పెద్దఅడిశర్లపల్లి మే 5 : సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. పెద్దఅడిశర్లపల్లి మండలంలోని అజ్మాపురం గ్రామంలో ఆదివారం ఆయన ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా రవీంద్రకుమార్ మాట్లాడుతూ పదేండ్లలో లేని కరెంట్, సాగు, తాగునీటి సమస్యలు కాంగ్రెస్ సర్కారులో మళ్లీ మొదలయ్యాయన్నారు. హామీల అమలులో కాంగెస్ పార్టీ విఫలమైందని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి పేదలపై అధిక భారం మోపిందని విమర్శించారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వల్లపురెడ్డి, నాయకులు ముత్యంరావు, గోవర్ధన్, శ్రీనివాస్, మహేందర్, రామకృష్ణ పాల్గొన్నారు.