Bajrang Punia | ఢిల్లీ: ప్రముఖ రెజ్లర్ బజరంగ్ పునియాకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) షాకిచ్చింది. డోపింగ్ పరీక్షకు శాంపిల్ ఇవ్వని కారణంగా ఆదివారం అతడిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్కు ముందు మార్చి 10న నాడా.. పునియా మూత్ర నమూనాలను కోరింది. కానీ అందుకు పునియా నిరాకరించడంతో అతడిపై క్రమశిక్షణ చర్యలకు దిగింది. తదుపరి నిర్ణయం వెలువడేదాకా అతడు ఏ ఈవెంట్లలో పాల్గొనకుండా సస్పెండ్ చేస్తున్నట్టు నాడా తెలిపింది. ఈనెల 7 వరకు స్పందించాలని పునియాకు అల్టిమేటం జారీ చేసింది.
దీనిపై పునియా ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందిస్తూ.. ‘నేను డోప్ టెస్టుకు శాంపిల్ ఇచ్చేందుకు ఎప్పుడూ నిరాకరించలేదు. కానీ ఆ పరీక్షకు వాడుతున్న కిట్లు గడువు ముగిశాయి. ముందు వాటిపై ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని కోరాను. ఆ తర్వాత నన్ను పరీక్షించమని విజ్ఞప్తి చేశా. దీనిపై మా న్యాయవాది త్వరలోనే సమాధానమిస్తారు’ అని వివరణ ఇచ్చాడు. నాడా సస్పెన్షన్ నేపథ్యంలో పునియా ఒలింపిక్స్కు బరిలో దిగుతాడా? లేదా? అన్నదానిపై సందిగ్ధత నెలకొంది.