చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బ్యాట్తో పాటు బంతితోనూ అదరగొట్టడంతో ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సాధికారిక విజయం సాధించింది. స్పిన్నర్లకు అనుకూలించిన ధర్మశాల పిచ్పై జడ్డూ తన అనుభవాన్ని రంగరించి సీఎస్కేను మళ్లీ విజయాల బాట పట్టించాడు. ఈ గెలుపుతో ఆరు రోజుల క్రితం తమను చెపాక్లో ఓడించిన పంజాబ్పై చెన్నై బదులు తీర్చుకున్నైట్టెంది. ఈ సీజన్లో ఆరో విజయంతో చెన్నై మళ్లీ టాప్-4లోకి వచ్చి ప్లేఆఫ్స్ రేసులో ముందంజ వేసింది.
CSK | ధర్మశాల: ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో చెన్నై బ్యాటింగ్లో విఫలమైనా బౌలింగ్లో అదరగొట్టి తమ ఖాతాలో మరో విజయాన్ని నమోదుచేసింది. ధర్మశాల వేదికగా ఆదివారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టును 28 పరుగుల తేడాతో ఓడించింది. చెన్నై నిర్దేశించిన 168 పరుగుల ఛేదనలో పంజాబ్.. 20 ఓవర్లలో 139/9 పరుగుల వద్దే ఆగిపోయింది. ప్రభ్సిమ్రన్ సింగ్ (23 బంతుల్లో 30, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ రవీంద్ర జడేజా (3/20) స్పిన్ మాయాజాలానికి తోడు తుషార్ దేశ్పాండే (2/35), సిమర్జిత్ సింగ్ (2/16) పేస్కు పంజాబ్ కుదేలైంది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167/9 పరుగులకే పరిమితమైంది. బంతితో రాణించిన జడ్డూ బ్యాట్ (26 బంతుల్లో 43, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తోనూ మెరిశాడు.
తడబడ్డ చెన్నై
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై ఆరంభంలో ధాటిగానే ఆడినా తర్వాత తడబడింది. రహానే (9) మరోసారి నిరాశపరచగా కెప్టెన్ రుతురాజ్ (32), డారిల్ మిచెల్ (30) పవర్ ప్లేలో వేగంగా ఆడారు. కానీ రాహుల్ చాహర్ ఒకే ఓవర్లో రుతురాజ్, దూబేలను ఔట్ చేసి చెన్నైకి షాకిచ్చాడు. మోయిన్ అలీ (17), శాంట్నర్ (11), శార్దూల్ (11) విఫలమవగా ధోనీ డకౌట్ అయ్యాడు. వరుసగా వికెట్లు కోల్పోతున్నా ఆఖర్లో జడ్డూ మెరుపులతో చెన్నై ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
పసలేని పంజాబ్ బ్యాటింగ్
ఛేదనలో పంజాబ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. రెండో ఓవర్లోనే జానీ బెయిర్ స్టో (7), రిలీ రూసో(0) తమ వికెట్లను తుషార్కు సమర్పించుకున్నారు. ప్రభ్సిమ్రన్, శశాంక్ సింగ్ (27) కొంతసేపు చెన్నై బౌలర్లను ధాటిగా ఎదుర్కున్నా జడేజా రాకతో ఆ జట్టు పతనం వేగంగా సాగింది. జడ్డూ 9వ ఓవర్లో ప్రభ్సిమ్రన్ను పెవిలియన్ చేరగా జితేశ్ శర్మను సిమర్జిత్ ఔట్ చేశాడు. 13వ ఓవర్లో పంజాబ్ కెప్టెన్ సామ్ కరన్ (7), అశుతోష్ (3)లను ఔట్ చేసి ఆ జట్టును కోలుకోలేని దెబ్బతీశాడు.చాహర్ (16), బ్రర్ (17 నాటౌట్) మెరుపులు మెరిపించి పంజాబ్ ఓటమి అంతరాన్ని తగ్గించారు.
సంక్షిప్త స్కోర్లు
చెన్నై: 20 ఓవర్లలో 167/9 (జడేజా 43, రుతురాజ్ 32, చాహర్ 3/23, హర్షల్ 3/24).. పంజాబ్: 20 ఓవర్లలో 139/9 (ప్రభ్సిమ్రన్ 30, శశాంక్ 27, జడేజా 3/20, సిమర్జిత్ 2/16)