లక్నో: బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం సుమారు 50 సార్లు ప్రయత్నించాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. (Kanpur BTech gold medallist) ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ సంఘటన జరిగింది. గోవింద్ నగర్లోని గుజైని ప్రాంతంలో నివసించే 23 ఏళ్ల ఆనంద్ 2024లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సులో టాపర్గా నిలిచాడు. ఉత్తరప్రదేశ్లో మూడవ ర్యాంకు సాధించాడు. 2024 ఆగస్ట్ 13న జరిగిన కాలేజీ కార్యక్రమంలో ఆయనకు బంగారు పతతాన్ని బహూకరించారు.
కాగా, ఆనంద్ కుటుంబ సభ్యులు సోదరుడి వివాహ ఏర్పాట్ల కోసం బీహార్ వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి పనిమనిషి తలుపుతట్టినప్పటికీ ఎంతకీ డోర్ తీయకపోవడంతో పొరుగువారిని అలెర్ట్ చేయడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూశారు. ఆనంద్ సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. చేతిరాతతో ఉన్న ఐదు లైన్ల లేఖ కూడా పోలీసులకు లభించింది. ‘క్షమించండి నాన్నా, ప్రభుత్వ ఉద్యోగం కోసం దాదాపు 50 సార్లు ప్రయత్నించాను. కానీ విజయం సాధించలేకపోయాను. దయచేసి నన్ను క్షమించండి’ అని రాసి ఉంది. పోస్ట్మార్టం తర్వాత ఆనంద్ మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. అతడి మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.