు. అప్పటినుంచి ఆమె ఒకట్రెండు సార్లు మినహా మీడియాతో కూడా మాట్లాడలేదు. తాజాగా బుధవారం వర్చువల్గా మీడియాతో సమావేశమయ్యారు. పలు మీడియా సంస్థలతో మాట్లాడారు.
ఈ మేరకు ఆమె వ్యాఖ్యలకు సంబంధించి ఆడియో సహా ప్రకటన విడుదలైంది. దీని ప్రకారం.. బంగ్లాదేశ్ వెళ్తానని ఆమె స్పష్టం చేశారు. ‘‘బంగ్లాదేశ్ ప్రజల కోసం జీవితమంతా గడిపి.. ఆ దేశం నుంచి బహిష్కరించిన వ్యక్తిగా మట్లాడుతున్నా. నేను నా దేశం, ప్రజల నుంచి వేరుకాలేదు. నేను బంగ్లాదేశ్ తప్పకుండా తిరిగి వెళ్తా. నేను వెళ్లేది అధికారం కోసం కాదు. బంగ్లాదేశ్ను సరైన దారిలో పెట్టేందుకే. అభివృద్ధి, లౌకికవాదం దిశగా నడిపించేందుకే. వాళ్లు నన్ను జైల్లో పెడతారు.. లేదా చంపుతారు అని కూడా తెలుసు. వాటికి నేను భయపడటం లేదు. నా కర్తవ్యాన్ని అవి ఆపలేవు. 2024 జూలై, ఆగష్టులో జరిగిన విద్యార్థి ఉద్యమం శాంతియుతమైనది కాదు. ప్రారంభం నుంచి విద్యార్థుల ఉద్యమాన్ని చర్చలు, చట్టపరమైన అంశాలు, సహనంతో పరిష్కరించేందుకు మా ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ, సంస్కరణల పేరుతో చేపట్టిన విద్యార్థుల ఉద్యమాన్ని కొన్ని సంఘాలు హింసాత్మకంగా మార్చి, తమ రాజకీయ పావుగా వాడుకున్నాయి.
ఇది ప్రణాళిక ప్రకారం చేసిన ఒక ఉద్యమం. ఉన్నట్లుండి జరిగింది కాదు. ఈ విషయాన్ని ముహమ్మద్ యూనస్ కూడా చెప్పాడు. కొంతమంది ఆదేశాలకు అనుగుణంగా జరిగింది. బ్యాలెట్ బాక్స్కు అతీతంగా అధికారం చేజిక్కించుకునేందుకు సాగిన ఉద్యమం’’ అని షేక్ హసీనా విమర్శించారు. గత రెండేళ్లుగా జరిగిన పరిణామాలు చూస్తుంటే తనకు ఆవేదన కలిగిందన్నారు. తాము ఎన్నో ఏళ్లుగా నిర్మించిన బంగ్లాదేశ్ ఇబ్బందుల్లో ఉందని, దీనికోసమా 1972లో 30 లక్షల మంది త్యాగం చేశారు అంటూ హసీనా ఆవేదన వ్యక్తం చేశారు.