KCR | కరీంనగర్, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ఉద్యమం అయిపోలేదని, పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా ముందున్నదని, మన బాధ్యత అయిపోలేదని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇంత జల్దీగా ప్రజల నుంచి వ్యతిరేకత రావడం చూస్తేనే కాంగ్రెస్ సంగతి తెలిసిపోతున్నదని, ఇప్పుడు మళ్లీ తెలంగాణ మర్లవడ్డదని పేర్కొన్నారు. తెలంగాణకు మనం ఇంకా పనిచేసే బాకీ ఉన్నదని తెలిపారు. ఇప్పుడున్న పరిపాలకులకు రాష్ర్టాన్ని కాపాడాలనే ఆకాంక్ష లేదని, మళ్లీ బాగుచేయాల్సిన బాధ్యత మనదేనని శ్రేణులకు సూచించారు. ఆదివారం వీణవంకలోని హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కేసీఆర్ ఉద్వేగభరితంగా మాట్లాడారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలన, ఇప్పుడు కాంగ్రెస్ ఐదు నెలల పాలన గురించి కండ్లకుగట్టారు. అదే సమయంలో ఎంపీగా వినోద్కుమార్ను గెలిపించుకోవడం ఎంత అవసరమో పూసగుచ్చినట్టు వివరించారు. వీణవంకలో కేసీఆర్ వేదికపైకి రాగానే ‘సీఎం కేసీఆర్’ అనే నినాదాలు మార్మోగాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఎంత సముదాయించినప్పటికీ ఆగకపోగా, చివరికి పిడికిలి బిగించి పార్టీ శ్రేణులు ‘జై కేసీఆర్’ ‘జై తెలంగాణ.. కారు గుర్తుకే మన ఓటు’ అని నినదించారు. ఒక దశలో అధినేత కేసీఆర్ జోక్యం చేసుకొని సముదాయించడంతో నినాదాలు ఆపివేశారు. సమావేశంలో ఒకవైపు ఛలోక్తులతో నవ్విస్తూనే, మరోవైపు తెలంగాణకు పొంచి ఉన ప్రమాదాన్ని వివరిస్తూ ఆకట్టుకున్నారు. ‘అనుకోకుండా కొన్ని సందర్భాలు వస్తయి.
పోయిన ఎన్నికల్లో మనం ఓడిపోయినం. అందులో పెద్ద బ్రహ్మ రహస్యం ఏమీ లేదు. చాలా సింపుల్ మాట’ అని చెప్పినప్పుడు సభ ఒక్కసారిగా సైలెంట్ కాగా, మళ్లీ తనదైన శైలిలో ఛలోక్తులు విసిరారు. ‘మనోళ్లకు ఓ అలవాటు ఉంటది కదా! జర మంచిగా కాగానే ఉబ్బడం, జరంత ఎటమటం కాగానే తగ్గడం. ఇదంతా తెలంగాణోళ్లకు అలవా టే’ అంటూ నవ్వించారు. ‘ఇగ నీళ్లొచ్చినయి. రైతు బంధువొచ్చింది. 24 గంటల కరెంటొచ్చింది. అన్ని అయిపోయినయి కదా! ఇప్పుడు వాడేమో ఎక్కువ ఇస్తడనుకొని ఆశకు పోయిన్రు. మనం మరింత మంచిగ జేద్దాం అనుకున్నం. కానీ, దురాశకు పోయి నమ్మితే ఏమి జరిగిందో అర్థమవుతుంది కదా’ అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ‘నేను చెప్పిదంతా వెళ్లి ప్రజలకు వివరించి మన అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడాలి’ అని పిలుపునిచ్చినప్పుడు.. ‘గెలిపించుకుంటా’మంటూ నినాదాలు చేశారు. ‘నేను మీ అందరికి మాట ఇస్తున్న. ఒక రోజు హుజూరాబాద్కే వచ్చి 24 గంటలుంట. అప్పుడు నాలుగు వందల ఫొటోలు కాదు, నాలుగు వేల ఫొటోలైనా సరే తీసుకుందాం’ అంటూ నవ్వుతూ చెప్పడంతో మళ్లీ ‘మా సీఎం మీరే’నంటూ నినాదాలు చేశారు. సభ ముగిసిన అనంతరం పాడి కౌశిక్రెడ్డి ఇంటి నుంచి వీణవంక బస్స్టేషన్ వరకు రోడ్షో నిర్వహించారు.. మహిళల మంగళ హారతులు, సంప్రదాయ నృత్యాలు, డప్పుచప్పుళ్ల మధ్య కేసీఆర్ ముందుకు కదిలారు. బస్సులోంచి ప్రజలకు కేసీఆర్ అభివాదం చేశారు.
