ఉబర్ సృష్టికర్త అమెరికన్. ఓలా ఆవిష్కర్త ఉత్తరాది. కానీ, ర్యాపిడోను స్థాపించిన ముగ్గురు యువకులలో ఇద్దరు అచ్చమైన తెలుగువాళ్లు. ఆ ప్రకారంగా ఇది తెలుగు బండి. బైక్ ట్యాక్సీతో ఆరంభమైన సేవలు క్యాబ్ వరకూ విస్తరించాయి. ‘మా కంపెనీ విస్తరణ కూడా శరవేగంగా జరుగుతున్నది’ అని సగర్వంగా ప్రకటిస్తున్నారు ర్యాపిడో ఫౌండర్స్. రోజూ లక్షల మందిని గమ్యానికి చేరుస్తున్న ర్యాపిడో.. తన వ్యవస్థాపకులను కూడా గెలుపు తీరాలకు చేర్చింది.
Rapido | సమస్య ఉన్నచోటే అవకాశాలు ఉంటాయి. ఆ సవాళ్లను స్వీకరిస్తేనే గెలుపు బాటలో వెళ్తాం. ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరమే రాదు. ‘ర్యాపిడో’ ప్రస్థానం చెబుతున్నదీ అదే. బెంగళూరు కేంద్రంగా ఆన్లైన్ బైక్, ఆటో, క్యాబ్ సేవలు అందిస్తున్నది ర్యాపిడో. ఈ స్టార్టప్ కంపెనీని 2015లో ప్రారంభించారు. మొదట్లో ర్యాపిడో బిజినెస్ టు బిజినెస్ మాడల్లో కార్యకలాపాలు నిర్వహించేది. వ్యాపార సంస్థల సరుకును ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి రవాణా చేసేది. ఆ తర్వాత.. బైక్ సేవలు మొదలు పెట్టింది.
ఆటోలకు విస్తరించింది. ప్రస్తుతం క్యాబ్ సర్వీసులూ అందిస్తున్నది. మార్కెట్ను ఒంటిచేత్తో ఏలేస్తున్న ఉబెర్, ఓలాలకు సవాలు విసరడం సామాన్యమైన విషయం కాదు. అయినా, వ్యవస్థాపకులు వెనకడుగు వేయలేదు. ఆ ముగ్గురిలో పవన్ గుంటుపల్లి ఐఐటీ ఖరగ్పూర్ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యునికేషన్స్లో పట్టా అందుకున్నారు. శామ్సంగ్ ఆవిష్కరణల విభాగంలో పనిచేసిన అనుభవం ఉంది.
రిషికేశ్ ఎస్ఆర్ .. బెంగళూరులోని పీయీఎస్ యూనివర్సిటీలో కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ చదివాడు. రెండు స్టార్టప్స్ను స్థాపించి.. కొద్దికాలానికే షట్టరు దించేసిన ఫెయిల్యూర్ స్టోరీ తనకుంది. ఆ పాఠాల్ని ర్యాపిడో విజయానికి సోపానాలుగా మార్చాడు. మూడో వ్యక్తి అరవింద్ సంక. ఐఐటీ భువనేశ్వర్లో మెకానికల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. చదువు కాగానే.. కొంతకాలం టాటా మోటార్స్లో ఇంటర్న్షిప్ చేశాడు. ఫ్లిప్కార్ట్లో పనిచేశాడు. అరవింద్, పవన్ బాల్య స్నేహితులు. రిషికేశ్ కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిశాడు. కలల్ని నిజం చేసుకునే ప్రయత్నంలో ముగ్గురూ ఒక్కటయ్యారు.
ఓ తిరుగులేని బ్రాండ్ను సృష్టించారు. అనేక మార్కెట్ సర్వేలు నిర్వహించిన తర్వాత.. ప్రయోగాత్మకంగా కొద్ది మంది (15 నుంచి 20) కెప్టెన్లతో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. ప్రయాణికుడికి, బైక్ ట్యాక్సీ కెప్టెన్కు మధ్య తలెత్తే సమస్యలను గుర్తిస్తూ, పరిష్కరిస్తూ.. ర్యాపిడో యాప్ను తీర్చిదిద్దుకున్నారు. ఆ ప్రయోగం విజయవంతమైంది. బెంగళూరులో మంచి ఆదరణ లభించింది. ఏడాది తిరిగేసరికి దేశమంతా విస్తరించారు. 2021 నాటికి ర్యాపిడోలో లక్షా యాభైవేల మంది కెప్టెన్లు నమోదయ్యారు. బడా ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. కంపెనీ విలువ 83 కోట్ల డాలర్లకు చేరింది.
బైక్ ట్యాక్సీ సేవల్లో.. ర్యాపిడో అగ్రస్థానంలో ఉంది. నగరాల్లో విశాలమైన రోడ్లే కాదు ఇరుకైన సందులూ ఉంటాయి. ఆటో వెళ్లలేని గమ్యాలకు బైకులు సిద్ధంగా ఉంటాయి. స్మార్ట్ ఫోన్లో యాప్, వాలెట్లో డబ్బు ఉంటే చాలు. లక్షన్నర మంది ర్యాపిడో కెప్టెన్లకు ముగ్గురు టెకీలు కొత్త ఉపాధి అవకాశం చూపించారు. కారులేక పోయినా, ఆటో కొనలేకపోయినా.. వ్యక్తిగత వాహనమైన బైక్తోనే నాలుగు రాళ్లు సంపాదించుకోవచ్చని నిరూపించారు.
కలలు కన్నంత తేలికగా విజయం వరించదు. ఎంతో కష్టపడాలి. ఫలితాల కోసం ఎదురు చూడాలి. ఇంటర్న్షిప్ రోజుల్లోని స్వప్నాలు, తొలి ఉద్యోగాల అనుభవాలతో ముగ్గురు యువకులు చేసిన ప్రయోగం ‘టెక్ మొబిలిటీ’ రంగంలో సంచలనం సృష్టించింది. ర్యాపిడ్.. అంటే వేగం. ‘ఎక్కడా ఆగిపోవద్దు. ఆకాశమే నీ హద్దు’ అంటారు ర్యాపిడో వ్యవస్థాపకులు. ర్యాపిడో మానవ వనరులను గౌరవిస్తుంది. పార్ట్నర్స్ను ‘కెప్టెన్’ అని సంబోధిస్తుంది. పదిహేను వందల మంది పూర్తిస్థాయి సిబ్బందికి ఆఫీసు అంటే మరో ఇల్లు. సంస్థ కోసం ఇష్టంగా కష్టపడుతూ కనిపిస్తారు. ‘మాది ఓ కుటుంబం. ర్యాపిడో కుటుంబం’ అంటారు రిషికేశ్ చిరునవ్వుతో.
డ్రీమ్.
బిలీవ్.
ఎగ్జిక్యూట్.
ఏం ఫర్వాలేదు. పెద్దపెద్ద కలలు కనండి. ఆ కలల్ని నిజం చేసుకోగలమని విశ్వసించండి. స్వప్న సాకారం దిశగా అడుగులు వేయండి. ఈ మూడు సూత్రాలే నన్ను నడిపించాయి. ఏ ఆంత్రప్రెన్యూర్ను అయినా గెలుపు తీరాలకు చేరుస్తాయి. సవాళ్లు గొప్ప అవకాశాలు. నిన్ను నువ్వు నిరూపించుకో.. అని స్వాగతించే గెలుపు ద్వారాలు.
– పవన్ గుంటుపల్లి సహ- వ్యవస్థాపకుడు, ర్యాపిడో