తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలన్నీ పూర్తిచేసి చూపించాం. రాష్ట్రంలోని మహిళలందరి బ్యాంకు ఖాతాల్లో ప్రతి నెలా రూ.2500 ప్రభుత్వం జమ చేస్తున్నది. ఇట్ల ఏడాదికి ఒక్కో మహిళకు 30వేల రూపాయలు అందుతున్నయ్.
– నిర్మల్ బహిరంగ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ నేతలది పూటకోమాట.. రోజుకో అబద్ధం! అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రారంభించిన గ్యారెంటీల గారడీని కాంగ్రెస్ నేతలు లోక్సభ ఎన్నికల ముంగిట కూడా కొనసాగిస్తున్నారు. ‘హామీలన్నీ అమలు చేసేశాం.. చెప్పిందంతా పూర్తిచేశాం’ అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారు. రైతుభరోసా చెల్లించేశామని ముఖ్యమంత్రి రేవంత్ చెప్తుంటే.. అసలు రాష్ట్రంలో కరెంటు కోతలే లేవని, నిరుద్యోగ భృతి హామీ అసలు తామివ్వనేలేదని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు. వందరోజుల్లో రుణమాఫీ చేస్తామని తామెక్కడా చెప్పలేదని రేవూరి ప్రకాశ్రెడ్డి వాదిస్తున్నారు. హామీల అమలుపై పూటకోసారి నాలుక మడతేస్తున్న కాంగ్రెస్ నాయకుల్లో ఇప్పుడు రాహుల్గాంధీ కూడా చేరారు. ఆదివారం జరిగిన నిర్మల్ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలనెలా రూ.2500 ఇప్పటికే అందిస్తున్నామని పచ్చి అబద్ధాన్ని ప్రజల సాక్షిగా ప్రకటించారు.
Rahul Gandhi | హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): అబద్ధాలే ఊపిరిగా.. అబద్ధాలే జీవన విధానంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ అలవోకగా మరో అబద్ధం చెప్పేసింది! ఈసారి ఏకంగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ నోటితోనే రాష్ట్ర నేతలు పచ్చి అబద్ధాలు వల్లె వేయించారు. రాష్ట్రంలోని 18 ఏండ్లు నిండిన మహిళలకు నెలకు రూ.2,500 జమ చేస్తున్నట్టు రాహుల్గాంధీతో చెప్పించి, యావత్ మహిళా లోకానికే షాకిచ్చారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పరంపరలో మరో అబద్ధం చేరిపోయింది. అలవికాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రంలో అధికారం చేపట్టిన నాటి నుంచి రోజుకో అబద్ధం చెప్పడం, గ్యారెంటీల అమలుకు ముహూర్తాలు, డెడ్లైన్ ప్రకటించి చివరకు తుస్సు మనిపించడం కాంగ్రెస్ నేతలకు పరిపాటిగా మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిచిపోయిన రైతుబంధుకు మరో రూ.ఐదు వేలు జోడించి అధికారంలోకి రాగానే రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ దానిని పూర్తి చేయలేదు.
రైతుభరోసా కింద రూ.15 వేలు ఇవ్వకపోగా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రూ.పది వేలు కూడా ఇవ్వకుండా రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నది. అందరికీ రైతుబంధు జమ చేశామని ఒకసారి, ఇక నాలుగు లక్షల మందికే ఇవ్వాల్సి ఉన్నదని మరోసారి చెప్తూ కాలయాపన చేస్తున్నది. ఇంకోవైపు రైతుబంధు రాలేదన్న వారిని చెప్పుతో కొట్టండంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించి, రైతుల పట్ల తన చులకన భావాన్ని బహిరంగంగానే వ్యక్తంచేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతుబంధుపై గట్టిగా ప్రశ్నిస్తుండటంతో ఈ నెల 9లోగా అందరి ఖాతాల్లో జమ చేస్తామని మరో కొత్త డెడ్లైన్ పెట్టి ఊరిస్తున్నది. రైతు రుణమాఫీ విషయంలోనూ అదే ధోరణి. డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తామని ప్రకటించుకున్న కాంగ్రెస్.. మే 9 వస్తున్నా మాట నిలుపుకోలేదు.
మరోవైపు, వంద రోజుల్లో రుణమాఫీ చేస్తామని తాము చెప్పలేదని ఆ పార్టీ నేత రేవూరి ప్రకాశ్రెడ్డి ప్రకటించడంతో రైతులు హతాశులయ్యారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రుణమాఫీ అంశం ఎజెండా మీదకు రావడం, బీఆర్ఎస్ నేతలు పదేపదే నిలదీస్తుండటంతో ఇప్పుడు పంద్రాగస్టు లోగా అంటూ మరో ముహూర్తం నిర్ణయించింది. రైతు రుణమాఫీని ఎలా చేస్తారు? ఎవరెవరికి వర్తింపజేస్తారు? విధివిధానాలేమిటి? అనే అంశాలపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేని అయోమయం. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏ ఊరి వెళ్తే ఆ ఊరి దేవుళ్లు, దేవతల మీద ఒట్టు మీద ఒట్టు పెడుతూ రైతులను నమ్మించేందుకు నానా తంటాలు పడుతున్నారు.
