వాషింగ్టన్, సెప్టెంబర్ 10: విదేశీ ఉద్యోగులపై ట్రంప్ సర్కార్ మరో పిడుగు వేసింది. ఉపాధి ముగిసిన తర్వాత హెచ్1బీ, ఎల్1 వీసాదారులు వంటి నిర్దిష్ట వలసేతర ఉద్యోగులకు(నాన్ ఇమిగ్రెంట్) ప్రస్తుతం లభిస్తున్న 60 రోజులు అదనపు గడువును రద్దు చేసేందుకు సంబంధించిన ముసాయిదా ప్రతిపాదనను అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్ఎస్) గురువారం విడుదల చేసింది. అంటే ఇకపై ఉద్యోగం కోల్పోతే దేశం వీడాల్సిందే.
ఈ ప్రతిపాదన ఉపాధి ఆధారిత నాన్-ఇమిగ్రెంట్ వీసా విభాగాలకు సంబంధించిన అనేక అంశాలను స్పృశిస్తున్నప్పటికీ భారతీయ ప్రవాస సమాజం దృష్ట్యా చూస్తే దీని ప్రభావం ప్రధానంగా హెచ్1బీ, ఎల్1, ఓ1 వీసాదారులపై (అసాధారణ ప్రతిభకు గుర్తింపు పొందిన వారు) ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉద్యోగం కోల్పోయిన అర్హత గల హెచ్1బీ ఉద్యోగులు వరుసగా 60 రోజుల వరకు లేదా వారి అధీకృత నివాసం ముగిసే వరకు, ఏది ముందుగా వస్తే దాని వరకు విచక్షణాపరమైన గడువును పొందవచ్చు. ఈ కాలంలో వారు మరొక స్పాన్సరింగ్ యజమాని కోసం వెతుకవచ్చు. హోదా మార్పు కోరవచ్చు. లేదా అమెరికాను విడిచి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు. అయితే హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈ 60 రోజుల గడువును తొలగించాలని తాజాగా ప్రతిపాదిస్తున్నది. ఇది భారత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనున్నది.
వలసలపై ట్రంప్ యంత్రాంగం చేపట్టిన కఠిన చర్యలు, హెచ్-1బీ వీసాలకు సంబంధించి నెలకొన్న అనిశ్చితి అమెరికాలోని కొందరు భారతీయ సాంకేతిక నిపుణులపై ఒత్తిడిని పెంచుతున్నాయి. టెక్సాస్లోని సెలీనా మెలిస్సా, డాలస్ సమీప శివారు ప్రాంతాల్లో నివసిస్తున్న పదికి పైగా హెచ్1బీ వీసా కలిగిన కుటుంబాలు తమ ఉద్యోగాలను కోల్పోయి, ఇండ్లు, కార్లు, ఇతర సామగ్రిని అక్కడే వదిలేసి భారత్కు తిరిగి వెళ్లిపోయాయని సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ అవుతున్నది. ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత కొన్ని భారతీయ కుటుంబాలు గృహ రుణ వాయిదాలను, ఆస్తి పన్నులను చెల్లించలేకపోయాయి. ఆస్తి విలువలు పడిపోవడంతో మరి కొందరు తమ ఇండ్లను అమ్మడానికి ఇబ్బందులు పడ్డారని సమాచారం. భారత్ తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకునే ముందు అందులో కొన్ని కుటుంబాలు చాలా ఏండ్లపాటు అమెరికాలో నివసించాయని ఆ పోస్టు పేర్కొంది.
భారత సంతతికి చెందిన ట్రక్డ్రైవర్లపై ట్రంప్ యంత్రాంగం మరోసారి విషం కక్కింది. జాతివివక్షను ప్రేరేపించేలా భారత సంతతి వారిని కించపరుస్తూ అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ శాఖ విడుదల చేసిన ఒక ఏఐ పోస్టర్పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత సంతతికి చెందిన ట్రక్ డ్రైవర్ను లక్ష్యంగా చేసుకుని ఏఐ ఆధారితంగా రూపొందించిన ‘ట్రాన్స్ఫ్రార్మర్ సినిమా’ తరహా పోస్టర్ తీవ్ర వ్యతిరేతను ఎదుర్కొంటున్నది. బుధవారం డీహెచ్ఎస్ ఎక్స్ ఖాతాలో ఉంచిన ఈ పోస్టర్కు ‘ట్రాన్స్ఫార్మర్స్: బహిష్కరణల యుగం’ అని టైటిల్ పెట్టింది. అందులో డీహెచ్ఎస్ చిహ్నం ధరించి ఉన్న ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్, తలపాగా ధరించిన ఒక సిక్కు వ్యక్తివైపు చూస్తున్నాడు. ‘మిస్టర్ సింగ్.. అమెరికా దేశం అమెరికన్లకే.. మీకు ఎలా డ్రైవ్ చేయాలో తెలియదు. మా రోడ్లు వదిలిపోండి’ అని పేర్కొనడమే కాక, ప్రజలు స్వచ్ఛందంగా తమ దేశాన్ని వదిలిపోవాలని స్పష్టం చేసింది.