సిటీబ్యూరో, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ప్రజలకు చేరాల్సిన పౌర సరఫరాల సరుకులు పక్కదారి పడుతున్నాయి. పౌర సరఫరాల అధికారుల నిర్లక్ష్యంతో పేదలకు అందాల్సిన టన్నుల కొద్దీ గోధుమలు బ్లాక్ మార్కెట్కు చేరుతున్నాయి. ప్రభుత్వం పేద ప్రజలకు సంపూర్ణ పౌష్టికాహారం అందాలనే ఉద్దేశంతో పంపిణీ చేస్తున్న గోధుమలను రేషన్ డీలర్లు పక్కదారి పట్టిస్తున్నారు. వినియోగదారులకు తెలియకుండానే వారికి పంపిణీ చేసినట్లు రికార్డుల్లో చూపుతూ బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని రేషన్ దుకాణాల్లో ఈ దందా మూడు పూవ్వులు, ఆరు కాయలుగా సాగుతున్నది.
ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సబ్సిడీ సరుకులను రేషన్ డీలర్లు యథేచ్ఛగా అమ్ముకుంటున్నా..పౌర సరఫరాల అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. తమకు రావాల్సిన గోధుమలు ఎందుకు ఇవ్వడం లేదని లబ్ధిదారులు ప్రశ్నిస్తే.. ప్రభుత్వం నుంచే రావడం లేదని చెబుతున్నారు. కానీ గోధుమల లోడు రేషన్ దుకాణాలకు చేరగానే గంపగుత్తగా బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. కానీ జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కనీస తనిఖీలు చేపట్టడం లేదు. ఈ దందాలో కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల దాకా వాటా వెళ్తుందని రేషన్ డీలర్లే స్వయంగా చెబుతున్నారు. గోధుమలను ప్రజలకు సరఫరా చేయకుండా అక్రమంగా అమ్ముకుంటున్నామని బహిరంగంగానే అంటున్నారు. అక్రమ దందాలో పౌరసరఫరాల అధికారులకు ప్రతి నెలా మామూళ్లు వెళ్తాయని నిర్మొహమాటంగా చెప్పడం గమనార్హం.
పౌర సరఫరాల నుంచి హైదరాబాద్ జిల్లాకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు కలిపి 62,844.330 టన్నుల బియ్యం, 6,166.850 టన్నుల గోధుమలు పంపిణీ చేశారు. ఒక్కో రేషన్కార్డుకు 5 కిలోల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో కిలోకి రూ.7 చొప్పున అమ్మాల్సి ఉంటుంది. మూడు నెలల గోధుమల్లో జిల్లా వ్యాప్తంగా కేవలం 10 శాతం రేషన్ దుకాణాల్లో మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగతా 90 శాతం దుకాణాల్లో బియ్యంతో పాటు గోధుమలు ఇవ్వకుండా తూకం వేసేటప్పుడు ఐదు కిలోల బరువును వేస్తున్నారు. డిజిటల్ మీటర్లలో మాత్రం గోధుమలు కూడా ఇచ్చినట్లు నమోదు చేస్తున్నారు. రికార్డుల్లో గోధుమలు సరఫరా చేస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందడం లేదు. ఈ మొత్తం గోధుమలను బ్లాక్ మార్కెట్లో రూ.30 నుంచి రూ.40 కిలో చొప్పున విక్రయిస్తున్నారు. ఈ తతంగమంతా పౌర సరఫరాల అధికారులకు తెలిసే జరుగుతుండటం విస్తుగొలిపిస్తున్నది. మూడు నెలల గోధుమలను రూ.40 కిలో చొప్పున అమ్మితే రూ.24.66 కోట్లు అక్రమంగా ఆర్జిస్తున్నట్లు అవుతుంది. కొన్ని రేషన్ దుకాణాల్లో గోధుమలు పంపిణీచేసినా దాదాపు రూ.24 కోట్ల రూపాయలు రేషన్ డీలర్ల జేబులోకి చేరాయి. ఈ దందా నగరంలో నెలల తరబడిగా జరుగుతున్నది. గోధుమలు అమ్మగా వచ్చిన డబ్బులో నెలవారీగా కొంత పౌరసరఫరాల అధికారులకు చేరుతుందని డీలర్లే స్వయంగా చెప్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ దందాకు ముగింపు పలికి గోధుమలు పక్కదారి పట్టకుండా లబ్ధిదారులకు పంపిణీ చేసేలా చూడాలని కోరుతున్నారు.
మాది ఎర్రగడ్డలోని సుల్తాన్నగర్. నా భార్యకు నాకు కలిసి ప్రతినెలా 12 కిలోల బియ్యం వస్తాయి. ఈసారి మూడు నెలలకు కలిపి ఒక్కసారే ఇచ్చారు. గోధుమలు అడిగితే ప్రభుత్వం నుంచే రాలేదని రేషన్ డీలర్ చెప్పారు. కానీ నేను బియ్యం తీసుకున్నాక ఆన్లైన్ పోర్టల్ చెక్ చేస్తే.. మూడు నెలలకు కలిపి ప్రతి నెలా 5 కిలోల చొప్పున గోధుమలు నేను తీసుకున్నట్లు నమోదు చేశారు. ఇదే పరిస్థితి నగరంలోని దాదాపు అన్ని రేషన్ దుకాణాల్లో ఇలాగే గోధుమలు ఇవ్వకున్నా ఇచ్చినట్లు నమోదు చేసి బ్లాక్లో అమ్ముకుంటున్నారు. ఓ రేషన్ డీలర్ను దీనిపై అడిగితే గోధుమలు వస్తున్నాయి. కానీ మేమే బయట రూ.40కిలో చొప్పున అమ్ముకుంటున్నాం… అధికారులకు కూడా షేర్ వెళ్తుంది అని చెప్తున్నారు. అధికారులు స్పందించి ఈ దందాను ఆపాలి. రూ.లక్షలాది ప్రజాధనాన్ని పక్కదారి పట్టకుండా చూడాలి.
– అబ్దుల్ ఖాదర్, ఎర్రగడ్డ