కట్టంగూర్, మే 5 : కాంగ్రెస్, బీజేపీ మాయమాటలు నమ్మి మోసపోద్దని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ను గెలిపించాలని కోరుతూ మండలంలోని పామనుగుండ్ల, పిట్టంపల్లి గ్రామాల్లో ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను తుంగలో తొక్కిందన్నారు.
ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక మొదలైందని, బీఆర్ఎస్ తెచ్చిన రైతుబంధును నిర్వీర్యం చేసిందని, రైతులకు కరెంట్ కష్టాలు తెచ్చిపెట్టిందని విమర్శించారు. ప్రజలను మోసం చేయడంలో సీఎం రేవంత్రెడ్డిని మించిన నాయకుడు లేడన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, నాయకులు పోగుల నర్సింహ, జానీపాషా, వడ్డె సైదిరెడ్డి, పసన సైదులు, గుండగోని రాములు, రవి, శ్రీను, దేవేందర్, భిక్షం, నర్సింహ పాల్గొన్నారు.