రైతులు పండించిన పంటలకు రూ.500 బోనస్ హామీ బోగస్ ముచ్చటగా వెక్కిరిస్తున్నది. ఒకవైపు కరెంటు కష్టాలు చుట్టుముట్టి బోర్ల కాడ మోటర్లు కాలిపోతుంటే రాష్ట్రంలో విద్యుత్తు కోతలే లేవని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సెలవిస్తున్నారు. నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామంటూ ప్రియాంకాగాంధీ చేత యూత్ డిక్లరేషన్ ప్రకటింపజేసి అధికారంలోకి రాగానే మాట మార్చింది. అసలు తాము నిరుద్యోగ భృతి హామీయే ఇవ్వలేదంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిరుద్యోగ యువతను వెక్కిరించారు. ఇలా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరిస్తూ, ఏ ఒక్క హామీ అమలు విషయంలోనూ ఏమాత్రం నిబద్ధత ప్రదర్శించిన కాంగ్రెస్ ఇప్పుడేమో ఐదు గ్యారెంటీలు, ఆరు గ్యారెంటీలు అమలు చేసేశామంటూ నయవంచనకు పాల్పడుతుండటం విస్మయం కలిగిస్తున్నది.
నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీల్లో ఇప్పటికే ఐదింటిని అమలు చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, రూ.500కే గ్యాస్ సిలిండర్, పది లక్షల ఆరోగ్య బీమా, మహిళలకు రూ.2,500 ఇస్తున్నామని తెలిపారు. తాము కేంద్రంలో అధికారంలోకి రాగానే దేశంలోని పేదలందరినీ గుర్తించి ఆ ఇంట్లోని మహిళకు బ్యాంకు ద్వారా రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం ఆయన నిర్మల్ జిల్లా కేంద్రంతోపాటు, జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి చౌరస్తాలో నిర్వహించిన జనజాతర సభలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో కలిసి హాజరయ్యారు.
ఆయా సభల్లో రాహుల్గాంధీ మాట్లాడుతూ.. బీజేపీకి మళ్లీ అధికారం ఇస్తే రాజ్యాంగం ద్వారా భారత పౌరులకు కల్పించిన హక్కులు, రిజర్వేషన్లు పూర్తిగా తొలగిస్తారని హెచ్చిరించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చలన్నది బీజేపీ సిద్ధాంతమని, దానిని రక్షించాలన్నది కాంగ్రెస్ సిద్ధాంతమని దేశ ప్రజలు ఆలోచించి ఏ పార్టీ కావాలో నిర్ణయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేసి, కులగణన ద్వారా అంత కంటే ఎక్కువ పెంచుతామని హామీ ఇచ్చారు. మోదీ పదేండ్ల పాలన అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని, దేశ సంపదను సామాన్యులకు అందివ్వకుండా సంపన్నులకు అందేటట్టు చూస్తున్నదని ఆరోపించారు.
దేశంలో 130 కోట్ల జనాభా ఉంటే కేవలం 20% మంది వద్దనే సంపద పేరుకుపోయిందని, కాంగ్రెస్ పార్టీ విధానం అది కాదని చెప్పారు. దేశ సంపదను పేద ప్రజలందరికీ పంచాలన్న ఉద్దేశంతోనే పోరాడుతున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి వెనుకబడ్డ దళితులు, మైనార్టీలు, బీసీలు, ఆదివాసులకు న్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని వివరించారు. దేశంలో మోదీ పాలనలో ఈ వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు తాను చేపట్టిన భారత్ జోడో యాత్రకు విశేష స్పందన వచ్చిందని, ప్రజలు తమ సమస్యలను చెప్పుకున్నారని, వాటి పరిష్కారానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు.
రైతు రుణమాఫీపై రోజుకో దేవుడిపై ఒట్టు పెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం నిర్మల్ జనజాతర సభలో మాట్లాడుతూ.. ఇంద్రవెల్లి అమరవీరుల సాక్షిగా ఒట్టు పెట్టారు. ఎర్రవెల్లి జనజాతరలో మాట్లాడుతూ.. జోగుళాంబ అమ్మవారి సాక్షిగా ఒట్టు పెట్టారు. ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ, ఈ నెల 9 లోపు రైతు భరోసా అందజేస్తామని చెప్పారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఇక్కడికి వచ్చినప్పుడు ఆదిలాబాద్ను దత్తత తీసుకుంటానని చెప్పానని, ఇప్పుడు కూడా అదే మాటకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఇప్పటికే ఐదు గ్యారెంటీలను అమలు చేశామని, రాబోయే రోజుల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు. ఆయా సభల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లురవి, ఆదిలాబాద్ అభ్యర్థి ఆత్రం సుగుణ, తదితరులు పాల్గొన్నారు.