ICC : గబ్బా టెస్టులో వెస్టిండీస్ చిరస్మరణీయ విజయానికి కారణమైన షమర్ జోసెఫ్(Shamar Joseph) ఐసీసీ అవార్డు రేసులో నిలిచాడు. జనవరి నెలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన అతడు ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్ ‘(Player Of The Month) అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఈ అవార్డు కోసం ఆసీస్ పేసర్ జోష్ హేజిల్వుడ్(Josh Hazlewood), ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్(Ollie Pope)లు కూడా పోటీ పడుతున్నాడు. ఐసీసీ మంగళవారం ప్లేయర్ ఆఫ్ ది మంత్ జనవరికి నామినేట్ అయిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది.
మహిళల విభాగంలో అమీ హంటర్(ఐర్లాండ్), బేత్ మూనీ(ఆస్ట్రేలియా), అలీసా హేలీ(ఆస్ట్రేలియా)లు నామినేషన్ దక్కించుకున్నారు. విజేతను నిర్ణయించేందుకు ఐసీసీ ఓటింగ్ నిర్వహించనుంది. రెండు విభాగాల్లో ఎక్కువ ఓట్లు సాధించిన వాళ్లను అవార్డు వరించనుంది.
షమర్ జోసెఫ్
ఆస్ట్రేలియా కంచుకోట గబ్బాలో విండీస్ యువ పేసర్ షమర్ నిప్పులు చెరిగాడు. పింక్ బాల్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఏకంగా ఆరు వికెట్లు తీసి విండీస్ చారిత్రాత్మక విజయంలో భాగమయ్యాడు. ఆరంగేట్రం సిరీస్లోనే 7-68 గణాంకాలతో క్రికెట్ దిగ్గజాలను ఆశ్చర్యపరిచాడు. దాంతో, ఆసీస్ గడ్డపై 30 ఏండ్ల తర్వాత కరీబియన్ జట్టు తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది.
A new West Indies star goes up against Josh Hazlewood and Ollie Pope for January’s ICC Men’s Player of the Month 🏅
Vote now 👇https://t.co/vv0wJqgj4M
— ICC (@ICC) February 6, 2024
భారత పర్యటనలో భాగంగా ఉప్పల్లో జరిగిన తొలి టెస్టులో ఓలీ పోప్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. రెండో ఇన్నింగ్స్లో 196 పరుగులతో ఇంగ్లండ్కు కొండంత స్కోర్ అందించాడు. అనంతరం భారీ ఛేదనలో టీమిండియాను టామ్ హర్ట్లే ఆరు వికెట్లతో దెబ్బకొట్టాడు. దాంతో, ఉప్పల్లో ఓటమెరుగని భారత జట్టుపై బెన్ స్టోక్స్ సేన అద్భుత విజయం నమోదు చేసింది. ఆసీస్ పేసర్ హేజిల్వుడ్ సొంతగడ్డపై పాకిస్థాన్తో జరిగిన టెస్టు సిరీస్లో అదరగొట్టాడు. 11.63 సగటుతో 19 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మంత్కు నామినేట్ అయ్యాడు.
Two Australians are challenged by an Ireland young gun for January ICC Women’s Player of the Month honours 👀
Vote now 👇https://t.co/OV10FZ9BzG
— ICC (@ICC) February 5, 2024
మహిళల విభాగంలో నామినేషన్ దక్కించుకున్న అమీ హంటర్.. జింబాబ్వేపై దంచికొట్టింది. వన్డే, టీ20 సిరీస్లో ఈ 18 ఏండ్ల యువకెరటం హాఫ్ సెంచరీతో చెలరేగింది. అమీ వీరబాదుడు తోడూ బౌలర్లు విజృంభించడంతో ఐర్లాండ్ సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. ఆసీస్ వికెట్ కీపర్ బేత్ మూనీ.. భారత్, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్లలో మూడు హాఫ్ సెంచరీలతో కదం తొక్కింది. టీమిండియాపై మూడో వన్డేలో 82 రన్స్తో కంగారూలను గెలిపించిన అలీసా హేలీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో నిలిచింది.