Amit Shah | ఆసిఫాబాద్/ వినాయ్నగర్ (నిజామాబాద్), మే 5 : తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఆర్ (రాహుల్/రేవంత్)టాక్స్ విధిస్తున్నదని, రాష్ట్రంలో కోట్ల రూపాయల ట్యాక్స్లు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో నిర్వహించిన వికాస సంకల్ప యాత్ర, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ‘ఇందూరు విశాల జనసభ’లో ఆయన మాట్లాడారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్నీ స్కాములే ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్ కాలంలో రోజూ బాంబు దాడులు జరిగేవని, ఇప్పుడా పరిస్థితి లేదని, ప్రశాంతంగా ఉందన్నారు.
మజ్లిస్, ఒవైసీ అంటే కాంగ్రెస్కు భయమని, కాంగ్రెస్, ఓవైసీ ఒక్కటేనని, అందుకే రామమందిర ప్రారంభోత్సవానికి రాహుల్ గాంధీ హాజరు కాలేదన్నారు. రిజర్వేషన్లు రద్దు అంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని, తన వీడియోను కూడా తప్పుగా వైరల్ చేసిందని చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తామన్నారు. దేశంలో పీఎఫ్ఐ సంస్థ రూపులేఖలను కూడా లేకుండా చేసింది బీజేపీయేనని, ఓవైసీలాంటి వారు ఈ దేశంలో పీఎఫ్ఐ లాంటి సంస్థలను ప్రోత్సహిస్తే జాగ్రత్త అంటూ హెచ్చరించారు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలను కాంగ్రెస్సే మూయించిందని గుర్తుచేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. నకిలీ వీడియో చేయించిన రేవంత్, ఢిల్లీ పోలీసులు తన వెంటబడుతున్నారంటున్నాడని, తప్పుడు పనులు చేసే వారికి ఇదే గతి పడుతుందని అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు.