లండన్: బ్రిటీష్ రైలు ప్రయాణికులు అనూహ్య పరిస్థితిని ఎదుర్కొన్నారు. లండన్లోని బిషప్ స్టార్ట్ఫోర్డ్ స్టేషన్లో ఓ హంస(Swan) రైలును అడ్డుకున్నది. పట్టాలపై ఉన్న ఆ హంస.. రైలును ఏకంగా 15 నిమిషాల పాటు ఆపేసింది. దీంతో ఆ రూట్లో వెళ్లాల్సిన రైళ్లకు అంతరాయం ఏర్పడింది. స్టేషన్లో ప్రయాణికులు ఉన్నా.. ట్రాక్పై నుంచి హంసను వెళ్లగొట్టలేకపోయారు. ఎందుకంటే బ్రిటీష్ చట్టాల ప్రకారం హింసలు రాజ కుటుంబ సంపదగా భావిస్తారు. హంసలకు ఎటువంటి హాని కలిగించినా లేక వాటిని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసినా నేరమే అవుతుంది.
12వ శతాబ్ధం నుంచి బ్రిటన్ రాచరిక పాలనలో హంసలకు చెందిన చట్టాలు అమలులో ఉన్నాయి. వేటగాళ్ల నుంచి రక్షించాలన్న ఉద్దేశంతో ఆ చట్టాలను పాటిస్తున్నారు. అన్మార్క్డ్ హంసలను రాజ కుటుంబ ఆస్థిగా భావిస్తారు. సాధారణంగా హంసలపై ఏదైనా గుర్తు పెడుతారు. లేదా వాటి మూతులపై ఏదో ఒక టిక్ వేస్తారు. ఒకవేళ ఎటువంటి గుర్తు ఆ పక్షులపై లేకుంటే, అప్పుడు ఆ హంసలను రాచరిక ప్రాపర్టీగా భావిస్తారు. కేవలం బ్రిటీష్ రాచ కుటుంబీకులు మాత్రమే హంసలను తినేందుకు అధికారం ఉన్నది.
బిషప్ రైల్వే స్టేషన్లో పట్టాలపై హుందాగా తిరుగుతున్న ఓ హంసకు చెందిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నది. అయితే కాలం చెల్లిన చట్టాలను ఇంకా అమలు చేస్తున్న బ్రిటీష్ సర్కార్పై కొందరు నెటిజన్లు ఆన్లైన్లో విమర్శలు చేస్తున్నారు. కొందరైతే జోకులు కూడా వేస్తున్నారు.