మహబూబ్ నగర్ : బీఆర్ఎస్ ( BRS ) పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడంలో యువత కీలకపాత్ర పోషించాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ( Ala Venkateswar Reddy ) పిలుపునిచ్చారు. ఆదివారం దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో బీఆర్ఎస్ యువ నాయకులు,కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.పార్టీ సంస్థాగత నిర్మాణంలో యువకులకు కీలక బాధ్యతలు అప్పగిస్తామన్నారు.
యూత్ డిక్లరేషన్,గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోకుండా చూడాలన్నారు.గ్రామ స్థాయిలో ఒక్కో బీఆర్ఎస్ కార్యకర్త సైనికుడిగా పని చేయాలన్నారు.
నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలపై పోరాడితే భవిష్యత్తు మీదేనని భరోసానిచ్చారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని,అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.ప్రభుత్వ వైఫల్యాల పై ప్రజలను చైతన్యం చేస్తూ, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరించాలని కోరారు. కేసీఆర్ను మరోసారి సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆల ప్రీతి రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.