రేవంత్ మౌనానికి కారణమేంటి?
మీ గోదావరిని తీసుకెళ్లి తమిళనాడు, కర్ణాటకకు ఇస్తా అని నరేంద్ర మోదీ బాజాప్తా చెప్తున్నడు. ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పంపించిండు. సీఎం దీనిపై కిక్కురు మనడం లేదు. నేడు అడుగుతున్నా. అందులో ఏం మతలబ్ దాగి ఉన్నది? మౌనానికి కారణమేంటి? ఉన్న గోదావరి పరాయి పాలైతే మన బతుకు ఏమి కావాలి? గోదావరి పోతే మనకు తాగు, సాగునీళ్లు ఎక్కడి నుంచి వస్తయి? మన బతుకు ఏమి కావాలి? ఇంత ప్రధానమైన విషయంపై సీఎం ఎందుకు మాట్లాడుతలేడు? అదే నేను సీఎం ఉన్నప్పుడు మోదీ ప్రపోజల్ పెడితే ముందు నా తెలంగాణ వాటా లెక్క తేల్చు, ఆ నీళ్లు అక్కడ పెట్టు, అప్పుడు మాత్రమే నేను దీనిపై మాట్లాడుతా అని చెప్పిన. అప్పటి దాకా నీవు ఎన్ని మీటింగ్లు పెట్టినా నేను రానని స్పష్టంగా చెప్పిన. దీంతో ఆనాడు ఆ ప్రతిపాదన ఆగిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఒక నిరర్థక ప్రభుత్వం ఉందన్న ఉద్దేశంతో మోదీ వాళ్ల ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నది. అందుకే నేను చెబుతున్న. పార్లమెంట్ ఎన్నికల్లో (బీఆర్ఎస్) మనోళ్లే 13 నుంచి 14 మంది ఎంపీలు ఉంటే ఇటువంటి ప్రతిపాదన వస్తే లేసి ఎగిరి గొంతు అందుకుంటరు. నువ్వు ఎట్లా తీసుకుపోతావు బిడ్డా అని ప్రశ్నిస్తరు. ప్రస్తుతం ఇక్కడ లేం. ఇక్కడ లేనప్పుడు అక్కడ కూడా లేకపోతే ఎలా? ఇక్కడ లేక, అక్కడ లేక ఆగమైపోతే ఎవరు కాపాడాలి? ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి.
– బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే
మీ అందరినీ ఒకటే కోరుతున్నా. ఇంత జల్దీ అంటే కేవలం నాలుగైదు నెలల్లోనే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఈ ప్రభుత్వం కొసముట్టేది కాదు. రెండోది వందశాతం చెబుతున్నా.. నా మాట మీద విశ్వాసం ఉంచండి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా అవి మధ్యలో వచ్చినా లేదా, కొసకొచ్చినా మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది. అందులో ఎవరికీ ఎటువంటి అనుమానాలు అవసరం లేదు.
– కేసీఆర్
గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేయాలి
ఇది టెంపరరీ సెట్బ్యాక్ మాత్రమే. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు నిబ్బరం ఉండాలి. మేం గెలిస్తేనే లెక్క. లేకపోతే లేదు అని ఎప్పుడూ అనుకోవద్దు. ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల జీవితంలో ఉండాలి అనుకునే వాళ్లు గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలి. దటీజ్ పాలిటిక్స్. రాజకీయంలో ఒకసారి ఓడుతం. మరోసారి గెలుస్తం. అది పెద్ద సమస్య కాదు. నేనిప్పుడు చాలా గ్రామాలు, ప్రాంతాలు తిరిగి వచ్చిన తర్వాత చెబుతున్న. కాంగ్రెస్ ప్రభుత్వం సంగతి తెలిసిపోయింది కదా. అందుకే తెలంగాణ మళ్లీ ఇప్పుడు మర్లవడ్డది.
– బీఆర్ఎస్ అధినేత కేసీఆర్