భువనగిరి టౌన్, మే 17 : డాక్టర్ల సలహాలు, సూచనలు పాటించి కరోనా నుంచి బయటపడాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. భువనగిరి ఏరియా దవాఖానను సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కరోనా వార్డుతోపాటు ఇతర వార్డుల్లో రోగులను కలిసి వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ దవాఖానల్లో కరోనాకు చికిత్స అందుబాటులో ఉందన్నారు. రోగులు అధైర్యపడొద్దని చెప్పిన ఆయన కరోనా మరణాల రేటు చాలా స్వల్పమని, ధైర్యంతో కరోనాను ఎదురించాలన్నారు. కరోనా బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డాక్టర్లకు సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా బెడ్లు, ఆక్సిజన్ తదితర వివరాలను దవాఖాన సూపరింటెండెంట్ రవిప్రకాశ్ను అడిగి తెలుసుకున్నారు. దవాఖానకు వచ్చే వారికి సొంత నిధులతో మాస్కులు, శానిటైజర్లు అందజేస్తానని హామీ ఇచ్చారు. ఎండాకాలం కావున కరోనా టెస్ట్కు వచ్చే వారు క్యూలైన్లలో నిలబడేచోట చలువ పందిళ్లు వేయాలని భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులుకు సూచించారు. దవాఖానలో రోగుల సహాయకుల కోసం రూ.6లక్షలతో విశ్రాంతి గది, రూ.3 లక్షలతో డ్రైనేజీ పనులను త్వరలో చేపట్టేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో సాంబశివరావు, భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్చైర్మన్ చింతల కిష్టయ్య, టీఆర్ఎస్ పట్టణ కమిటీ అధ్యక్షుడు గోమారి సుధాకర్రెడ్డి, కౌన్సిలర్ ఎ.వి.కిరణ్కుమార్ తదితరులు ఉన్నారు.