న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: దేశంలో గత 20 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా వరి దిగుబడి పడిపోయింది. పంట పక్వానికి వచ్చే సమయంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు కావడంతో దిగుబడి తగ్గే ప్రమాదం ఉన్నదని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. థాయ్లాండ్, వియత్నాం వంటి ఇతర ఎగుమతి దేశాల్లో ఇప్పటికే ధరలు పెరుగుతున్న తరుణంలో ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తి, ఎగుమతి దేశంలో దిగుబడి తగ్గడం వల్ల స్థానిక ధరలు పెరుగుతాయని, ఎగుమతులు ఖరీదైనవిగా మారుతాయని వారు పేర్కొంటున్నారు.
‘తక్కువ వర్షపాతం కారణంగా ఈ ఏడాది దిగుబడి తగ్గుతుంది. 10 మిలియన్ మెట్రిక్ టన్నులు తగ్గుతుందని అంచనా వేస్తున్నాం’ అని రైస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బీవీ కృష్ణారావు తెలిపారు. గత ఏడాది 154 మిలియన్ టన్నులతో పోలిస్తే ఈ ఏడాది 6.5 శాతం తగ్గవచ్చునని, 2009/10 తర్వాత తొలిసారిగా ఆ స్థాయి తగ్గుదల నమోదవుతున్నదనిఅన్నారు. చాలామంది రైతులు ప్రీమియం వరి రకాలను పండించడంతో వారికి ఓపెన్ మార్కెట్లో అధిక ధరలు లభిస్తున్నాయని, దీంతో వారు తమ పంటను తక్కువ పరిమాణంలో ప్రభుత్వానికి అమ్ముతున్నారని చెప్పారు.