జైపూర్: రాజస్థాన్లోని భరత్పూర్లో అభ్యర్థికి బదులు (Proxy Candidate) పరీక్ష రాస్తూ పట్టుబడ్డాడో ఎంబీబీఎస్ విద్యార్థి (MBBS Student). దేశవ్యాప్తంగా ఆదివారం నీట్ యూజీ ప్రవేశ పరీక్ష జరిగింది. భరత్పూర్ జిల్లా మథురాలో ఉన్న ఓ పరీక్ష కేంద్రంలో అంతా పరీక్ష రాస్తున్నారు. ఈ క్రమంలో పరీక్ష కేంద్రంలోని ఓ గదిలో అభ్యర్థికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నట్లు ఇన్విజిలేటర్ గుర్తించారు. వెంటనే అతడిని పోలీసులకు పట్టించారు.
విచారణ సందర్భంగా తన పేరు అభిషేక్ గుప్తా అని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేస్తున్నాని చెప్పాడు. రాహుల్ గుర్జర్ అనే అభ్యర్థికి బదులు తాను పరీక్ష రాస్తున్నాని వెల్లడించాడు. దీనికోసం అతని నుంచి ఇప్పటికే రూ.10 లక్షలు తీసుకున్నామని తెలిపాడు. తనతోపాటు మరో ఐదుగురు ఉన్నారని, తన సహ విద్యార్థి రవి మీనా కోసంమే ఈ పనిచేస్తున్నట్లు పేర్కొన్నాడు. వారంతా పరీక్షా కేంద్రం సమీపంలో ఓకారులో ఉన్నారని పోలీసులకు చెప్పారు. దీంతో పరీక్ష రాయాల్సిన అసలు విద్యార్థి రాహుల్ గుర్జర్ను, ఈ రాకెట్ నడుపుతున్న మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.