హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : సెప్టెంబర్ 17న ‘ప్రజాపాలన దినోత్సవం’ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో సాక్షాత్తు ప్రజాప్రతినిధులకే ప్రొటోకాల్ లేకుండా పోయింది. గురువారం పబ్లిక్గార్డెన్లో ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా పలువురు హాజరయ్యారు. ముందు వరసలో కొన్ని సీట్లను ఖాళీగా పెట్టగా.. అప్పటికే వచ్చిన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వెనుకసీట్లో కూర్చున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రితోపాటు వచ్చిన ఆయన అనుచరులు రోహిణ్రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఫహీమ్ ఖురేషీ ముందు వరసలో కూర్చుకున్నారు. దీంతో ప్రొటోకాల్ పాటించాల్సిన అధికారులు.. గమ్మునుండటంతో మాజీ సీఎస్, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ఇతర సీనియర్ అధికారులు వెనుక సీట్లలోనే సర్దుకున్నారు.
కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగా.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జాతీయపతాకం ఆవిష్కరించారు. అప్పటినుంచి ఆయన ఉపన్యాసం ముగిసే వరకూ ముందు వరసలో కూర్చున్న రోహిణ్రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఫహీమ్ ఖురేషీ, అంజన్కుమార్ యాదవ్.. అధికారులను గాని, దళిత ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ను కానీ ముందుకు పిలువలేదు. వారితోపాటు ఎమ్మెల్సీ కోదండరామ్రెడ్డి, ఎమ్మెల్యే బొజ్జి సైతం అదే వరసలో చివర్లో, దూరంగా కూర్చోవల్సి వచ్చింది. ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ హోదాలో ఉన్న అద్దంకి దయాకర్ను వెనుక వరుసలో కూర్చోబెట్టి, ఎలాంటి ప్రభుత్వ హోదా లేని రేవంత్రెడ్డి అనుచరులను ముందు వరుసలో కూర్చోబెట్టడం చర్చకు దారితీసింది.