సూర్యపేట : వ్యక్తిగత కక్షలు రాజకీయ కారణాలతో మిగిలిన డబుల్ బెడ్ రూం( Double Bed room ) ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియల్లో తప్పుడు విధానాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ( Bollam Mallaiah Yadav ) వెల్లడించారు. ఆదివారం కోదాడలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మూడు సంవత్సరాల అనంతరం బాలాజీ నగర్ ( Balajinagar ) లోని 560 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు గాను 548 లబ్ధిదారులకు అధికారులు పట్టాలు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ఇక మిగిలిన లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేయాలని అధికారులకు సూచించారు. నిరుపేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరాలని ఆకాంక్షతో తాను శాసనసభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో పారదర్శకంగా కలెక్టర్ పర్యవేక్షణలో లబ్ధిదారులు ఎంపిక పూర్తి చేశానని తెలిపారు.
అయితే అధికారుల నిర్లక్ష్యంతో పలు సాంకేతిక కారణాల దృష్ట్యా పట్టాలు పంపిణీ చేయలేకపోయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తాము తక్షణమే మౌలిక వసతులు పూర్తిచేసి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని పలుమార్లు ఆందోళన చేశామన్నారు. అండర్ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా నడుస్తుందని నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని విమర్శించారు. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎస్ కే నయీమ్, కౌన్సిలర్ చీమ నరేష్, ఉపేందర్ గౌడ్, అలవాల వెంకట్, ఉపేందర్, కరీముల్లా పాల్గొన్నారు.