మహబూబ్ నగర్ : కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులను ( Illegal projects ) అడ్డుకోవలసిన బాధ్యత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులపై ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) వెల్లడించారు. జిల్లా ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాకు సాగునీరు దక్కకుండా చేసేందుకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఆర్డీఎస్ ( RDS ) నుంచి అక్రమంగా నీరు తరలించేందుకు అనుమతి లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారని, దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆల్మట్టి వద్ద 300 టీఎంసీల నీరు నిలుపుకునేందుకు ఎత్తును పెంచు తున్నారని, దీనిని న్యాయపరంగా ఎదుర్కొనేందుకు ముందుకు వెళ్లాలని సూచించారు. తెలంగాణ కు నీళ్లు ఇవ్వవద్దని పని చేసిన ఆంధ్ర అధికారిని సలహాదారుగా నియమించిన ఆంధ్రకు మేలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని వివరించారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాజెక్ట్ లను పూర్తి చేసుకోవడం తో పాటు చెరువులు నింపడంతో సాగు విస్తీర్ణం పెరిగిందని అన్నారు. గతంలో రెండు లక్షల ఎకరాల సాగు ఉండగా, బీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలతో పది లక్షల ఎకరాలు సాగులోకి వచ్చిందని గుర్తు చేశారు. మహబూబ్ నగర్ లో 14 రోజులకు ఒకసారి తాగు నీళ్లు వచ్చేవని, మిషన్ భగీరథ ద్వారా ప్రతి రోజు కృష్ణ నీటిని ఇంటింటికి అందజేశామని వెల్లడించారు. పాలమూరు ప్రాజెక్ట్ను పూర్తి చేస్తే రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుందని ఆయన తెలిపారు.