తిరువనంతపురం: పెళ్లి సంబంధం కోసం ఒక వ్యక్తి మ్యారేజ్ బ్యూరోలో పేరు నమోదు చేసుకున్నాడు. అయితే 9 ఏళ్లు గడిచినా అతడికి సంబంధం కుదరకపోవడంతో పెళ్లి కాలేదు. ఈ నేపథ్యంలో నష్టపరిహారం కోసం వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాడు. (marriage bureau) కేరళలోని కన్నూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కన్నూర్కు చెందిన నర్సింగ్ కాలేజీ ప్రొఫెసర్ 2016 నవంబర్లో శ్రీచక్ర మ్యారేజ్ బ్యూరోను సంప్రదించాడు. పెళ్లి సంబంధం కోసం రూ.3,000 ఫీజు చెల్లించాడు. కాసరగోడ్కు చెందిన అమ్మాయితో పెళ్లి సంబంధం కుదుర్చుతామని ఆ మ్యారేజ్ బ్యూరో హామీ ఇచ్చింది.
కాగా, 9 ఏళ్లు గడిచినప్పటికీ ఆ ప్రొఫెసర్కు తగిన పెళ్లి సంబంధాన్ని కుదర్చడంలో ఆ మ్యారేజ్ బ్యూరో విఫలమైంది. ఆయన రిజిస్టర్ ప్రొఫైల్ యాక్టివ్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయింది. తగిన సంబంధం వస్తుందని పదే పదే హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి వృద్ధ తల్లిదండ్రులు అతడి పెళ్లి కోసం చాలా కాలం ఎదురు చూశారు. 2025 అక్టోబర్లో ఆయన తండ్రి క్యాన్సర్తో మరణించగా, అనారోగ్యంతో ఉన్న తల్లి అతడి పెళ్లి కోసం ఆశతో ఎదురుచూస్తూనే ఉన్నది.
మరోవైపు 9 ఏళ్లుగా తనకు పెళ్లి కాకపోవడంతో ఆ ప్రొఫెసర్ మానసిక వేదనకు గురయ్యాడు. పెళ్లి సంబంధం కుదర్చడంలో విఫలమైన ఆ మ్యారేజ్ బ్యూరోపై వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాడు. తనకు రూ.15,000 నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు.
అయితే వినియోగదారుల కమిషన్ జారీ చేసిన నోటీసులకు మ్యారేజ్ బ్యూరో యాజమాన్యం స్పందించలేదు. దీంతో ఈ కేసుపై ఏకపక్షంగా వ్యవహరించింది. సేవా లోపం ఉన్నట్లు నిర్ధారించింది. రూ. 3,000 రిజిస్ట్రేషన్ రుసుము తిరిగి ఇవ్వాలని, మానసిక వేదనకు పరిహారంగా రూ. 3,000, న్యాయపరమైన ఖర్చుల నిమిత్తం రూ. 2,000 చెల్లించాలని ఆదేశించింది.
అలాగే ఈ ఉత్తర్వు అందిన 30 రోజులలోపు ఈ మొత్తాన్ని చెల్లించాలని వినియోగదారుల కమిషన్ పేర్కొంది. విఫలమైతే రూ.3,000 చెల్లించే వరకు ఏడాదికి 9 శాతం వడ్డీ కూడా చెల్లించాలని ఆదేశించింది. అలాగే ఆ మ్యారేజ్ బ్యూరో ఈ ఆదేశాలను అమలు చేయని పక్షంలో, వినియోగదారుల రక్షణ చట్టం కింద తదుపరి చట్టపరమైన పరిష్కారాన్ని కోరే వెసులుబాటును కూడా ఫిర్యాదుదారుడికి కల్పించింది.